సుబ్బరాయ శర్మ
సుబ్బరాయ శర్మ తెలుగు నాటకరంగ, టీవీ, సినీ నటుడు, నాటక దర్శకుడు.[1][2] ఈయన 1982 లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.[1] నాటకాల్లో, టీవీ కార్యక్రమాల్లో కూడా నటించాడు. 1993, 1996 సంవత్సరాల్లో టీవీ నంది పురస్కారాలు అందుకున్నాడు.[1][3][4]
సుబ్బరాయ శర్మ | |
---|---|
జననం | ఉప్పలూరి సుబ్బరాయ శర్మ 1947 జనవరి 3 |
జాతీయత | భారతీయుడు |
విద్య | బీ.కామ్ |
వృత్తి | నటుడు, దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1967–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మాయలోడు, మాతృదేవోభవ, మగధీర, టాప్ హీరో, విచిత్ర ప్రేమ, అనగనగా ఓ ధీరుడు |
జీవిత భాగస్వామి | జ్ఞానప్రసూనాంబ |
పిల్లలు | బాలపవన్ కుమార్ కిరణ్మయి |
తల్లిదండ్రులు |
|
జీవిత విషయాలు
సుబ్బరాయ శర్మ 1947, జనవరి 3న దుర్గా ప్రసాద రావు, సుందరి దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడలో జన్మించాడు. ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బికామ్ పూర్తిచేశాడు. 1974 మార్చిలో జ్ఞానప్రసూనాంబతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఒక అబ్బాయి (బాలపవన్ కుమార్), ఒక అమ్మాయి (కిరణ్మయి).
నాటకరంగం
1960లో విద్యార్థి దశలోనే తన సీనియర్ చిట్టూరి నాగభూషణం ప్రేరణతో మెుద్దబ్బాయి నాటిక ద్వారా నాటకరంగ ప్రవేశం చేశాడు. పాఠశాల దశలోనే తన మిత్రులు సుత్తి వీరభద్రరావు, మాధవపెద్ది రమేష్ (సినీనేపధ్యగాయకుడు), విన్నకోట విజయరాం మెుదలైన వారితో కలిసి ఉద్ధారకులు, పేటెంట్మందు, చివరకు మిగిలేది, కళాకార్, పెళ్ళిచూపులు, విన్నకోట రామన్నపంతులు దర్శకత్వంలో దశమగ్రహం వంటి నాటకాలలో నటించాడు. వాటిల్లో చివరికి మిగిలేది అనే నాటకం బాగా రక్తి కట్టింది. కళాశాలలో చదివే రోజుల్లో పేషెంట్ మందు, అంతా ఇంతే, వాంటెడ్ ఫాదర్ అనే నాటకాల్లో నటించాడు.
1967లో పి.యూ.సి చదువుతున్న జంధ్యాలను నటుడిగా ఆడది నాటిక ద్వారా పరిచయం చేసి, జంధ్యాల రాసిన మెుదటి నాటిక జీవనజ్యోతికి దర్శకత్వం వహించాడు. కెమెరామెన్ ఎం. వి. రఘుతో కలిసి కూడా కొన్ని నాటకాలు వేశాడు. అంతా ఇంతే, అతిధిదేవుళ్ళొస్తున్నారు, వాంటెడ్ ఫాదర్స్, రాతిమనిషి, లేపాక్షి, సంభవామియుగేయుగే (సి. రామ్మోహనరావు దర్శకత్వం), కీర్తిశేషులు, మాటతప్పకు మెుదలైన నాటిక నాటకాలలో నటిస్తుండగా శర్మలోని ప్రతిభను గుర్తించిన చింతా కబీరుదాసు మారనిమనిషి నాటకంలో హీరో వేషం వేయించాడు.
1970లో ఉద్యోగం కోసం హైదరాబాదు వచ్చి తన నటనా జీవితం కొనసాగించాడు. ఆర్టీసీ కార్మికులతో కలిసి నాటకాలు వేసేవాడు. వారు ఈయన్ను యాజమాన్యానికి రెకమెండ్ చేసి ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంటు ఉద్యోగం కల్పించారు. యండమూరి వీరేంద్రనాధ్ సహచర్యంతో ఆయన వ్రాసిన కుక్క, రుద్రవీణ, గులాబిముళ్ళు, మనుషులొస్తున్నారు జాగ్రత్త, శివరంజని, నిశ్శబ్ధం, నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య అనే నాటకాలలో నటించాడు. వీటిల్లో శివరంజని, పద్మవ్యూహం, హుష్కాకి నాటకాలు నాకు గుర్తింపును తెచ్చాయి.
ఆర్తి నాటకంలో 80 సంవత్సరాల కోయదొరపాత్ర చూసిన సినీ దర్శకుడు మృణాళ్ సేన్ శర్మను పిలిపించుకుని అభినందించాడు. ఎల్. బి. శ్రీరామ్ వ్రాసిన ఒంటెద్దు బండి నాటకం నూరు ప్రదర్శనలు పూర్తి చేశాడు. ఈ నాటకం ద్వారా మద్రాసు కళాసాగర్ సంస్థ ట్రైయాన్యుయల్ (ముాడు సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే బహుమతి) ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు.[5][6][7] ప్రతి సంవత్సరం 3 రోజులపాటు నాటకోత్సవాలు నిర్వహించడంతోపాటు ప్రతి సంవత్సరం ఒక కొత్త నాటకాన్ని తయారుచేస్తున్నాడు.
రేడియోరంగం
1975లో ఆకాశవాణి నాటక విభాగంలో ఆడిషన్ టెస్టు పాసయి చిరంజీవి, శారదా శ్రీనివాసన్, జీడిగుంట రామచంద్ర మూర్తి, శ్యామ సుందరి, జె. వి. రమణమూర్తి, మురళీకృష్ణ మొదలైన వారితో రేడియో నాటకాల్లో పాల్గొన్నాడు. రేడియోలో ప్రసారమైన విశ్వనాథ సత్యనారాయణ వేయిపడగలులో ధర్మారావు పాత్ర ధరించాడు.
టివిరంగం
1977లో ప్రారంభమయిన బుల్లితెర కార్యక్రమాలలో మెుదటిరోజే ప్రసారమయిన ముచ్చట్లు కార్యక్రమంలో దేశిరాజు హనుమంతరావు, కోట శ్రీనివాసరావులతో నటించి టివిరంగంలో మెుదటి ఆర్టిస్టుగా నిలిచాడు. 1995లో ఈటివీ ప్రసారాలు ప్రారంభం అయ్యాక అనిల్కుమార్ దర్శకత్వంలో వండర్ బాయ్ టెలిఫిలిం ద్వారా ఈటివికి పరిచయమయ్యాడు. శివలీలలు ఆయన మొట్ట మొదటి పౌరాణికం సీరియల్. అందులో ఆయన దక్షుడు పాత్ర ఆయనకు ప్రశంసలు తెచ్చింది. శ్రీభాగవతంలో సత్రాజిత్ గా నటించాడు. మీడియాలో మొదటిసారిగా ద్విపాత్రలో యాంకరింగ్ చేస్తూ నటించాడు. [8] 3సార్లు టి.వి. నంది అవార్డు కమిటీలో మెంబరుగా ఉన్నాడు. నూరేళ్ళపంటకి-నూటొక్కసుాత్రాలు పేరుతో దూరదర్శన్ కి, భక్తవిజయం పేరుతో శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కు సీరియల్స్ స్వీయదర్శకత్వంలో నిర్మించాడు.
కృష్ణమూర్తి-కుక్కపిల్లలు, తుస్సు తుస్సు ఢాంఢాం, సత్యం, తిమ్మరుసు, రంతిదేముడు, రాహు కేతువులు, సారాంశం, మనిషి- ఇలా అనేక టెలీఫిల్మ్స్ నటించారు. జెమినీ టీవీలో ప్రసారమైన తుళసీదళం సీరియల్ లో ఒక ముఖ్యపాత్రలో నటించాడు.
సినిమారంగం
1983లో ఉషాకిరణ్ మూవీస్ నిర్మాణంలో వచ్చిన మయూరి సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశాడు.
నటించిన సినిమాలు
- మాతృదేవోభవ
- టాప్ హీరో
- మాయలోడు
- యమలీల
- శుభలగ్నం
- నెంబర్ వన్
- ఆ ఇంట్లో
- మర్యాద రామన్న
- మగధీర
- బాహుబలి
- శ్రీరామరాజ్యం
- ప్రేమా జిందాబాద్
- అగ్నిప్రవేశం
- పెళ్ళి చేసుకుందాం (1997)
- ప్రేమతో రా (2001)
- నాగప్రతిష్ఠ (2003)
- విచిత్రప్రేమ
- బావాబావా పన్నీరు
- శ్రీరామదాసు
- వెంగమాంబ
- సూరీడు
- సింహాద్రి
- స్టూడెంట్ నంబర్ 1
- చందమామ రావే
- కుక్క
- దుప్పట్లో మిన్నాగు
- రిక్షావోడు
- మయూరి
- ఆడపిల్ల
- యుగకర్తలు
- ఈ ప్రశ్నకు బదులేది
- అన్నయ్య
- ఓం
- అహ నా పెళ్ళంట
- హై హై నాయకా
- అక్కుం బక్కుం
- అగ్ని పరీక్ష
- వాసు
- కాలేజీ స్టూడెంట్
- వినోదం
- పెళ్ళాం ఊరెళితే
- సత్యాగ్రహం
- లేడీస్ స్పెషల్
- గంగోత్రి
- ఇద్దరు మిత్రులు
- టాప్ లేచిపోద్ది
- ఛత్రపతి
- పంచాక్షరి
- ఉగాది
- వంద నవ్వుల విందు
- ధర్మచక్రం
- నాయుడిగారి కుటుంబం
- ఇంద్రభవనం
- వజ్రం
- గణేష్
- ధృవ నక్షత్రం
- అనగనగా ఒక యోధుడు
- ఒకరోజు
- కొడుకు
- శుభలగ్నం
- ఠాగూర్
- పండగ
- సకుటుంబ సపరివార సమేతం
- ఆహ్వానం
- కంటే కూతుర్నే కను
- సుబ్బరాజుగారి కుటుంబం
- పసుపు కుంకుమ
- ఎర్రచీర
- నాగప్రతిష్ట
- కోకిల (2006)
- లక్ష్మీ బాంబ్ (2017)
- సావిత్రి w/o సత్యమూర్తి
పురస్కారాలు
జెమిని టివీలో ప్రసారమైన తులసీదళం సీరియల్ ద్వారా ప్రభుత్వ గుర్తింపు లభించింది. ఈ సీరియల్లో పైడితల్లి పాత్రకు గుర్తింపు 1993లో ఉత్తమసహాయ నటుడి అవార్డు లభించింది. రెండుసార్లు ప్రభుత్వ నంది నాటకోత్సవాలలో న్యాయనిర్ణేతగా వెళ్ళాడు. నాలుగుసార్లు నంది టివీ అవార్డుల కమిటీలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2009లో ఢిల్లీతెలుగు అకాడమీ ద్వారా లైఫ్ టైమ్ ఎచీవ్మెంట్ అవార్డుతో సన్మానం పొందాడు.[8]
- 3సార్లు ఉత్తమ సహయనటుడిగా టివి నంది అవార్డులు
- ఢిల్లీ తెలుగు అకాడమీ నుండి లైఫ్ టైం అఛీవ్ మెంటు అవార్డు.
- యువకళావాహిని నుండి బళ్ళారి రాఘవ అవార్డు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారం.
- స్వరవల్లరి (నాగపూర్) ఉత్తమ నటుడు అవార్డు.
- సంగం ఇంటర్నేషనల్ ఉగాది పురస్కారం.
- ఆరాధనా సంస్ధ కళాకౌశల అవార్డు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుండి పైడిలక్ష్మయ్య రంగస్ధల పురస్కారం (1997)
- 2019లో ఎన్.టి.ఆర్. అసోషియేషన్ (గుంటూరు) నుండి నందముారి తారకరామారావు కళా పురస్కారం
ఇతర వివరాలు
1965-68 మధ్యకాలంలో బి.కాం చదువుతుా, కాలేజీ కల్చరల్ సెక్రటరీగా కూడా ఎన్నికయ్యాడు.
మూలాలు
బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సుబ్బరాయ శర్మ పేజీ