అల్లాడి కృష్ణస్వామి అయ్యర్
దీవాన్ బహదూర్ సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ (1883 మే 14 – 1953 అక్టోబరు 3) భారతీయ న్యాయవాది, రాజ్యాంగ రచనకై ఏర్పరచబడిన భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు. ఈయన 1929 నుండి 1944 వరకు మద్రాసు రాష్ట్ర అడ్వొకేటు జనరల్ గా కూడా పనిచేశాడు. ప్రముఖ నాడీశాస్త్రజ్ఞుడు విలయనూర్ ఎస్. రామచంద్రన్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మనవడు.
అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ | |||
భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడు | |||
మద్రాసు ప్రెసిడెన్సీ అడ్వొకేట్ జనరల్ | |||
పదవీ కాలం 1929 – 1944 | |||
ముందు | టి.వి.వెంకటరామశాస్త్రి | ||
---|---|---|---|
తరువాత | పి.వి.రాజమన్నార్ | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | పూడూరు, మద్రాసు ప్రెసిడెన్సీ, భారతదేశం | 1883 మే 14||
మరణం | 1953 అక్టోబరు 3 మద్రాసు | ||
జీవిత భాగస్వామి | వెంకలక్ష్మమ్మ |
ప్రారంభ జీవితం
అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ 1883లో మద్రాసు రాష్ట్రంలోని పూడూరు అనే చిన్న గ్రామంలో జన్మించాడు (ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్నది). ఈయన తండ్రి ఏకామ్రశాస్త్రి అర్చకుడు. కృష్ణస్వామి 1899లో మెట్రిక్యులేషన్ పూర్తిచేసుకొని మద్రాసు క్రైస్తవ కళాశాలలో చరిత్ర చదవటానికి చేరాడు. తన ఖాళీ సమయంలో న్యాయశాస్త్ర తరగతులలో పాఠాలు నేర్చుకొని బి.ఎల్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వత మద్రాసు న్యాయవాదుల సంఘంలో ప్రముఖ న్యాయవాదిగా ఎదిగాడు.
1930లో ఈయన దీవాన్ బహదూరుగాను, 1932 కొత్త సంవత్సర గౌరవజాబితాలో సర్ గానూ సన్మానం పొందాడు.[1] ఈయనకు వెంకలక్ష్మమ్మతో వివాహమైంది.ఈయన 1929 నుండి 1944 వరకు మద్రాసు రాష్ట్ర అడ్వొకేటు జనరల్ గా కూడా పనిచేశాడు. భారత రాజ్యంగ రచనలో ప్రముఖపాత్ర పోషించాడు[2] రాజ్యాంగ ప్రధాన సృష్టికర్త, రచనా సంఘపు అధ్యక్షుడైన అయిన బి.ఆర్.అంబేద్కర్, రాజ్యాంగ రచన అల్లాడి పోషించిన పాత్రను కొనియాడుతు "రచనా సంఘంలో నా స్నేహితుడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ వంటి, నాకంటే పెద్దవారు, గొప్పవారు , సమర్ధవంతమైన వ్యక్తులు ఉన్నారు" అని ప్రశసించాడు.[3] రాజ్యాంగ పరిషత్తు సార్వజనీక వయోజన ఓటుహక్కును అనే ఆదర్శాన్ని చేపట్టినప్పుడు కృష్ణస్వామి అయ్యర్, “సామాన్య ప్రజలపై అపారమైన నమ్మకంతో, ప్రజాస్వామ్య పరిపాలనే తుదికి జయిస్తుందనే నిశ్చలమైన అభిప్రాయంతో, సార్వజనీక ఓటుహక్కుతో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పితే అది అందరికీ జ్ఞానోదయం , శాంతి సౌభ్రాతుత్వాలు, సామాన్య ప్రజలందరికీ ఉన్నత జీవన ప్రమాణాలు, సౌఖ్యమైన, గౌరవప్రదమైన జీవనాన్ని చేకూరుస్తుందనే పూర్తి నమ్మకంతో” ఇది చేయబడిందని వ్యాఖ్యానించాడు.
అల్లాడి స్మారక ట్రస్టు
అల్లాడి స్మారక ట్రస్టు 1983 లో ఈయన కుమారుడు అల్లాడి కుప్పుస్వామిచే, తన తండ్రి కృష్ణస్వామి అయ్యర్ శతజయంతి స్మారకార్ధమై ప్రారంభించబడింది. ఈ ట్రస్టు యొక్క ప్రధాన లక్ష్యం పేద కక్షిదారులు, పేద న్యాయ విద్యార్థులకు సహాయం చేయటం, న్యాయం చేకూరేలా సహాయం చేయటం. భారత రాజ్యాంగ సంబంధిత విషయాలపై ప్రతిసంవత్సరం అల్లాడి స్మారక ఉపన్యాసాలు ప్రముఖ న్యాయవాదులచే ఇవ్వబడుతున్నాయి.[4] ఈ ఉపన్యాసకులలో వి.ఆర్.కృష్ణ అయ్యర్, వి.చంద్రచూడ్, పి.సి.రావు, పావని పరమేశ్వరరావు, నందితా హస్కర్, రమాదేవి, ఎం. జగన్నాథరావు తదితరులు ఉన్నారు.
మూలాలు
ఇవికూడా చూడండి
- Austin, G. 1966. The Indian Constitution: Cornerstone of a Nation. Clarendon Press, Oxford.