భాభా అణు పరిశోధనా కేంద్రం
బాబా అణు పరిశోధనా కేంద్రం, భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన ఒక అణుపరిశోధన సంస్థ. ఇది ముంబైకి సమీపంలోని ట్రాంబే అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ అణు శాస్త్రంలో విస్తృత పరిశోధనలు చేయడానికి కావలసిన అధునాతన పరికరాలు, వ్యవస్థ అందుబాటులో ఉన్నాయి.అణుశక్తిని ప్రధానంగా మానవాళి మేలు కొరకు ఉపయోగించడానికి ఈ సంస్థ ప్రయోగాలు చేస్తుంది.
भाभा परमाणु अनुसन्धान केंद्र | |
సంకేతాక్షరం | BARC |
---|---|
ఆశయం | Atoms in the service of the Nation |
స్థాపన | జనవరి 3, 1954[1] |
చట్టబద్ధత | పనిచేస్తున్నది |
కేంద్రీకరణ | అణు పరిశోధన |
ప్రధాన కార్యాలయాలు | ట్రాంబే, ముంబై |
కార్యస్థానం | |
డైరెక్టరు | కె.ఎన్. వ్యాస్ |
మాతృ సంస్థ | భారత అణుపరిశోధనా విభాగం |
బడ్జెట్ | ₹13.61 బిలియను (US$170 million) (2008–09) |
మారుపేరు | అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్ మెంట్ |
అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం, ముఖ్యంగా విద్యుదుత్పత్తి కోసం, వాడుకోవడమే BARC ప్రధాన ఉద్దేశం. రియాక్టర్ల సైద్ధాంతిక రూపకల్పన, కంప్యూటరీకరించిన మోడలింగ్, అనుకరణ, ప్రమాద విశ్లేషణ, కొత్త రియాక్టర్లు, కొత్త ఇంధన పదార్థాల అభివృద్ధి, పరీక్ష మొదలైన అణు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అన్ని వ్యవహారాలనూ ఇది నిర్వహిస్తుంది. వాడేసిన ఇంధనాన్ని ప్రాసెసింగ్ చెయ్యడం, అణు వ్యర్థాలను సురక్షితంగా పారవేయడంపై కూడా ఇది పరిశోధన చేస్తుంది. పరిశ్రమలు, ఔషధం, వ్యవసాయం మొదలైన వాటిలో ఐసోటోపులను వాడడం దాని ఇతర పరిశోధనాంశాలు. BARC దేశవ్యాప్తంగా అనేక పరిశోధన రియాక్టర్లను నిర్వహిస్తోంది .[2]
చరిత్ర
భారత ప్రభుత్వం 1954 జనవరి 3 న అణు పరిశోధన కోసం అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్ మెంట్, ట్రాంబే అనే సంస్థను స్థాపించింది. దీని ముఖ్య ఉద్దేశం వివిధ సంస్థల్లో అణు రియాక్టర్లు, వాటి సాంకేతిక పరిజ్ఞానం పైన పనిచేస్తున్న శాస్త్రవేత్తల కృషినంతటినీ ఒకే తాటిపైకి తీసుకురావడం. ఇందులో భాగంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) లో ఈ రంగంలో పనిచేస్తున్న వారినందరినీ ఈ సంస్థకి మార్చింది.తద్వారా TIFR కేవలం స్వచ్ఛమైన సైన్సు పరిశోధనలు చేసుకునేలా వీలు కల్పించింది.1966 లో భారతదేశ అణు పితామహుడిగా పేరుగాంచిన హోమీ జహంగీర్ భాభా మరణించిన తరువాత అతని జ్ఞాపకార్థం ఈ సంస్థను భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా మార్చింది.
BARC లోను, దాని అనుబంధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలోనూ మొదటి రియాక్టర్లు పశ్చిమదేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేసిన భారతదేశపు మొదటి విద్యుత్ రియాక్టర్లు అమెరికాకు చెందినవి.
BARC ప్రాథమిక ప్రాముఖ్యత ఒక పరిశోధనా కేంద్రంగా పనిచెయ్యడమే. రియాక్టర్లను పరిశోధనల కోసం మాత్రమే ఉపయోగిస్తామనే BARC, భారత ప్రభుత్వం రెండూ ఎప్పుడు చెబుతూ వచ్చాయి. ఈ రియాక్టర్లు: అప్సర; (1956 అప్పటి భారత ప్రధానమంత్రి, జవహర్ లాల్ నెహ్రూ ఆ పేరు పెట్టాడు) సైరస్ (CIRUS) (1960; యుఎస్ సహాయంతో "కెనడా-ఇండియా రియాక్టర్"), ఇప్పుడు మూసేసిన జెర్లినా (1961), పూర్ణిమా I (1972), పూర్ణిమా II (1984), ధ్రువ (1985), పూర్ణిమా III (1990), కామిని.
భారతదేశం తన 1974 స్మైలింగ్ బుద్ధ అణు పరీక్షలో ఉపయోగించిన ప్లూటోనియం CIRUS నుండి వచ్చింది. 1974 పరీక్షతో (తరువాత 1998 పరీక్షలు) భవిష్యత్ రియాక్టర్లలో విద్యుత్ ఉత్పత్తి, పరిశోధనలలో ఉపయోగించే అణు ఇంధనాన్ని అభివృద్ధి చేయటానికే కాక, అదే ఇంధనాన్ని ఆయుధాల్లో వాడేలా శుద్ధి చేసే సామర్థ్యాన్ని కూడా భారతీయ శాస్త్రవేత్తలకు ఇచ్చింది.
కల్పక్కం వద్ద భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్ను, ఐఎన్ఎస్ అరిహంత్ ప్రొపల్షన్ రియాక్టర్ యొక్క 80 మెగావాట్ల భూస్థిత నమూనా, ఐఎన్ఎస్ అరిహంత్ యొక్క అణు విద్యుత్ యూనిట్, [3] లను కూడా బార్క్ రూపొందించి, నిర్మించింది.[4][5]
భారతదేశం, ఎన్పిటి
భారతదేశం అణవ్స్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో (ఎన్పిటి) చేరలేదు. ఇప్పటికే అణుసామర్థ్యం గల దేశాలకు అనుచితంగా అనుకూలంగా ఉందనీ, సంపూర్ణ అణు నిరాయుధీకరణ కోసం అందులో నిబంధనలేమి లేవనీ భారత అంటోంది. ఈ ఒప్పందంపై భారతదేశం సంతకం చేయకపోవడానికి కారణం, ప్రాథమికంగా అది వివక్షతో కూడుకున్నదని భారత అధికారులు వాదించారు; ఈ ఒప్పందం అణ్వాయుధాలు లేని దేశాలపై పరిమితులను విధించింది గానీ, అణ్వాయుధ దేశాల అణ్వాయుధ ఆధునీకరణను, విస్తరణనూ అరికట్టడానికి చేసిందేమీ లేదు.[6]
ఇటీవల, భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ రెండు దేశాల మధ్య అణు సహకారాన్ని పెంపొందించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. అలాగే ఫ్యూజన్ పరిశోధనపై అంతర్జాతీయ కన్సార్టియం ITER (ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్) లో భారతదేశం పాల్గొనవచ్చు [7][8]
పౌర పరిశోధన
BARC గామా గార్డెన్స్ వద్ద బయోటెక్నాలజీలో కూడా పరిశోధనలు చేస్తుంది. అనేక వ్యాధి నిరోధక, అధిక దిగుబడినిచ్చే పంట రకాలను ముఖ్యంగా వేరుశనగ రకాలను అభివృద్ధి చేసింది. ఇది విద్యుత్ ఉత్పత్తి కోసం లిక్విడ్ మెటల్ మాగ్నెటో హైడ్రోడైనమిక్స్లో పరిశోధనలు చేస్తుంది.
2005 జూన్ 4 న, ప్రాథమిక శాస్త్రాలలో పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో, BARC హోమి భాభా నేషనల్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించింది . BARC (భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్) కు అనుబంధంగా ఉన్న పరిశోధనా సంస్థలలో IGCAR (ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్), RRCAT (రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ), VECC (వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్) ఉన్నాయి.
బార్క్ నైపుణ్యం నుండి లబ్ధి పొందిన ఎన్పిసిఐఎల్ (న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) పరిధిలోకి వచ్చే విద్యుత్ ప్రాజెక్టులు కెఎపిపి (కాక్రపార్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్), రాప్ (రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్), టిఎపిపి (తారాపూర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్).
భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ దాని అణు పరిశోధన పాటు, యాక్సిలరేటర్లు, మైక్రో ఎలక్ట్రాన్ కిరణాలు, మెటీరియల్స్ డిజైన్, సూపర్ కంప్యూటర్లు, కంప్యూటర్ దార్శనికత వంటి ఇతర హై టెక్నాలజీ రంగాలలో కూడా పరిశోధనలు నిర్వహిస్తుంది. ఈ ప్రత్యేక రంగాల కోసం బార్క్లో ప్రత్యేక విభాగాలున్నాయి. బార్క్ తన స్వంత ఉపయోగం కోసం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ కంప్యూటర్ల (అనుపమ్) వ్యవస్థను రూపొందించుకుని, అభివృద్ధి చేసింది.
క్యాపిటల్ | రెవిన్యూ | TOTAL | ||
---|---|---|---|---|
PLAN (మిలియన్లు) | PLAN (మిలియన్లు) | ప్రణాళికేతర (మిలియన్లు) | ||
బడ్జెట్ అంచనాలు 2007-2008 | ₹ 6291.0 | ₹ 136,6 | ₹ 6322.9 | ₹ 1275 కోట్లు |
తుది మంజూరు 2007-2008 | ₹ 6100.0 | ₹ 210,4 | ₹ 6930,2 | ₹ 1324 కోట్లు |
వాస్తవ ఖర్చు. 2007-2008 | ₹ 5996.1 | ₹ 193,3 | ₹ 6831,6 | ₹ 1302 కోట్లు |
బడ్జెట్ అంచనాలు 2008-2009 | ₹ 6301,0 | ₹ 234,5 | ₹ 7076.0 | ₹ 1361 కోట్లు |
వాస్తవ ఖర్చు. 2008-2009 | ₹ 1009,24 | ₹ 46.3 | ₹ 686,28 | ₹ 169.5 కోట్లు |
బడ్జెట్ అంచనాలు 2009–2010 | ₹ 845.00 | ₹ 1372,22 | ₹ 221 కోట్లు | |
వాస్తవ ఖర్చు. 2009-2010 | ₹ 792.35 | ₹ 1412.14 | ₹ 220 కోట్లు | |
బడ్జెట్ అంచనాలు 2010–2011 | 1130,00 | ₹ 1297.41 | ₹ 242 కోట్లు | |
వాస్తవ ఖర్చు. 2010–2011 (2011 ఫిబ్రవరి వరకు) | ₹ 645,36 | ₹ 1241,66 | ₹ 188 కోట్లు |
ఇవి కూడా చూడండి
అణుశక్తి రంగలో పనిచేసిన ముఖ్య వ్యక్తులు