స్వాతి మలివాల్
స్వాతి మలివాల్ భారతదేశానికి చెందిన సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకురాలు. ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రి సలహాదారుగా, ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్పర్సన్గా పని చేసి 2024లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైంది.[2]
స్వాతి మలివాల్ | |||
రాజ్యసభ సభ్యురాలు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 జనవరి 2024 | |||
ముందు | సుశీల్ కుమార్ గుప్తా | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఢిల్లీ | ||
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ | |||
పదవీ కాలం జూలై 2015 – 5 జనవరి 2024[1] | |||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | ఘజియాబాద్ , ఉత్తర ప్రదేశ్ , భారతదేశం | 1984 అక్టోబరు 15||
నివాసం | న్యూఢిల్లీ, భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు, సామజిక కార్యకర్త |
జననం, విద్యాభ్యాసం
స్వాతి మలివాల్ ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో అక్టోబరు 15, 1984న జన్మించింది. ఆమె అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రాథమిక ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి జెఎస్ఎస్ అకాడమీ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది.
వ్యక్తిగత జీవితం
స్వాతి మలివాల్ హెచ్సిఎల్లో పని చేస్తూ తన 22వ ఏట ఉద్యోగాన్ని విడిచిపెట్టి కేజ్రీవాల్, మనీష్ సిసోడియా నిర్వహిస్తున్న ఎన్జిఓ సంస్థ "పరివర్తన్"లో చేరింది. ఆమె 2013లో గ్రీన్పీస్ ఇండియాకు ప్రచారకర్తగా ఆ తర్వాత 2014లో ఢిల్లీలోని ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి సలహాదారుగా పని చేసింది. మలివాల్ భారతదేశంలో అధికార కేంద్రీకరణను పెంచాలని వాదించే వివిధ ఎన్జిఓ సంస్థలతో కలిసి చురుకుగా పాల్గొని సమాచార హక్కు చట్టం (RTI) గురించి అవగాహన పెంచడానికి ప్రచారాలను నిర్వహించింది.
వివాహం
స్వాతి మలివాల్ ఆప్ నాయకుడు నవీన్ జైహింద్ను వివాహం చేసుకొని ఫిబ్రవరి 2020లో వారు విడాకులు తీసుకున్నారు.
రాజకీయ జీవితం
స్వాతి మలివాల్ అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఇండియన్ ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమంలో చేరి ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీలో చేరింది. ఆమె జూలై 2015లో ఢిల్లీ మహిళా కమీషన్ చైర్పర్సన్గా నియమితులవ్వగా ఆమె పదవీకాలం 2018లో ముగియడంతో ఢిల్లీ ప్రభుత్వం మరో మూడేళ్లపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.[3] స్వాతి మలివాల్ ను 2024 జనవరి 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఆప్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఆమెను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థిగా ప్రకటించింది.[4] స్వాతి మలివాల్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికై[5] 2024 జనవరి 31న రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసింది.[6]
వేధింపులు
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా స్వాతి మలివాల్ 2023 జనవరి 19న అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (AIIMS) గేట్ నెంబర్ 2 వద్ద కొంతమందితో కలిసి ఫుట్పాత్పై తన కారు కోసం నిల్చున్నపుడు నిందితుడు కారులో వచ్చి, తన కారులో కూర్చోవాలని అడిగాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో, ఇరువురి మధ్య ఘర్షణ జరగగా ఆమెను కారుతో దాదాపు 10 నుంచి 15 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు.[7][8]