మాలికా పుఖ్రాజ్
మాలికా పుఖ్రాజ్ (ఉర్దూ: ملكہ پکھراج) (1912 – 2004) పాకిస్తాన్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గజల్, జానపద గాయని.[1] ఆమెను సాధారణంగా మాలిక అని పిలుస్తారు, అంటే రాణి అని అర్థం.[2] ఆమె హఫీజ్ జలంధ్రి నాజ్మ్ పాట అభి తౌ మెయిన్ జవాన్ హూన్.. తో చాలా ప్రజాదరణ పొందింది. దీనిని పాకిస్తాన్లోనే కాకుండా భారతదేశంలో కూడా మిలియన్ల మంది విని ఆనందిస్తున్నారు.
మాలికా పుఖ్రాజ్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | 1912 హమీర్పూర్ సిధర్, జమ్మూ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత జమ్మూ కాశ్మీరు (కేంద్రపాలిత ప్రాంతం), భారతదేశం) |
మూలం | జమ్మూ |
మరణం | 2004 ఫిబ్రవరి 4 లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | (వయసు 91–92)
సంగీత శైలి | పాకిస్తానీ జానపద సంగీతం, గజల్ |
వృత్తి | గజల్, జానపద గాయకురాలు |
క్రియాశీల కాలం | 1921 – 2004 |
జీవిత భాగస్వామి | షబ్బీర్ హుస్సేన్ |
పిల్లలు | 6, తాహిరా సయ్యద్ తో సహా |
లేబుళ్ళు | రేడియో పాకిస్తాన్ ఆల్-ఇండియా రేడియో |
ఉర్దూ భాషలో ఆమె ఆలపించి ప్రసిద్ధి చెందిన ఎన్నో పాటలలో ఫిర్ బసంత్ ఆయి.., కులీ కుతుబ్ పియా బాజ్ పియాలా పియా జే నా.., ఫైజ్ అహ్మద్ ఫైజ్ మేరే ఖతిల్ మేరే దిల్దార్ మేరే పాస్ రహో.. ప్రముఖంగా చెప్పుకోవచ్చు.[3]
బాల్యం
మాలికా పుఖ్రాజ్ హమీర్పూర్ సిధార్లో గీతకారుల కుటుంబంలో జన్మించింది. అఖ్నూర్ ప్రాంతంలో ఆధ్యాత్మికవేత్త అయిన బాబా రోటీ రామ్ మజ్జూబ్ ఆమెకు పుట్టినప్పుడు మాలిక అనే పేరు పెట్టాడు. గాయని, నర్తకి అయిన ఆమె అత్త పుఖ్రాజ్(పసుపు నీలమణి) అని పేరు పెట్టింది.[4] ఈ రెండు పేర్లతో మాలికా పుఖ్రాజ్ పిలువబడింది.[5]
గాయకుడు ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ తండ్రి అయిన ఉస్తాద్ అలీ బక్ష్ కసూరి వద్ద మాలికా పుఖ్రాజ్ సాంప్రదాయ సంగీత శిక్షణ పొందింది.[6]
కెరీర్
జమ్మూలో మహారాజా హరి సింగ్ పట్టాభిషేక వేడుకలో ఆమె తొమ్మిదేళ్ల వయసులో ప్రదర్శన ఇచ్చింది. ఆమె గాత్రానికి ఎంతగానో ముగ్ధుడైన మహారాజు ఆమెను తన దర్బార్లో ఆస్థాన గాయనిగా నియమించాడు. మరో తొమ్మిదేళ్లు ఆమె అక్కడే గాయనిగా కొనసాగింది.
ఆమె 1940లలో భారతదేశంలోని ప్రసిద్ధ గాయకులలో ఒకరుగా గుర్తింపుతెచ్చుకుంది. 1947లో భారతదేశ విభజన తర్వాత, ఆమె పాకిస్తాన్లోని లాహోర్కు వలస వెళ్ళింది. అక్కడ ఆమె రేడియో పాకిస్తాన్ లో స్వరకర్త కాలే ఖాన్తో కలిసి చేసిన రేడియో కార్యక్రమాలతో మరింత కీర్తిని పొందింది.[7] ఆమె గాత్రం జానపద పాటలకు చాలా అనుకూలంగా ఉంటుంది.[8]
1980లో ఆమె పాకిస్తాన్ అధ్యక్షుడి నుండి ప్రైడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అవార్డును అందుకుంది. 1977లో, 1947లో దేశ విభజన వరకు ఆమె పాడిన ఆల్ ఇండియా రేడియో తన స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకుంటున్నప్పుడు, ఆమెను భారతదేశానికి ఆహ్వానించి లెజెండ్ ఆఫ్ వాయిస్ అవార్డుతో సత్కరించారు.[9] మాలికా పుఖ్రాజ్ తన జ్ఞాపకాలను సాంగ్ సంగ్ ట్రూ(Song Sung True: A Memoir) అనే పుస్తకంలో పొందుపరిచింది.
వ్యక్తిగత జీవితం
మాలికా పుఖ్రాజ్ పంజాబ్లోని జూనియర్ ప్రభుత్వ అధికారి షబ్బీర్ హుస్సేన్ను వివాహం చేసుకుంది. వీరికి పాకిస్తాన్లో గాయని అయిన తాహిరా సయ్యద్తో సహా ఆరుగురు పిల్లలు ఉన్నారు.[10][11]
అవార్డులు
- 1977లో ఆల్ ఇండియా రేడియో చే లెజెండ్ ఆఫ్ వాయిస్ అవార్డు[10]
- 1980లో పాకిస్తాన్ ప్రెసిడెంట్ చే ప్రైడ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్[10]
మరణం
మాలికా పుఖ్రాజ్ 2004 ఫిబ్రవరి 4న పాకిస్తాన్లోని లాహోర్లో మరణించింది.[1]