ఇంద్రావతి జాతీయ వనం
ఇంద్రావతి జాతీయ వనం చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జాతీయ వనం. పులుల రక్షితప్రాంతం. ఇది బిజాపూర్ జిల్లాలో ఇంద్రావతి నది తీర ప్రాంతంలో ఉంది.[1] 2799.08 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి చాలా రకాల అరుదైన జంతువులకు, వృక్షాలకు నెలవుగా ఉంది. దీనిని భారత ప్రభుత్వం 1975 లో జాతీయవనంగా గుర్తించింది. 1983 లో ప్రాజెక్ట్ టైగర్ లో భాగంగా దీన్ని టైగర్ రిజర్వుగా కూడా గుర్తించింది.
ఇంద్రావతి జాతీయ వనం | |
---|---|
ఇంద్రావతి టైగర్ రిజర్వు | |
IUCN category II (national park) | |
ప్రదేశం | బిజాపూర్ జిల్లా, చత్తీస్ గఢ్ |
సమీప నగరం | జగదల్పూర్ |
విస్తీర్ణం | 1,258.37 km2 (485.86 sq mi) |
స్థాపితం | 1975 |
పాలకమండలి | Conservator of Forest (Field Director) |
http://www.itrbijapur.in/ |
వృక్షజాలం
ఇంద్రావతి జాతీయ వనంలో వెదురు, సాల, టేకు వృక్షాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడున్న విస్తారమైన గడ్డి భూములు అడవి బర్రెలు, జింకలు, నీల్గాయ్, గౌర్లకు ఆహారంగా ఉన్నాయి. విప్ప, బీడీ ఆకు చెట్టు, బూరుగ, నేరేడు వృక్షాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటాయి.
జీవజాలం
ఇంద్రావతి జాతీయ వనంలో అంతరించిపోయే దశలో ఉన్న ఆసియా అడవి బర్రె నివసిస్తోంది. గౌర్, నీల్గాయ్, కృష్ణజింక, జింక, సాంబార్, దుప్పి, అడవి పంది వంటి గిట్టల జంతువులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడున్న వేటాడే జంతువుల్లో పులి, చిరుత, చారల హైనా, వేటకుక్క, ఎలుగుబంటి ఉన్నాయి. చిన్న క్షీరదాల్లో ఎగిరే ఉడుత, ముళ్ళపంది, పాంగోలిన్, కోతులు, లాంగూర్ ఉన్నాయి.[2] సరీసృపాల్లో మంచినీటి మొసలి, మానిటర్ బల్లి, ఊసరవెల్లి, కట్లపాము, కొండచిలువ, నాగుపాము, రక్తపింజరి మొదలైనవి ఇక్కడ ఉన్నాయి. కొండ మైనా ఇక్కడ ఉన్న పక్షి జాతుల్లో ముఖ్యమైనది.
రవాణా సౌకర్యాలు
చత్తీస్ గఢ్ లోని బస్తర్ జిల్లా కేంద్రమైన జగదల్ పూర్ నుండి ఇంద్రావతికి చక్కటి రవాణా సౌకర్యాలున్నాయి. వనానికి ముఖద్వారమైన కుట్రూ గ్రామం, జగదల్ పూర్ - భూపాలపట్నం రోడ్డు నుండి 22.4 కి.మీ. దూరంలో ఉంది. ఈ లింకు రోడ్డు జగదల్ పూర్ నుండి 145.6 కి.మీ. దూరంలో ఉంది. సమీప విమానాశ్రయం రాయ్పూర్ లోను, రైల్వేస్టేషను జగదల్ పూర్ లోనూ ఉన్నాయి.