అంకాపూర్ నాటుకోడి కూర
అంకాపూర్ నాటుకోడి కూర తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు మండలం మండలం, అంకాపూర్ గ్రామంలో తయారుచేసే కోడికూర.[1][2] అంకాపూర్ గ్రామం పేరుతో ప్రసిద్ధిచెందిన ఈ కోడికూర తెలంగాణ వంటకంగా పేరుగాంచింది.
మూలము | |
---|---|
మూలస్థానం | భారతదేశం |
ప్రదేశం లేదా రాష్ట్రం | అంకాపూర్, ఆర్మూరు మండలం మండలం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, |
వంటకం వివరాలు | |
ప్రధానపదార్థాలు | కోడికూర |
చరిత్ర
1980లలో పెద్ద రామాగౌడ్ అనే వ్యక్తి నాటుకోడి కూర రుచిగా వండేవాడు. అది చూసిన గ్రామ పెద్దల కోరికమేరకు ఓ హోటల్ను ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రత్యేకమైన పదార్థాల మిశ్రమంతో ఈ కోడికూరను తయారుచేసేవాడు. కొద్దిరోజుల తరువాత ఇతర ప్రాంతాలలో ప్రాచుర్యం పొందడంతో నిజామాబాదు పట్టణానికి వచ్చే ప్రజలు దీనిని రుచి చూడటానికి అంకాపూర్ గ్రామానికి వచ్చేవారు. ఆ తరువాత కొంతకాలానికి తాళ్లపెల్లి చిన్నరామాగౌడ్, దుబ్బాగౌడ్, బోయ బొర్రన్నలు కూడా దీని తయారీని ప్రారంభించారు. పెద్ద రామాగౌడ్ మరణాంనంతరం ఆయన కుమారుడు మల్లాగౌడ్ నిజామాబాదులో ఉండి, దీనిని తయారు చేస్తున్నాడు.[3]
ప్రస్తుతం అంకాపూర్ గ్రామంలో భూమేశ్, పాపగౌడ్, కోళ్ల కిష్టయ్య, నారాయణగౌడ్, రాజు, రవి మొదలైన వారి ఆధ్వర్యంలో పదకొండు, నిజామాబాద్లో మూడు కోడికూర తయారీ కేంద్రాలు ఉన్నాయి.
తయారీ
నిత్యం వాడే మసాలాలకు భిన్నమైన మసాల దినుసులను ఈ కూర తయారికి వాడుతారు. తరిగిన ఉల్లిపాయ, దంచిన అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, కరివేపాకు, పసుపు ప్రధానంగా ఉండగా, కల్వంలో దంచిన ఎండు కొబ్బరి తురుము, పల్లీల పొడి, ఏలకులు, లవంగము, సాజీర, కొత్తిమీర వంటివి ఉపయోగిస్తారు.
శుభ్రపరిచిన నాటుకోడి మాంసానికి పసుపు రాసి మంటపై కాలుస్తారు. శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి స్వయంగా నూరుకున్న మసాల దినుసులు, అల్లం వెల్లుల్లి, పసుపు, ధనియాల పొడి కలిపి పదినిమిషాలపాటు ఉంచుతారు. తరువాత స్టౌవ్మీద పాత్రలో తగినంత పల్లీ నూనె పోసి ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి, కరివేపాకు, మెంతికూర వేసి వేగాక చికెన్ వేస్తారు. తగినంత నీరు, ఉప్పు వేసి 20 నిమిషాలు ఉండికించగా నాటుకోడి కూర తయారవుతుంది.[1]
ప్రాముఖ్యత
- తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1985లో సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫియట్ కారులో ఒక్కడే అంకాపూర్కు వచ్చి విలేకరినని చెప్పి నాటుకోడి మాంసం తినేవాడు.[3]
- ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతరులు నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు వారి భోజనాలలో ప్రత్యేకంగా అంకాపూర్ నాటు కోడికూర వంటకం తప్పనిసరిగా ఉండేలా చూస్తారు.
- 2017లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు సదస్సులో తెలంగాణ వంటకాల్లో భాగంగా ఈ కోడికూరను కూడా పెట్టడం జరిగింది.[4]
- దీనిని సంబంధించిన రెస్టారెంట్లు హైదరాబాదులోని కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్, యు.ఎస్.ఏ వంటి దేశాలలో కూడా ఈ వంటకం ప్రాచుర్యం పొందింది.[5]
- అమెరికా, శ్రీలంక, రష్యా, లండన్, గల్ఫ్ దేశాలైన దుబాయి, మస్కట్, బహ్రయిన్, ఖతార్ వంటి దేశాలకు నెలకోసారి పార్సిల్స్ ద్వారా ఎగుమతి అవుతుంది.