దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి (బుజ్జాయి)
దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (11 సెప్టెంబరు 1931 - 27 జనవరి 2022) చిత్రకారుడు, రచయిత. ఈయన ప్రసిద్ధ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు. ఆయన కలం పేరు "బుజ్జాయి".[1]
దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి | |
---|---|
జననం | సుబ్బరాయశాస్త్రి సెప్టెంబరు 11 1931 పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా |
మరణం | 27 జనవరి 2022 చెన్నై |
మరణ కారణం | వృద్ధాప్య సమస్యలు |
ఇతర పేర్లు | బుజ్జాయి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత, చిత్రకారుడు, డుంబు సృష్టికర్త |
పిల్లలు | ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు |
తల్లిదండ్రులు |
|
బంధువులు | దేవులపల్లి సోదరకవులు |
జీవిత విశేషాలు
ఆయన దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు సెప్టెంబరు 11 1931లో జన్మించాడు. ఆయన సోదరి సీత. బుజ్జాయి గారిని కృష్ణశాస్త్రి గారు అందరిలా పాఠశాలకు పంపకపోవడంతో, ఆయనకి సంప్రదాయ పద్ధతుల్లో విద్యాభ్యాసం జరుగలేదు. సాంప్రదాయక చదువులు చదవకపోయినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. ఆయన తండ్రి వెన్నంటే ఉండేవారు. అలా ఉండడం వలన ఆ కాలం నాటి గొప్ప వ్యక్తులందరికి సన్నిహితంగా మెలిగారు. బాల్యంలో ఓ సభలో బోరు కొడుతుందని "శ్రీశ్రీ" గారు బుజ్జాయిని షికారుకు తీసుకుని వెళ్ళి ఆడించారట. అలా శ్రీశ్రీ, విశ్వనాథ సత్యన్నారాయణ వంటి కవుల, రచయితల, యితర ప్రముఖులతో ఆయన తన అనుభవాలను "నాన్న-నేను" అనే పుస్తకంలో కథలుగా వివరించారు. పంచతంత్ర కామిక్స్ ను మొట్టమొదట ఆంగ్లం లో ఆయన రాసాడు.[2]
17 సంవత్సరాల వయసులో బుజ్జాయి "బానిస పిల్ల" అన్న బొమ్మల పుస్తకం ప్రచురించి 'కామిక్ స్ట్రిప్' పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరుపొందారు. బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ డుంబు సృష్టికర్త ఈయనే. పంచతంత్ర కథలకు ముచ్చటైన బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో 1963 నుంచి 68 వరకూ సీరియల్ గా ప్రచురించారు. లక్షలమందిని ఆకట్టుకున్నారు. ఈ ఇంగ్లిష్ కామిక్స్ 5 పుస్తకాలుగా వచ్చాయి. మిత్రలాభం, మిత్రభేదం పుస్తకాలుగా ఇవి తెలుగులోనూ దొరుకుతున్నాయి. ఆయన డుంబు, భైరవ్, పెత్తందార్ కామిక్ స్ట్రిప్పులను వేసారు.[2]
రచనలు
‘న్యాయానికి భయం లేదు’ అనే బొమ్మల ధారావాహిక ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైనది.[3] ఇది 1975లో వచ్చింది. ఆయన "నాన్న-నేను" అనే స్వీయచరిత్ర పుస్తకాన్ని వ్రాసాడు.[4] ఆయన "నవ్వులబండి - డుంబు బొమ్మల కథలు" అనే పుస్తకాన్ని వ్రాసారు.[5]
వ్యక్తిగత జీవితం
ఆయన తమిళనాడు లోని తిరువాన్మయురుకు 4 కి.మీ దూరంలో నివసించేవాడు.[2] ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన తన కుమారునికి తన తండ్రి పేరు "దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి" అని పెట్టుకున్నారు. కుమారుడు కూడా రచయిత.[6] ఆయన ఆంగ్ల నవల ‘Jump Cut' రాసారు. బుజ్జాయి యొక్క కుమార్తె రేఖా సుప్రియ సినీనటుడు నరేష్ యొక్క మాజీ భార్య. ఆమె కుమారుడు తేజ.[7] బుజ్జాయి రెండవ కుమార్తె లలిత రామ్ కూడా తెలుగు రచయిత్రి.[8][9]
91 యేళ్ళ వయసులో దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి వృద్ధాప్య సమస్యలతో పాటు కొంత కాలం అనారోగ్యంతో బాధపడుతూ 27 జనవరి 2022న చెన్నైలోని స్వగృహంలో కన్నుమూశారు.[10]
మూలాలు
ఇతర లింకులు
- How a man who never went to school created (some of) India’s first comics
- "చిత్రకారుడు బుజ్జాయితో - ఓలేటి -" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-08-11. Retrieved 2021-08-15.