నరసాపురం
నరసాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం. ఇక్కడ గోదావరి నదీతీరం, ఎంబర్ మన్నార్ దేవాలయం, దగ్గరలోగల సముద్రతీరం పర్యాటక ఆకర్షణలు.
పట్టణం | |
Coordinates: 16°26′N 81°41′E / 16.43°N 81.68°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి జిల్లా |
మండలం | నరసాపురం మండలం |
Area | |
• మొత్తం | 11.32 km2 (4.37 sq mi) |
Population (2011)[1] | |
• మొత్తం | 58,770 |
• Density | 5,200/km2 (13,000/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1041 |
Area code | +91 ( 8814 ) |
పిన్(PIN) | 534275 |
Website |
భౌగోళికం
దీని అక్షాంశ రేఖాంశాలు 16° 27' 0" ఉత్తరం, 81° 40' 0" తూర్పు. జిల్లా కేంద్రమైన భీమవరంకు ఆగ్నేయంలో 31 కి.మీ దూరంలో ఉంది.
చరిత్ర
చరిత్రలో నరసాపుర పేట అనే వాడుక ఉంది. 'నృసింహపురి', 'అభినవభూతపురి' అన్న పేర్లు కూడా కొన్ని (సాహితీ) సందర్భాలలో వాడుతారు. 1580 నుంచి 17వ శతాబ్ది మధ్యభాగం వరకు నరసాపురం నౌకా నిర్మాణ పరిశ్రమకు స్వర్ణయుగం. ఎగువ గోదావరి చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం నుంచి కొట్టిన కలప నౌకా మార్గంలో గోదావరిలో నరసాపురం చేరేది. ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలోని అడవులు, గోదావరి లంకల్లో పెరిగిన వృక్ష సంపద వంటివి నరసాపురం నౌకా నిర్మాణానికి కలప దొరికే వనరులుగా నిలిచాయి. దక్కన్ ప్రాంతంలో ఇనుం లభ్యత తక్కువ ఉండడంతో ఇక్కడి నౌకా నిర్మాణంలో మేకుల వాడకం తక్కువగా ఉండేది. కానీ నరసాపురం ప్రాంతానికి మాత్రం ఆంధ్ర ప్రాంతంలోని విస్తారమైన ఇనుప ఖనిజం వల్ల ఆ సమస్య ఉండేది కాదు. కలప, ఇనుం, ఇతర అవసరమైన ముడి సరుకులు ఈ ప్రాంతంలో లభిస్తూండడం ఇక్కడ పరిశ్రమ ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది.[2][3] వీటితో పాటు చవకగా పనిచేసేందుకు మనుషులు దొరుకుతూండడం కూడా ఈ ప్రాంతంలో నౌకా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది. నరసాపురంలో భారీ నౌకల నిర్మాణం సాగేది. ఆ నిర్మాణమైన నౌకలను ఎగువన వరదలతో గోదావరి పోటు మీదున్న సమయంలో నదీ మార్గంలోంచి సముద్రంలోకి ప్రవేశపెట్టేవారు.[4] నరసాపురంలో తయారైన నౌకలను ప్రధానంగా మచిలీపట్నం నౌకాశ్రయానికి చెందిన వ్యాపారులు వాడేవారు. ఈ నౌకలు బంగాళాఖాతం నుంచి ఎర్ర సముద్రం వరకూ వాణిజ్యం కోసం ప్రయాణించేవి. 1670ల నుంచి పోర్చుగీసు నౌకలు భారతీయ వాణిజ్యంలో అగ్రస్థానాన్ని ఆక్రమిస్తూ పోవడంతో డిమాండ్ పడిపోయి ఇక్కడి నౌకా నిర్మాణ పరిశ్రమ క్రమేపీ కనుమరుగైంది.[2]
జనవిస్తరణ
2011 జనగణన ప్రకారం, పట్టణ జనాభా 58,870.
2001 జనాభా లెక్కల ప్రకారం నరసాపురం పట్టణం జనాభా 58,508. ఇందులో పురుషుల సంఖ్య 49%, స్త్రీల సంఖ్య 51% ఉన్నారు. నరసాపురం అక్షరాస్యత 75% (దేశం సగటు అక్షరాస్యత 59.5%). పురుషులలో అక్షరాస్యత 78%, స్త్రీలలో 71%. మొత్తం పట్టణ జనాభాలో 11% వరకు 6 సంవత్సరాల లోబడిన వయసువారు. జనాభా ప్రధానంగా హిందువులు ఉన్నారు గాని ముస్లిం, క్రైస్తవ, జైన మతాలవారు కూడా గణనీయంగా ఉన్నారు.
పరిపాలన
నరసాపురం పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
జాతీయ రహదారి 216 పై ఈ పట్టణం ఉంది. ఇక్కడ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్ డిపో ఉంది. భీమవరం - నిడదవోలు లూపు లైనులో భీమవరం - నరసాపురం శాఖా మార్గంలో ఇది అంతిమ రైలునిలయం.
విద్యాసౌకర్యాలు
- ఎస్.వై.ఎన్. కళాశాల: డచ్ వారు వ్యాపారానికి నరసాపురంలో ఏర్పాటు చేసుకున్న ఒక స్థావరం ఈ కళాశాలలో ఉంది.
- శ్రీ సూర్య జూనియర్ కళాశాల
- టైలర్ ఉన్నత పాఠశాల: విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు ఇక్కడ టెయిలర్ ఉన్నత పాఠశాలలో చదివాడు.
- భగవంతం గుప్తా బంగారు శేషావతారం మహిళా కళాశాల - సంఘ సంస్కర్త అద్దేపల్లి సర్విచెట్టి 1962 ప్రాంతాల్లో ఈ కళాశాలను స్థాపించాడు
- మిషన్ ఉన్నత పాఠశాల: సాహితీవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం ఇక్కడి మిషన్ ఉన్నత పాఠశాలలో చదివాడు
- జె.సికిలె ఉన్నత పాఠశాల
- స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల
- అంధ్రా బ్లయిండ్ మోడల్ స్కూలు
- బాలికోన్నత పాఠశాల: 1942 లో స్త్రీల హైయ్యర్ గ్రేడ్ ట్రైనింగ్ స్కూలుగా స్థాపించబడి 1968 లో బాలికల ఉన్నత పాఠశాలగా మార్చబడింది.
వ్యవసాయం, అనుబంధ పనులు
వరి వ్యవసాయం, చేపల పెంపకం
పరిశ్రమలు
- బియ్యం మిల్లులు, ఐస్ ఫ్యాక్టరీలు
లేసు పరిశ్రమ
నరసాపురం లేసు ఉత్పాదనలకు ప్రసిద్ధి చెందింది. పట్టణంలో సుమారు 50 లేసు ఎగుమతిదారులున్నారు. పట్టణంలోను, దాని చుట్టుప్రక్కల సీతారాంపురం, పాలకొల్లు, వెంకటరాయపాలెం, అంతర్వేది. రాయపేట, మొగల్తూరు వంటి పట్టణాలు, గ్రామాలలోను 2 లక్షల పైగా మహిళలకు ఇది జీవనాధారమైన వృత్తిగా ఉంది. డోలీలు, అలంకరణ సామాగ్రి, వస్త్రాలు, టేబుల్మ్యాట్లు వంటి అల్లికలను తయారు చేసే ఈ పరిశ్రమ 168 సంవత్సరాలనుండి ఇక్కడ నడుస్తుంది. 1844లో ఇక్కడికి సేవా కార్యక్రమాలకోసం వచ్చిన మాక్రియా అనే స్కాటిష్ యువతి ఇక్కడి గృహిణులకు ఈ అల్లికను నేర్పింది. అప్పటి నుండి ఈ నైపుణ్యత తరతరాలుగా ఇక్కడ కుటీర పరిశ్రమగా వృద్ధిచెందింది.
పర్యాటక ఆకర్షణలు
- గోదావరి నదీ తీరప్రాంతం: నరసాపురం దగ్గరలోనే గోదావరి నది సముద్రంలో కలుస్తుంది.
- పేరుపాలెం బీచ్: నరసాపురం దగ్గరలో ముఖ్య సముద్రతీరం. ఇక్కడ వేలాంకిణీ మాత మందిరం ఉంది.
దేవాలయాలు
- శ్రీ ఆదికేశవ ఎంబర్ మన్నార్ కోవెల (ఎంబర్ మన్నార్ దేవాలయం): ఇది పురాతనమైన భారతదేశ ప్రసిద్ధ వైష్ణవాలయాలలో ఒకటి. ప్రసన్నాగ్రేసర పుప్పల రమణప్పనాయుడు తన గురువుగారి కోరికను తీర్చే నిమిత్తం ఈ ఆలయాన్ని కట్టించాడు. దీని నిర్మాణ శైలి తమిళనాడు లోని పెరంబుదూర్ లోని వైష్ణవదేవాలయాన్ని పోలి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఆదికేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు, రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవానికి దేశంలోని వివిధ ప్రాంతాలనుండి చాలామంది వైష్ణవ గురువులు, భక్తులు తరలి వస్తారు.
- లూథరన్ చర్చి
- జగన్నాథస్వామి దేవాలయం: ఈ దేవాలయం రుస్తుంబాదలో కలదు, ఒరిస్సాలోని పూరి తర్వాత జగన్నాథునికి ఆలయం ఇక్కడనే కలదు, ఈ ఆలయం గంధర్వులు నిర్మించినట్టు స్థలపురాణం చెబుతుంది.
- కొండాలమ్మ దేవాలయం: ఈ ఆలయం గోదావరి వడ్డున పాతరేవు, కొత్తరేవుల మధ్య ఉంది. ఇక్కడి విగ్రహం గోదావరిలో ప్రాంతంలోనే దొరకింది. విగ్రహం దాదాపు నాలుగు ఐదు అడుగుల వుంటుంది.
- కపిల మల్లేశ్వరస్వామి దేవాలయం: ఇది నరసాపురం మెయిన్ రోడ్డు చివరన ఉంది. ఇక్కడి శివలింగం శ్రీశైలం లోని లింగాన్ని పోలి ఉంటుంది. మదన గోపాల స్వామి ఆలయం ఈ గుడి ఎదురుగా ఉంటుంది.
- రాజగోపాలస్వామి మందిరం: ఇది కూడా సఖినేటి పల్లె వెళ్ళే గోదావరి రేవుదారిలో ఉంది. ఆరంతస్తుల గోపురముఖద్వారం కలిగి, మంచి శిల్పకళ కలిగిన ఆలయం.
- జైన మందిరం
- పెద్ద మసీదు: ఇది నరసాపురం పిచ్జుపల్లె వెళ్ళే దారిలో ఉంది.
ఇతర విశేషాలు
- వరల్డ్ విజన్ లాభాపేక్షరహిత సేవాసంస్థకు కేంద్రం.
- నరసాపూర్ ఎక్స్ప్రెస్ ఈ పట్టణానికి హైదరాబాదుతో ప్రయాణ సౌకర్యం కలుగజేస్తుంది.
ప్రముఖులు
- పెద్దింటి సూర్య నారాయణ దీక్షితదాసు భాగవతార్, హరికథ విద్వాంసులు
- రాజబాబు