శ్రీలంకలో హిందూమతం
హిందూమతం శ్రీలంక లోని అత్యంత పురాతన మతాలలో ఒకటి. ఇక్కడ 2,000 సంవత్సరాల నాడే దేవాలయాలు ఉన్నాయి. [1] 2011 నాటికి, శ్రీలంక జనాభాలో హిందువులు 12.6% ఉన్నారు. [2] భారతదేశం, పాకిస్తాన్ నుండి (సింధీలు, తెలుగులు, మలయాళీలతో సహా) వచ్చిన చిన్నచిన్న వలస సమాజాలను మినహాయిస్తే, వారంతా దాదాపుగా తమిళులే. మెజారిటీ సింహళీయులు ఆచరించే బౌద్ధమతంపై హిందూమతం పెద్ద ప్రభావాన్ని చూపింది.
మొత్తం జనాభా | |
---|---|
25,61,299 (2012) మొత్తం జనాభాలో 12.6% | |
మతాలు | |
హిందూమతం శైవం (మెజారిటీ) వైష్ణవం, శాక్తేయం (అల్పసంఖ్యాక) | |
గ్రంథాలు | |
రామాయణం , వేదాలు | |
భాషలు | |
ప్రాచీన తమిళం, సంస్కృతం తమిళం, సింహళం |
1915 జనాభా లెక్కల ప్రకారం, శ్రీలంక జనాభాలో హిందువులు దాదాపు 25% ఉన్నారు (బ్రిటిషు వారు తీసుకువచ్చిన ఒప్పంద కార్మికులతో సహా). [3] ఉత్తర, తూర్పు ప్రావిన్స్లలో (ఇక్కడ తమిళులు అతిపెద్ద జనాభా), మధ్య ప్రాంతాల్లో, రాజధాని కొలంబోలో హిందూమతం ఎక్కువగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, శ్రీలంకలో 25,54,606 మంది హిందువులు ఉన్నారు (దేశ జనాభాలో 12.6%). శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో, చాలా మంది తమిళులు వలస పోయారు. శ్రీలంక తమిళ ప్రవాసులు నిర్మించిన హిందూ దేవాలయాలు మతాన్ని, సంప్రదాయాన్నీ, సంస్కృతినీ కాపాడుతున్నాయి. [4] [5]
ఎక్కువ మంది శ్రీలంక హిందువులు శైవాన్ని అనుసరిస్తారు. కొందరు శక్తి ఆరాధన చేస్తారు . శ్రీలంకలో శివుని ఐదు ప్రధాన నివాసాలకు నిలయం: పంచ ఈశ్వరములు అంటారు. రావణుడు నిర్మించిన పవిత్ర స్థలాలివి. తమిళులు పూజించే మురుగన్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ హిందూ దేవతలలో ఒకరు. [6] [7]
జాఫ్నాకు చెందిన యోగస్వామి శ్రీలంక చరిత్రలో ముఖ్యమైన ఆధునిక హిందూ మత వ్యక్తి. 20వ శతాబ్దపు ఆధ్యాత్మికవేత్త. అతను దేశంలోని తమిళ హిందూ జనాభాకు సద్గురువు. అంపరై, బట్టికలోవా జిల్లాలలో రామకృష్ణ మఠం చురుకుగా ఉంది. శైవ సిద్ధాంత పాఠశాల ఉత్తరాన ప్రబలంగా ఉంది. [8] యోగస్వామి నందినాథ సంప్రదాయంలో 161 వ అధిపతి. శివయ్య సుబ్రమణ్యస్వామి ఆయన వారసుడు. [9]
పురాణ మూలాలు
శ్రీలంకకు సంబంధించిన మొదటి ప్రధాన హిందూ ప్రస్తావన రామాయణంలో కనిపిస్తుంది . [10] శ్రీలంకను యక్ష రాజు కుబేరుడు పరిపాలించేవాడు. లంకా సింహాసనాన్ని కుబేరుని సవతి సోదరుడు రావణుడు చేజిక్కించుకున్నాడు. అతన్ని రాముడు సంహరించాడు. [11] రామాయణం భారతదేశం, శ్రీలంక మధ్య ఉన్న రాముసేతువు గురించి కూడా ప్రస్తావిస్తుంది. రాముడు దీన్ని, హనుమంతుడు తదితరుల సహాయంతో రాళ్ళతో నిర్మించాడు. ఉపగ్రహ చిత్రాలలో శ్రీలంకను భారతదేశానికి అనుసంధానించే ఇసుక పట్టీ గొలుసును ఆనాటి వంతెన అవశేషాలుగా హిందువులు భావిస్తారు. చరిత్రపూర్వ కాలం నుండి, ప్రిన్స్ విజయ రాకకు ముందే, శ్రీలంకలోని కొన్ని ప్రాంతాలలో శివుని ఆరాధన జరిగేదని పురావస్తు ఆధారాలను బట్తి తెలుస్తోంది. రావణుడు కూడా శివ భక్తుడే. [12]
చారిత్రక మూలాలు
చాలా మంది విద్వాంసులు ద్వీపం యొక్క తొలి నివాసులు "యక్కా, నాగ, దేవ, రక్కా " పేర్లతో సూచించబడే గిరిజన ప్రజలు అని భావిస్తారు. నాగులు శివుణ్ణి, పాములనూ పూజించేవారు. ఇది హిందూ మతపు ప్రారంభ రూపం. ఇలాంటి ఆచారాలు తమిళనాడు లోను, భారతదేశం లోని ఇతర భాగాల్లోనూ సాధారణమే. [13] జాఫ్నా ద్వీపకల్పంలో నివసించిన నాగులు బహుశా శ్రీలంక తమిళుల పూర్వీకులు కావచ్చు. వారు సా.పూ. 3వ శతాబ్దం సమయంలో తమిళ భాషను, సంస్కృతినీ గ్రహించడం ప్రారంభించి, క్రమేణా తమ ప్రత్యేక గుర్తింపును కోల్పోయారు. [14] [a] నైనతీవు లోని నైనతీవు నాగపూషాణి అమ్మవారి ఆలయం శక్తిపీఠాల్లో ఒకటని నమ్ముతారు. [17]
అనురాధపురానికి చెందిన దేవనాంపియ టిస్సా పాలనలో అశోకుని పెద్ద కుమారుడు మహింద బౌద్ధమతాన్ని ప్రవేశపెట్టాడు. [18] సింహళీయులు బౌద్ధమతాన్ని స్వీకరించగా, తమిళులు హిందువులుగానే మిగిలిపోయారు. [19] తమిళనాడులోని పాక్ జలసంధి మీదుగా జరిగిన కార్యకలాపాలు శ్రీలంకలో హిందూమతం మనుగడకు వేదికగా నిలిచాయి. తమిళులలో శైవమతం (శివుని ఆరాధన) ప్రబలంగా ఉండేది. శ్రీలంకలో హిందూ దేవాలయ నిర్మాణం, శ్రీలంక తత్వశాస్త్రం చాలావరకు ఆ సంప్రదాయం నుండే వచ్చాయి. తిరుజ్ఞాన సంబంధర్ తన రచనలలో శ్రీలంక లోని అనేక హిందూ దేవాలయాలను గుర్తించాడు. [20]
సంస్కృతి
ఆచారాలు
దక్షిణ భారతదేశం లోని ఆచారాలైన కావడి అట్టం, ఫైర్వాకింగ్ శ్రీలంక లోనూ జరుగుతాయి. [21] ఈ ఆచారాలు, ద్వీపపు దక్షిణ తీరప్రాంతంలో ఉండే సింహళీయులను కూడా ప్రభావితం చేశాయి; ఉఆహరణకు, తాంగల్లె, కుడవెల్లా పరిసర ప్రాంతాల్లోని ప్రజలు కవడి జరుపుకుంటారు. [22]
మత గురువులు
మత గురువులలో ముఖ్యమైన వారు కడాయి స్వామి, అతని శిష్య చెల్లప్పస్వామి, చెల్లప్పస్వామి శిష్యుడు యోగస్వామి. [23]
దేవాలయాలు
- కోనేశ్వరం ఆలయంలో రావణానుగ్రహం
- నల్లూరు కందస్వామి ఆలయ ముఖ ద్వారం
- నైనాతీవు నాగపూషని అమ్మన్ ఆలయం
- తిరుక్కోవిల్ సితిర వేలాయుత స్వామి దేవాలయం, అంపారా
శ్రీలంకలోని చాలా హిందూ దేవాలయాల్లో తమిళ వాస్తుశిల్పం కనిపిస్తుంది. ఇవి పురాతనమైనవి. వీటిలో చాలావరకు గోపురం రథం ఉంటాయి. [24] అనేక హిందూ దేవాలయాల మాదిరిగానే , శ్రీలంకలోని దేవాలయాలు కూడా ప్రధానంగా తమిళ సమాజంలో ఉండే గ్రామ దేవతల ఆలయాలే. [25]
- ఉత్తరాన నాగులేశ్వరం ఆలయం.
- వాయువ్యంలో కేతీశ్వరం ఆలయం.
- తూర్పున కోనేశ్వరం దేవాలయం.
- పశ్చిమాన మున్నేశ్వరం ఆలయం.
- దక్షిణాన తొండేశ్వరం.
జనాభా శాస్త్రం
1981 జనాభా లెక్కల ప్రకారం, శ్రీలంకలో 22,97,800 మంది హిందువులు ఉన్నారు; 2012 జనాభా లెక్కల ప్రకారం 25,54,606 మంది హిందువులు ఉన్నారు. 2004 సునామీ సమయంలో LTTE ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోనే ఇరవై వేల మంది మరణించారు. [26] [27] [28]
చారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1881 | 5,93,600 | — |
1891 | 6,15,900 | +3.8% |
1901 | 8,26,800 | +34.2% |
1911 | 9,38,300 | +13.5% |
1921 | 9,82,100 | +4.7% |
1931 | 11,66,900 | +18.8% |
1946 | 13,20,400 | +13.2% |
1953 | 16,10,500 | +22.0% |
1963 | 19,58,400 | +21.6% |
1971 | 22,38,666 | +14.3% |
1981 | 22,97,806 | +2.6% |
1991 | 24,06,852 | +4.7% |
2001 | 24,81,495 | +3.1% |
2012 | 25,61,299 | +3.2% |
దశాబ్దిక జనాభా
సంవత్సరం | శాతం | పెంచు |
---|---|---|
1881 | 21.51% | - |
1891 | 20.48% | -1.03% |
1901 | 23.2% | +2.72% |
1911 | 22.85% | -0.35% |
1921 | 21.83% | -1.02% |
1931 | 22% | +0.17% |
1946 | 19.83% | -2.17% |
1953 | 19.9% | 0.07% |
1963 | 18.51% | -1.39% |
1971 | 17.64% | -0.87% |
1981 | 15.48% | -2.16 |
1991 | 14.32% | -1.16 |
2001 | 13.8% | -0.52 |
2012 | 12.58% | -1.22 |
హిందూమతం శాతం 1881 లో 21,51% నుండి 2012 లో 12,58% కి తగ్గింది [32] ప్రధానంగా బ్రిటిష్ వారు తీసుకువచ్చిన ఒప్పంద కార్మికులు భారతదేశానికి తిరిగి రావడం, శ్రీలంక అంతర్యుద్ధం కారణంగా వలస పోవడం ఈ తగ్గుదలకు కారణం.
జిల్లాల వారీగా జనాభా
S. No. | జిల్లా | మొత్తం జనాభా | హిందువుల జనాభా | హిందువులు ( % ) | |
---|---|---|---|---|---|
1. | కొలంబో | 23,24,349 | 274,087 | 11.79% | |
2. | గంపహా | 23,04,833 | 112,746 | 4.89% | |
3. | కలుతర | 12,21,948 | 114,556 | 9.37% | |
4. | కాండీ | 13,75,382 | 197,076 | 14.32% | |
5. | మాటలే | 4,84,531 | 45,682 | 9.42% | |
మొత్తం | 2,03,59,439 | 25,61,299 | 12.6% | ||
మూలం: 2012 Census |