పోరస్
పోరస్ (పురుషోత్తముడు) ప్రాచీన భారతదేశానికి చెందిన ఒక రాజు. "పురుషోత్తమ" ఇతడి అసలు పేరు. గ్రీకుల యాసలో "పురుషోత్తమ" అనే పేరు "పోరస్" గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం పంజాబ్లో ఉన్న జీలం, చీనాబ్ అనే నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని పరిపాలించినట్లుగా గ్రీకు రచనల ద్వారా తెలుస్తుంది. ఇతను అలెగ్జాండర్ చక్రవర్తితో యుద్ధంలో పోరాడి అతన్ని మెప్పించి తన రాజ్యాన్ని తిరిగి పొందడమే కాకుండా మరిన్ని ప్రాంతాలను బహుమతిగా పొందాడు.[1][2] క్రీ.పూ 323 లో అలెగ్జాండర్ మరణించిన తరువాత అతని సైన్యాధికారి యూడెమస్ క్రీ.పూ 321, 315 మధ్య పోరస్ ను హత్య చేశాడు.[3]
ఇతన్ని గురించిన సమాచారం కేవలం గ్రీకు రచనల ద్వారానే లభ్యమౌతుంది. కానీ చరిత్రకారులు మాత్రం ఇతని పేరును బట్టి అతని పరిపాలిస్తున్న ప్రాంతాన్ని బట్టి ఋగ్వేదంలో ప్రస్తావించిన పురువంశానికి చెందిన రాజుగా భావిస్తున్నారు.[4][5]ఈశ్వరీ ప్రసాద్ అనే చరిత్రకారుడు మాత్రం పోరస్ యదువంశానికి చెందిన పాలకుడై ఉండవచ్చునని భావించాడు. పోరస్ సైన్యంలో ముందు వరస వారి దగ్గర ఉన్న జెండాలపై ఉన్న చిత్రాలు (హెరాకిల్స్) మధుర పాలకుల చిత్రాలను పోలి ఉన్నాయని అతని వాదన. పోరస్ తరువాత వచ్చిన చంద్రగుప్తుని కాలంలో భారతదేశంలో పర్యటించిన మెగస్తనీసు తన రచనల్లో ఇలాంటి బొమ్మలు మధుర రాజ్య పాలకులకు చెందినవిగా వర్ణించాడు.[6][7][8][9]