ముదుమలై నేషనల్ పార్క్
ముదుమలై నేషనల్ పార్క్ లేదా ముదుమలై వన్యప్రాణుల అభయారణ్యం తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో ఉంది.[1] ఇది దక్షిణ భారతదేశంలోని మొదటి వన్యప్రాణుల అభయారణ్యం, ఇది 1940లో స్థాపించబడింది. ముదుమలై అనే పేరుకు "పురాతన కొండ శ్రేణి" అని అర్థం. నిజానికి, పశ్చిమ కనుమలు ఏర్పడినప్పటికి ఇది 65 మిలియన్ సంవత్సరాల నాటిది. ఈ అడవిలో పెద్ద సంఖ్యలో పులులు ఉన్నందున ముదుమలైని 1947లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం టైగర్ రిజర్వ్గా ప్రకటించింది. ఇది కర్ణాటక, కేరళ, తమిళనాడు అనే మూడు రాష్ట్రాల ట్రై-జంక్షన్ వద్ద ఉంది. ఇది భారతదేశంలోని మొదటి బయోస్పియర్ రిజర్వ్ అయిన నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో భాగంగా 1986లో ప్రకటించబడింది.[2] దీనికి ఉత్తరాన బందీపూర్ నేషనల్ పార్క్, పశ్చిమాన వయనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం ఉన్నాయి (ముదుమలై, వాయనాడ్, బందీపూర్ వన్యప్రాణుల అభయారణ్యం అంత ఒకటే అభయారణ్యం కానీ ప్రాంతాల సరిహద్దులు మారడంతో పేర్లు మారాయి).[3] ఈ ఉద్యానవనాలు, అభయారణ్యాలు, పక్కనే ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లు మొత్తం 3,300 చదరపు కిలోమీటర్ల అటవీప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. ఇది మైసూర్, ఊటీలను కలిపే జాతీయ రహదారి ఈ పార్కు గుండా వెళుతుంది. ముదుమలై టైగర్ రిజర్వ్ తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో 688.59 చ.కి.మీ విస్తీర్ణంలో ఉంది. ఈ అభయారణ్యంలో 2018 గణాంకాల ప్రకారం 103 పులులు ఉన్నాయి.[4]
ముదుమలై నేషనల్ పార్క్ | |
---|---|
ముదుమలై టైగర్ రిజర్వ్ | |
IUCN category II (national park) | |
ప్రదేశం | నీలగిరి జిల్లా, తమిళనాడు, భారతదేశం |
సమీప నగరం | గూడలూర్, నీలగిరి |
విస్తీర్ణం | 321 km2 (124 sq mi) |
స్థాపితం | 1940 |
పాలకమండలి | తమిళనాడు అటవీ శాఖ |
వెబ్సైటు | https://www.forests.tn.gov.in/ |
అటవీ ప్రాంతం
ఈ అభయారణ్యం 321 కిమీ 2 విస్తీర్ణంలో ఉంది. ఇందులో చాలా దట్టమైన అడవి - 47.05 కిమీ2, మధ్యస్తంగా ఉన్న దట్టమైన అడవి - 214.98 కిమీ2, ఓపెన్ ఫారెస్ట్ - 56.16 కిమీ2 మేర ఉంది. ఇక్కడ 800 - 2000మీ.మీ మధ్య వర్షపాతం నమోదవుతుంది.[5] ముదుమలై వాతావరణం మధ్యస్థంగా ఉంటుంది. ముదుమలైలో డిసెంబర్ నెలలో లేదా జనవరి ప్రారంభంలో చల్లని వాతావరణం ఉంటుంది, మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇక్కడ వేడి వాతావరణం ఉంటుంది. ఇక్కడ వేసవిలో గరిష్టంగా 29 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది, శీతాకాలం 10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఈ ప్రాంతంలోని వృక్షసంపద పొడవాటి గడ్డి, అడవి అత్తి పండ్ల చెట్లు, వెదురు, టేకు, రోజ్వుడ్, మతి, వెంగై, వెంటీక్లతో దట్టంగా కప్పబడి ఉంటుంది. ఇక్కడ ఉన్న పొడవైన గడ్డిని 'ఎలిఫెంట్ గ్రాస్' అని పిలుస్తారు. అటవీ జంతుజాలంలో మకాక్, కొండచిలువ, పులులు, చిటాల్, ఒట్టర్, పాంథర్, నాలుగు కొమ్ముల జింక, అడవి కుక్క, ఎలుగుబంటి, చిరుతలు, సాధారణ లంగూర్, హైనా, మొసళ్ళు (మగ్గర్), జెయింట్ ఫ్లయింగ్ స్క్విరెల్, అడవి పిల్లులు ఉన్నాయి.[6] అంతేకాకుండా గుడ్లగూబ, గద్ద, డేగ, మాగ్పీ-రాబిన్, మచ్చల బబ్లర్, స్మాల్ గ్రీన్ బార్బెట్, పచ్చ పావురాలు, వడ్రంగిపిట్ట, నెమలి వంటి అనేక రకాల పక్షులు ఉన్నాయి. ఈ అభయారణ్యంలో దాదాపు 50 రకాల చేపలు, 21 జాతుల ఉభయచరాలు, 34 రకాల సరీసృపాలు, 227 రకాల పక్షులు, 55 రకాల క్షీరదాలు ఉన్నాయి. వన్యప్రాణుల భద్రత దృష్ట్యా, తమిళనాడు ప్రభుత్వం రాత్రి 9.00 గంటల నుండి ఉదయం 6.00 గంటల వరకు వాహనాలను నిషేదించింది.
చూడదగిన ప్రదేశాలు
మోయార్ నది, ఏనుగుల దాణా శిబిరం, ముదుమలై మ్యూజియం, కల్లట్టి జలపాతం, పైకారా జలపాతాలు.[7]
వివరాలు
- ప్రవేశ రుసుము: ఒక్కొక్కరికి రూ. 30 ఎంట్రీ ఫీజు[8]
- స్టిల్ కెమెరా కోసం: రూ. 53
- వీడియో కెమెరా కోసం: రూ. 315
- బస్ సఫారీ ఒక్క వ్యక్తికి: రూ. 340
- జీప్ సఫారీ కోసం ఒక్క వ్యక్తికి: రూ. 4200
- ఎలిఫెంట్ సఫారీ కోసం: రూ. 1120
- సమయాలు: వారంలోని అన్ని రోజులు, 7:00 AM - 9:00 AM, 4:00 PM - 6:00 PM
- స్థానం: నీలగిరి, తమిళనాడు
- సందర్శన వ్యవధి: 2-3 గంటలు
- సమీప రైల్వే స్టేషన్: ఉదగమండలం రైల్వే స్టేషన్
- సమీప విమానాశ్రయం: బెంగళూరు విమానాశ్రయం 35.5 కిలోమీటర్ల దూరం
- రోడ్డు మార్గం: మసినగుడి, బెంగుళూరు నుండి 240 కి.మీ, మైసూర్ నుండి 90 కి.మీ, ఉదగమండలం (ఊటీ) నుండి 68 కి.మీ, రోడ్డు మార్గంలో కాలికట్ నుండి 124 కి.మీ దూరంలో ఉంది.