హిందూధర్మం

హిందూధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం.

హిందూధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ ధర్మం అతి పురాతన సంస్కృతి. [note 1] దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది.[6] ధర్మం అనగా ఆచరణీయ కార్యం. మతమనగా అభిప్రాయం .హిందూ అనే పదమును పార్శీలు మొదట వాడేవారు, హిందు అనే పదానికి పార్శీ భాషలో సింధు అని అర్థం. సింధూనది ఒడ్డున నివసించే వారిని అలా పిలిచేవారు కాని ఇప్పుడు వేదాలు, వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని పిలుస్తున్నారు.[7]హిందూమతం, దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంబంధించినవి.[8] హిందూమతం ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైంది.[9][10] ఈ జీవన విధానాన్ని అనగా హిందూధర్మాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు.[11][12] జనసంఖ్య ఆధారంగా ఈ జీవనవిధానాన్ని పాటించే వారు ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉన్నారు. సుమారు ఒక బిలియన్ హిందూ జనాభాలో 905 మిలియన్లు భారతదేశం, నేపాల్ లోనే నివసిస్తున్నారు.[13] హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, మారిషస్, ఫిజి, సురినాం, గయానా,ట్రినిడాడ్, టుబాగో, అమెరికా, రష్యా, చైనా ముఖ్యమైనవి.

హిందూ సంస్కృతి వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
వినాయకుడు లేదా 'గణపతి'. ఏ పనికైనా, పూజకైనా ముందుగా గణపతి పూజ చేయడం చాలా సంప్రదాయాలలో ఆనవాయితీ.

హిందువుల వేద సంపద అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను చెప్పబడిన వాటిగా, గుర్తుంచుకోబడిన వాటిగా విభజించవచ్చు. ఈ వేదాలు వేదాంత శాస్త్రం, తత్వ శాస్త్రం, పురాణాలు, ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. సాంప్రదాయం ప్రకారం వేదాలు, ఉపనిషత్తులు అతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు, పురాణాలు, మహా కావ్యాలైనటువంటి రామాయణం, మహాభారతం కూడా ముఖ్యమైనవే. భగవద్గీత అన్ని వేదాల సారాంశముగా భావించబడుతోంది.[14]

ఈ చిత్రంలో చూపబడిన దేవాలయ సందర్శనా కార్యక్రమాలు హిందువుల నమ్మకాలను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.

పద వ్యుత్పత్తి

హిందూ అనే పదం సింధూ అనే పదం నుండి వచ్చింది" ఋగ్వేదం సిందు నది పరీవాహక ప్రాంతాన్ని సప్త సింధు (ఏడు నదులు కల ప్రాంతం) అని పేర్కొంది. జొరాస్ట్రియనుల గ్రంథాలలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. ఈ పదం భారతదేశ ఉపఖండంలో (సింధు నది ఆవల) నివసించే వారిని గురించి చెప్పబడింది.

విశ్వాసాలు

హిందూధర్మంలోఓంకారం శబ్దానికి చాలా విశిష్టత ఉంది. ఈ శబ్దాన్ని ప్రణవ నాథమని, సృష్టికి పూర్వం అంతటా ప్రణవమే ఉండేదని, ఇదే పర బ్రహ్మ స్వరూపమని అంటారు. దాదాపు అన్ని మంత్రాలకు ముందు ఓంకారం ఉంటుంది.

హిందూ ధర్మం వైవిధ్యమైంది. కొన్ని విశ్వాసాలు ప్రబలంగా ఉన్నప్పటికీ, పండితులు అందరూ ఆమోదించే విశ్వాసాలను ప్రామాణికంగా మార్చడం కష్టమే.[15] ధర్మం (నీతి నియమాలు, విధులు), సంసారం, మోక్షం (సంసారం నుండి విముక్తి),, ఇతర యోగ పద్ధతులు మొదలైనవి ప్రబలమైనవి.

అయితే సగటు మానవుడు పాటించాల్సిన 4 కర్తవ్యాలు ధర్మ గ్రంథాల్లో చెప్పబడ్డాయి . అవి ధర్మం, అర్థం, కామం, మోక్షం.

వీటిలో మోక్షం పొందుటకు ప్రధానంగా చెప్పబడిన మార్గాలు నాలుగు. అవి జ్ఞాన మార్గం, కర్మ మార్గం, భక్తి మార్గం, క్రియా మార్గం . ( ప్రస్తుతం అధిక శాతం హిందువులు భక్తి మార్గాన్ని పాటిస్తారు )

దైవ భావన

వేదాలలో " బ్రహ్మం" (పరమాత్మ /పర బ్రహ్మం) గురించి చెప్పబడింది.ఉన్నదంతా బ్రహ్మమే . హిందువులు పూజించే దేవి దేవతలు ఆ పరమాత్మ (లేదా పరబ్రహ్మం) వివిధ రూపాలుగా చెప్పబడ్డాయి. ప్రాణుల అన్నిటిలో ఉన్న "ఆత్మ " కూడా ఆ బ్రహ్మమునకు చెందిందే. ఈ పరమాత్మ లేదా పర బ్రహ్మంను నేరుగా గ్రహించటాన్ని " నిర్గుణ బ్రహ్మం " ( గుణములు, ఆకారం లేని బ్రహ్మం) అని అంటారు. అయితే ఇలా గుణములు, ఆకారం లేని పరమాత్మను నిర్గుణ బ్రహ్మమును పంచభూతాల్లో నేరుగా "అనుభూతి " చెందవచ్చు. కానీ నేరుగా ఆరాధించటం జీవాత్మకు ( మనకు ) సాధ్యపడదు. కాబట్టి అదే పరమాత్మను "సగుణ బ్రహ్మం"గా ఆరాధిస్తారు. ముఖ్యంగా సృష్టి కర్తగా, స్థితి కర్తగా, లయ కర్తగా ఆరాధిస్తారు.

మహా విష్ణువు: అనగా మహా విశ్వమంతటా వ్యాపించి ఉన్న వాడు అని అర్థం. పురాణాల ప్రకారం సృష్టిలో లెక్కలేనన్ని విశ్వాలు ఉన్నాయి. ఈ విశ్వాలన్నిటిని పట్టి ఉంచేవాడు లేదా స్థితిలో ఉంచే వాడును మహా విష్ణువు. ప్రత్యేకంగా ఒక విశ్వాన్ని స్థితిలో ఉంచే స్థితి కర్తను " గర్బోధయక్షయ విష్ణు " అంటారు.

మహాశివుడు: సృష్టిని లయం చేసి (నాశనం చేసి) తిరిగి కొత్త సృష్ఠిని ప్రారంభించుటకు సిద్ధం చేయువాడు.

బ్రహ్మ: పురాణాల ప్రకారం సృష్టిలో ఒక్కో విశ్వానికి ఒక్కొక బ్రహ్మ ఉంటాడు. బ్రహ్మ కేవలం ఆ విశ్వానికి "సృష్టి కర్త". కాబట్టి బ్రహ్మని రెండవ సృష్టికర్తగా చెపుతారు.

ఎక్కువ మంది హిందువులు నమ్మే విషయాలలో ఒకటి - ఆత్మ శాశ్వతమైంది, నిరాకారమైంది.[16] అద్వైతం వంటి వేదాంతాల ప్రకారం ఈ ఆత్మయే బ్రహ్మము (పరమాత్మ). అద్వితీయము. గుణ రహితము.[17] ఆత్మ జ్ఞానమే బ్రహ్మ జ్ఞానము.[18] ఆత్మ జ్ఞానము లభించినవారికి మోక్షం (బంధనాలనుండి విముక్తి) సిద్ధిస్తుందని ఉపనిషత్తులు చెబుతున్నాయి.[16][19][20]

ద్వైతం, భక్తి వంటి వేదాంత సిద్ధాంతాల ప్రకారం ఆత్మ, పరమాత్మ వేరు వేరు. పరమాత్మకు స్పష్టమైన ఆకృతి ఉంది. జీవుడు పరమాత్మను చేరడమే ముక్తి లేదా మొక్షమని చెప్పబడుతుంది.[21] పరమాత్మ అయిన భగవంతుడు "పరమేశ్వరుడు"[22]), Bhagavan ("The Auspicious One"[22]), or Parameshwara ("The Supreme Lord"[22]).[17] కాని ఆయా వేదాంత సూత్రాలను బట్టీ, వాటి వివరణను బట్టీ "బ్రహ్మ", "బ్రహ్మము", "ఈశ్వరుడు", "దేవుడు" వంటి పదాలను అర్ధం చేసుకొనే విధానంలో వైవిధ్యం ఉంటుంది.[17][23] సాంఖ్యం వంటి సిద్ధాంతాలలో నాస్తికత లక్షణాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.[24]

హైందవ ధర్మం ఏకేశ్వరోపాసన, నాస్తిక వాదం, ఆస్తిక వాదం, ద్వైతం, అద్వైతం, లాంటి విభిన్న విశ్వాసాల సమ్మేళనం. ఇంతటి సంక్లిష్టమైన భావాలు బహుశా మరే జీవనవిధానంలోను కనిపించవు. ఒక్క పదంతో వర్ణించాలంటే అది అసంపూర్తిగానే ఉంటుంది.

హిందువులలో చాలామంది ఆత్మ శాశ్వతమైనదని నమ్ముతారు. అద్వైతం ప్రకారం ఈ ఆత్మ అనేది అనంత శక్తి స్వరూపమైన బ్రహ్మం నకు చెందినదే. బ్రహ్మం అనగా ఏదీ సాటిరాని సత్యం. అందుకనే దీనిని అద్వైతం (ద్వైతం కానిది)అన్నారు. దీని ప్రకారం మనుజులు తాము ఆత్మ స్వరూపులని, బ్రహ్మంలో భాగమని తెలుసుకోవడం జీవన పరమార్థం. ఉపనిషత్తుల ప్రకారం ఎవరైతే జీవులు తాము కేవలం దేహం మాత్రమే కాదని, సంపూర్ణ ఆత్మజ్ఞాన సంపన్నులై ఉందురో వారు మోక్ష ప్రాప్తినొందగలరు.

అద్వైతానికి విరుద్ధమైనది ద్వైతం. ద్వైతం అనగా నీవు, భగవంతుడు వేరనే భావన. పరమాత్మ స్వరూపుడు భగవంతుడైతే ఆత్మ స్వరూపులు మనుషులౌతారు. ఈ మార్గాన పయనించేవారు, విష్ణువు, శివుడు, లేదా శక్తిని పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. ఆత్మ భగవంతుని మీద ఆధారపడితే, మోక్షం దేవుని కృపమీద ఆధారపడి ఉంటుంది. పరమాత్మ స్వరూపుడను మహోన్నతమైన మూర్తిగా భావించినపుడు ఆయనను ఈశ్వరుడు, లేదా భగవానుడు లేదా పరమేశ్వరుడు అనవచ్చును. కానీ ఈశ్వర శబ్దాన్ని ద్వైత్వాన్ని అనుసరించేవారు, అద్వైతాన్ని అనుసరించేవారు వేర్వేరు భావనలుగా స్వీకరిస్తారు. నాస్తికవాదం వైపు మొగ్గు చూపే సాంఖ్యకులు కూడా ఉన్నారు.

దేవుళ్ళు, అవతారాలు

రాధాకృష్ణులు, హిందూధర్మంలో పూజింపబడే అనేక దేవిదేవతలలో ఒక జంట

హిందూ పురాణాల ప్రకారం దేవతలు లేదా దేవుళ్ళు అనగా స్వర్గ లోక నివాసులు, పరమ పవిత్రులు, పూజింపదగినవారు. హిందూ గ్రంథాల్లో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారి గురించి ఎన్నో రకాలైన కథలు, పురాణ గాథలు, ఇతిహాసాలు ప్రచారంలో ఉన్నాయి. ఇంత మంది దేవుళ్ళు ఉన్నా పరమేశ్వరుడు ఒక్కడే. ఆయనే సృష్టి అంతటికీ మూలాధారం.[25][26] ధర్మాన్ని పరిరక్షించడానికి, సకల మానవాళిని సరియైన దారిలోకి మళ్ళించడానికి స్వర్గం నుంచి మానవ రూపంలో భువిపైన జన్మించిన వారిని అవతార పురుషులు లేదా అవతార మూర్తులు అంటారు. రామావతారం, కృష్ణావతారం మొదలైనవి ఇందులో ముఖ్యమైనవి.

కర్మ, సంసారం, మోక్షం

కర్మ అంటే సామాన్యార్థములో చేతలు, పని చెయ్యడము, విధి, కార్యకారణ నియమము అని చెప్తారు. ఉపనిషత్తుల ప్రకారము ఒక వ్యక్తి లేక జీవాత్మ, బాహ్యముగా కానీ లేక మానసికముగా కానీ చేసిన పనుల వలన సంస్కారాలను ప్రోగు చేసుకుంటుంది. లింగ శరీరము (అనగా బాహ్య శరీరమునకు, ఆత్మకు మధ్య గలది) ఈ సంస్కారాలను తర్వాతి జన్మలకు తీసుకుని వెళుతుంది. ఈ విధముగా అపజయము ఎరుగని, తటస్థ,, విశ్వ నియమము, ఐన కర్మ ఒక వ్యక్తి మరు జన్మకు, ఆ జీవాత్మ ఏ కుటుంబంలో పుట్టాలి అనేది నిర్ణయిస్తుంది. చర్య, ప్రతిచర్య, పుట్టుక, మరణము, పునర్జన్మ అను చక్రాన్ని సంసారము అంటారు. హిందువుల ఆలోచన ప్రకారము కర్మకు, పునర్జన్మకు చాలా ప్రాముఖ్యత ఉంది.

భగవద్గీత ప్రకారం:

" చినిగిన బట్టలను ఏ విధము గా పారవేసి మనము కొత్త బట్టలను ధరిస్తామో అదే విధముగా ఆత్మ శిథిలమైన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది." ( భగవద్గీత రెండవ అధ్యాయము 22 వ శ్లోకము) సంసారము అనిత్యమైన సుఖాలను ఇచ్చి తద్వారా పునర్జన్మకు కారణము అవుతుంది. ఐనా మోక్షము ద్వారా సంసారాన్ని తరించవచ్చని నమ్మబడుతోంది. చాలా జన్మల తర్వాత ఆత్మ తనంతటతానే పరమాత్మతో ఐక్యాన్ని కోరుకుంటుందని ఒక నమ్మకము.

జీవిత పరమార్థం మోక్షం. అనగా పరమాత్మతో ఐక్యం కావడం అని చెప్పబడుతోంది. అనగా ఆత్మ సాక్షాత్కారం, జీవేశ్వరుల ఐక్యత, ఆత్మ పరిపూర్ణ నిస్వార్థత, అమాయకత్వము నుండి విడుదల, పరిపూర్ణ మనశ్శాంతి. ఈ విధమైన స్వేచ్ఛ మనిషిని సంసారం నుండి విడుదల చేసి పునర్జన్మ లేకుండా చేస్తుంది. మోక్షానికి నిర్వచనములు హిందూ మతములో పలురకాలుగా ఉన్నాయి. ఉదాహరణకు "అద్వైతం" ప్రకారం మోక్షం పొందిన తర్వాత వ్యక్తిత్వం నశించిపోయి విశ్వాత్మ అనగా భగవంతునిలో లీనమవుతుంది. ద్వైతుల ప్రకారము జీవాత్మ అనేది పరమాత్మలో ఒక భాగమని, మోక్షము తర్వాత పరమాత్మతో పరమాత్మ లోకంలో అతని సాన్నిధ్యములో అనంతకాలము ఉంటామని భావిస్తారు. అయితే ద్వైతుల ప్రకారం మోక్షము అనగా " చక్కెరను రుచి చూడడము", అద్వైతుల ప్రకారం " చక్కెర గా మారిపోవడం" అని అర్థం.

జీవన గమ్యాలు

హళెబీడు లోని హొయసలేశ్వర మందిరంలో త్రిమూర్తుల శిల్పాలు: బ్రహ్మ, విష్ణువు, శివుడు.

సంప్రదాయ హిందూధర్మం రెండు ముఖ్యమైన జీవిత కాల ధర్మాలను అంగీకరిస్తుంది: అవి గృహస్థ, సన్యాస ధర్మాలు.

గృహస్థ ధర్మం నాలుగు విధాల పురుషార్థాలను భోధిస్తుంది. అవి

  1. " కామము ": శారీరక లేక ఇంద్రియ లేక లౌకిక సుఖాలు
  2. " అర్థము ": ధన సంపాదన, కీర్తి
  3. " ధర్మము": మత లేక సామాజిక నియమాలకు కట్టుబడి జీవించడము
  4. " మోక్షము ": పునర్జన్మ రాహిత్యము లేక సంసారచక్రము నుండి విడుదల[27][28]

వీటిలో ధర్మము, మోక్షం ప్రముఖమైనవి.[28] మోక్షమును పొందాలంటే కామం అనగా కోరిక, ధనసంపాదన ధర్మయుక్తముగా ఉండాలి. సన్యాస ధర్మము అనగా మోక్షమును మాత్రం కోరుతూ మిగిలిన మూడు పురుషార్థాలను త్యాగం చెయ్యడం. గృహస్థుడు కూడా కాలాంతరములో దీనిని పొందుతాడు. అంతేకాక కొందరు మనుషులు పూర్వజన్మల సంస్కారాల వలన ప్రస్తుతం ఏ దశలో ఉన్నప్పటికీ వెంటనే సన్యాసస్థితిని పొందుతారు.

యోగము

జీవితంలో అనుసరించవలసిన నియమాలగురించీ, సాధించవలసిన లక్ష్యాలగురించీ వివిధ అభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటి సాధనకు పాటించే మార్గాన్నియోగము అని అంటారు. ప్రతి మనిషి తన జీవిత పరమార్థాన్ని చేరుకోవడానికి యోగులు వివిధ రకాలైన పద్ధతులను ఉపదేశించారు. వీటిలో ఏదైనా ఒక యోగాన్ని సాధన చేసేవారిని యోగి అని అంటారు. భగవద్గీత, యోగ సూత్రాలు, హఠయోగ ప్రదీపిక, వీటన్నింటికీ మూల గ్రంథాలైన ఉపనిషత్తులు యోగం కోసం అంకితమైనవి. ఎవరైనా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని (మోక్షం, సమాధి, లేదా నిర్వాణం)చేరుకోదలచిన వారు క్రింద పేర్కొన్న మార్గాలను అనుసరించ వచ్చు.[29]

ఒక మనిషి తన ఇష్టాన్ని బట్టి లేదా అర్థం చేసుకొనే శక్తిని బట్టి ఈ నాలుగింటిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొనవచ్చు. కానీ కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఈ కలియుగంలో భగవంతునికి చేరువ కావడానికి భక్తి మార్గం కంటే మించిన మార్గం మరొకటి లేదని చెపుతుంటారు. ఒక మార్గాన్ని అనుసరించడం ద్వారా మరొక మార్గాన్ని అనుసరించకూడదని నియమమేమీ లేదు. ఉదాహరణకు జ్ఞాన యోగాన్ని శ్రద్ధగా ఆచరించడం ద్వారా పవిత్రమైన ప్రేమను కూడా సాధించవచ్చు. ధ్యాన యోగాన్ని అనుసరించేవారు తప్పని సరిగా కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగ భావనల్ని ఇముడ్చు కోవాల్సి ఉంటుంది.

వివిధ యోగాల ఆచరణ గురించీ, వాటిలోని భేదాల గురించీ, వాటి మధ్యనున్న సమన్వయం గురించీ అనేక గ్రంథాలు, సూత్రాలు, అభిప్రాయాలు, ఆచారాలు ఉన్నాయి.[29][30][31]

చరిత్ర

టిబెట్ లోని కైలాస పర్వతం పార్వతీ పరమేశ్వరుల నివాస స్థానంగా హిందువులకు పవిత్రమైనది.

క్రొత్త రాతియుగం నుండి హరప్పా మొహంజొదారో నాగరికత కాలం వరకు హిందూమతం గురించిన పురాతన ఆధారాలు ఉన్నాయి. (సాశ.ఫూ. 5500–2600).[32][33][34][35] (సాశ.ఫూ.1500–500) కాలానికి చెందిన అంశాలను 'చారిత్రిక వైదిక ధర్మం'కు చెందినవని అంటారు.

వేదాల ఆవిర్భావం నుండి హిందూమతం ఆచారాలు, సిద్ధాంతాలలో ఏర్పడిన స్పష్టత ఇప్పటికీ కొనసాగుతున్నది. వీటిలో అతి పురాతనమైన ఋగ్వేదం 1700–1100 BCE కాలానికి చెందినదని ఒక అభిప్రాయం.[36] వేదాలలో ఇంద్రుడు, వరుణుడు, అగ్ని వంటి దేవతల ఆరాధన, సోమయాగం వంటి యజ్ఞకర్మలు బహుళంగా చెప్పబడ్డాయి. విగ్రహారాధన కంటే మంత్రారాధన, యజ్ఞకాండలు వేదసాహిత్యంలో ప్రాముఖ్యత వహిస్తాయి. ఋగ్వేదంలోని ఆచారాలు, విశ్వాసాలు జొరాస్ట్రియన్ మతానికి కొంత సారూప్యం కలిగి ఉన్నాయి.[37]

వేదాల తరువాతి కాలాన్ని పురాణాల కాలంగా పేర్కొంటారు. వీటిలో మొదటివైనరామాయణం, మహాభారతం 500–100BCE,[38] కాలంలో రూపుదిద్దుకొన్నాయి.[39] తరువాత అనేక పురాణాలు వెలువడ్డాయి. పురాణాలలోని వివిధ అంశాలు నేటి హిందూమతాచారాలు, వ్యవహారాలు, విశ్వాసాలకు ప్రధాన ప్రమాణాలు.

హిందూ మతాన్నీ, అందులోని నమ్మకాలనూ మౌలికంగా ప్రభావితం చేసి, క్రొత్త పరిణామాలకు దారితీసిన మూడు ముఖ్యాంశాలు - ఉపనిషత్తులు, జైన మతము, బౌద్ధ మతము [40] వీటిలో వేదాల సాధికారతను, వర్ణ వ్యవస్థ బంధాన్ని అంగీకరించకుండా మోక్షము లేదా నిర్వాణం పొందడం గురించి చెప్పబడింది.[ఆధారం చూపాలి]. గౌతమ బుద్ధుడు మరింత ముందుకు వెళ్ళి ఆత్మ లేదా భగవంతుడు అన్న నమ్మకాలను ప్రశ్నించాడు.[41] మౌర్యుల కాలంలో బౌద్ధం దేశమంతటా వర్ధిల్లింది (సాశ.పూ. 300 నుండి సా.శ. 200 వరకు). తరువాత వివిధ వేదాంత దర్శనాలు అనేక విధాల సిద్ధాంతాలను ప్రతిపాదించాయి.[42] వీటిలో సా.శ.పూ. 6వ శతాబ్దం నాటి చార్వాకుని నాస్తిక వాదం కూడా ఒకటి.[43] క్రమంగా మళ్ళీ బౌద్ధమతాన్ని తోసిరాజని హిందూమతం సా. శ. పూ. 400 నుండి సా.శ. 1000 కాలంలో బలపడింది.[44]

సా.శ. 7వ శతాబ్దంలో భారతదేశంలో అరబ్బు వర్తకుల ద్వారా ప్రవేశపెట్టబడిన ఇస్లాం మతం తరువాత ముస్లిం పాలనా సమయంలో దేశమంతటా విస్తరించింది.[43] ఈ కాలంలో రెండు మతాల మధ్యా వివిధ స్థాయిలలో ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. అదే సమయంలో సహ జీవన విధానాలు కూడా అభివృద్ధి చెందాయి. తరువాతి కాలంలో రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్యుడు వంటి ప్రవక్తల బోధనల వల్ల హిందూమతంలో మరికొన్ని నూతన విధానాలు నెలకొన్నాయి.[43][45]

అస్తిత్వం (ఉనికి)

పూర్వం టిబెట్, ఆగ్నేయ ఆసియా దేశాలలో కూడా హిందూ మతం ఉనికిలో ఉండేది. భారత్, నేపాల్, బాలి ద్వీపం (ఇండోనేషియా)లలో హిందూ మతం ఇప్పటికీ బలంగా స్థిరపడి ఉంది.

వేదాలు, వేదాంత శాస్త్రం

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం
ప్రపంచంలో అత్యంత పురాతనమైన గ్రంథాలలో ఒకటిగా చెప్పబడే ఋగ్వేదంలో ఒక పేజీ.

హిందూ మతానికి ఆధారభూతమైనటువంటి ఆధ్యాత్మిక నియమాలు వేర్వేరు కాలాలలో వేర్వేరు వ్యక్తులచే ఏర్పరచబడ్డాయి.[46][47] వేదాలను గ్రంథస్తం చేయక మునుపు కొన్ని శతాబ్దాలపాటు కేవలం శ్రవణం ద్వారానే బోధించబడేవి.[32][48] కొన్ని శతాబ్దాలపాటు కృషి చేసి మహర్షులు బోధనలను, నియమాలను విస్తృత పరచారు. వేదాలను రచించినప్పటినుంచి ఇప్పటిదాకా ఈ గ్రంథాలను కేవలం సాహిత్య పరంగా కాక వాటికి నీతి నియమాలను జోడించి అర్థం చేసుకుంటున్నారు. చాలావరకు పవిత్ర గ్రంథాలు సంస్కృతం లోనే ఉన్నాయి. వీటిని స్మృతిపురాణాలనీ, శ్రుతి పురాణాలని విభజించవచ్చు.

భారతీయధర్మమునకుగాని, మతమునకు గాని శ్రుతిస్మృతులే ఆధారములు. శ్రుతియొక్క యపరనామములే వేదము, ఆమ్నాయమును. దానినుండి ధర్మాధర్మములు శ్రుతము లగుచుండుటవలన అది శ్రుతి అనబడుచున్నది., నేమంత్రముయొక్క ఋషి యోగవాసిష్ఠాపరుడై ఉండినప్పుడు అతనికి అతనికి ఆమంత్రము విననగుటవలన దానికి శ్రుతినామము కలిగెను. ఋషి మంత్రద్రష్టయై; కాని తద్రచయిత కాడు. కనుక్ అ శ్రుతి అపౌరుషేయము. దానినుండి ధర్మాధర్మములు తెలియుచుండుటవలన అది వేద మనంబడెను. అది పారంపర్యముగా అధ్యసించుటవలన అది ఆమ్నాయ మనబడెను. మహర్షులు వేదార్హమును స్మరించి రచించిన గ్రంథములు స్మృతులు. శ్రుతి స్మృతి ప్రోక్తమతములె ఋషులవి. ఋషులు ఆర్యులు వారి మతం ఆర్ష మతం. ఆగమశాస్త్రోక్తమతము ఆగమమతము. అది శాక్తాగమ, శైవాగమ, వైష్ణవాగమాది భేదయుక్తము. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచింత్య అను నాలుగు మతాలే ఈదేశమున ప్రాబల్యము పొందినవి. ఈ మతస్తులందరు అహింస, సత్యము, అస్తేయము, శాఉచము, ఇంద్రియనిగ్రహము మొదలగు ధర్మములు నవశ్యాచరణీయములు.వీరు పునర్జన్మమును పరలోకమును నమ్ముదురు.దక్షిణాపధమునందున్న యనార్యుల ప్రధానోపాస్యదేవుడు సుబ్రహ్మణ్యుడు. అతడు షడాననుడును శూలాధరుయుడును. మాళవదేశమునందున్న యనార్యులకు ప్రధానదేవతలు భూమియును, సూర్యుడును.

హిందూ మతం యొక్క మొట్టమొదటి గ్రంథాలైన వేదాలు శ్రుతులకిందకు వస్తాయి. వేదాలను హిందూ ప్రజలు ప్రాచీన ఋషులు కనుగొన్న శాశ్వత సత్యాలుగా కీర్తిస్తారు.[47][49] కొద్ది మంది భక్తులు మాత్రం వేదాలు ఏ ఒక్కరో లేక భగవంతుడే ఏర్పరిచినట్లు భావించక అన్ని కాలాలలోనూ ఆచరించదగిన ఆధ్యాత్మిక నియమాల సారంగా భావిస్తారు.[46][50][51][52] కాలగమనంలో వేదాలకు కొత్త కొత్త భాష్యాలు పుట్టుకొస్తున్నాయి.

వేదాలు నాలుగు. అవి (1) ఋగ్వేదము, (2) సామవేదము, (3) యజుర్వేదము, (4) అధర్వణవేదము.అన్నింటికన్నా మొట్టమొదటిది, ముఖ్యమైనది ఋగ్వేదము. ప్రతి ఒక్క వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. మొదటి భాగాన్ని సంహిత అంటారు. ఇందులో పవిత్రమైనటువంటి మంత్రాలు లిఖించబడి ఉంటాయి. మిగతా మూడు భాగాలలో వ్యాఖ్యానాలు ఉంటాయి. సంహితం కన్నా ఇవి కొంచెం ఆలస్యంగా రచింపబడి ఉండవచ్చునని పండితుల భావన. మిగతా మూడు బ్రాహ్మనలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. మొదటి రెండు భాగాల్ని కర్మకాండలు అనీ తరువాతి రెండు భాగాలను జ్ఞానకాండలు అనీ పిలుస్తారు. కొన్ని భాగాలు కర్మకాండలను గూర్చి ప్రస్తావిస్తే ఉపనిషత్తులు ఆధ్యాత్మిక థృక్కోణాన్ని, తత్వశాస్త్ర బోధనలను,, బ్రహ్మము, పునర్జన్మను గూర్చి ప్రస్తావిస్తాయి.[32][53][54][55][56][57]

ఇక స్మృతి పురాణాలనగా గుర్తుంచుకొన్నవి. వీటిలో రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు అతి ముఖ్యమైనవి. అత్యంత ప్రాముఖ్యం పొందిన హిందూ మూలగ్రంథం భగవద్గీత మహాభారతంలోని అంతర్భాగం. మహాభారత సంగ్రామ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు పాండవ రాజకుమారుడైన అర్జునునకు ఉపదేశించిన సర్వ వేదాల సారాంశమే గీతాశాస్త్రం. పురాణాలు వివిధ రకాలుగా హిందూ భావజాలాన్ని వ్యక్తీకరిస్తాయి. ఇంకా దేవీ భాగవతం, తంత్రాలు, యోగ సూత్రాలు, తిరు మంత్రం, శివ స్తోత్రాలు, ఆగమ పురాణాలు స్మృతుల కిందకు వస్తాయి. వివాదాస్పదమైన మనుస్మృతి కుల వ్యవస్థను గూర్చి వివరిస్తుంది.

ఆరాధనా విధానాలు

స్వస్తిక చిహ్నం

ఈశ్వరాన్వేషణ,, దేవుని కృపకై కృషి హిందూ పద్ధతులలో ప్రధానమైన భాగాలు. అందువల్లనే హిందువులు దైనందిన జీవనంలో కూడా భవగవంతుని తలుచుకొనడానికి కొన్ని పద్ధతులు ప్రవేశ పెట్టారు. హిందువులు తమ ఇళ్ళలో ప్రతిష్ఠించుకొని కానీ లేక దేవాలయాలలో కానీ తమ ఇష్ట దైవాన్ని ఆరాధించవచ్చు. మామూలుగా ఆలయాలలో ప్రధాన దైవం, ఇతర దేవుళ్ళు కొలువై ఉంటారు. దేవాలయాలకు వెళ్ళడం కచ్చితమైన నియమమేమీ కాదు. చాలామంది కేవలం పండుగ రోజులలో మాత్రమే ఆలయాలను సందర్శిస్తుంటారు. సాధారణంగా హిందువులు విగ్రహాన్ని దైవంగా భావించి ఆరాధిస్తుంటారు. ఆ విగ్రహాన్నే తమకు, భగవంతునికి వారధిగా భావిస్తారు.[58] ఈ విగ్రహాన్ని కేవలం రాయిగా కాక సాక్షాత్ భగవత్స్వరూపంగా భావించాలని పద్మ పురాణం చెపుతోంది. ఆర్య సమాజ్ లాంటి వారు విగ్రహారాధనను వ్యతిరేకిస్తారు.

హిందూమతంలో చిత్రకళలోనూ, వాస్తులోనూ, సాహిత్యంలోనూ,, పూజలలో ఆధ్యాత్మికతను ప్రతిబింబించడానికి కొన్ని సంకేతాలను ఏర్పాటు చేశారు. పురాణాలనుంచి, వేదాలనుంచి,, సంప్రదాయాలను అనుసరించి ఒక్కో సంకేతం ఒక్కో అర్థాన్ని సంతరించుకుంటాయి. ఉదాహరణకు ఓం సంకేతం పరబ్రహ్మ స్వరూపం. స్వస్తిక్ గుర్తు శుభసంకేతం. తిలకం ఒక విశ్వాసాలను అనుసరించేవారిని సూచిస్తాయి. ఇంకా పద్మం, చక్రం, వీణ ఇతర సంకేతాలను సూచిస్తాయి.

మంత్ర పఠనం భగవంతుని కీర్తించడానికి, సేవించడానికి, ప్రార్థించడానికి, తమ భక్తిని తెలపడానికి సాధనంగా ఉపయోగపడుతుంది. చాలామంది భక్తులు పుణ్య నదుల దగ్గర గాయత్రీ మంత్రం, మహామృత్యుంజయ జపం పారాయణం చేస్తుంటారు. మహాభారతం' జపాన్ని' కలియుగం (ప్రస్తుతం నడుస్తున్న యుగం)లో అత్యుత్తమ ధర్మంగా అభివర్ణిస్తోంది. జపాన్ని ప్రధాన ఆధ్యాత్మిక పద్ధతిగా స్వీకరించిన వారు చాలామంది ఉన్నారు.

ఉత్సవాలు, ఆచారాలు, ధర్మ కర్మ విధులు

చాలామంది హిందువులు తమ ఇళ్ళలో ప్రతిరోజూ దీపారాధన, నైవేద్యం, వేద పారాయణం, దేవుని స్తోత్రాలు, మంత్ర పఠనం, ధ్యానం, ఇతర పూజా కార్యక్రమాలు వంటి వాటిని నిష్ఠగా నిర్వహిస్తుంటారు. ఈ ఆచారాలు, వ్యక్తిని బట్టి, గ్రామాలను బట్టి,, ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. ఇలాంటి కార్యక్రమాలలో గుర్తించదగిన విషయం ఏమిటంటే ఇవి ఆచరించే ముందు ఎవరైనా సరే మానసికంగా, శారీరకంగా పరిశుద్ధులై ఉండాలి. అందుకే స్నానం ఆచమనీయానికి అతి ముఖ్యమైనది. త్యాగం ద్వారా, దాన ధర్మాల ద్వారా మూటకట్టుకొన్న పుణ్యం మరుజన్మలో ఉపయోగపడుతుందని హిందువులు విశ్వసిస్తారు. యజ్ఞ యాగాదుల గూర్చి పురాణాలలో గొప్పగా కీర్తించారు. కానీ ఈ కాలంలో ఇవి తరచుగా నిర్వహించనప్పటికీ పెళ్ళిళ్ళలోనూ, కర్మకాండలలోనూ యధావిధిగా నిర్వర్తిస్తుంటారు.[59] చాలా మంది హిందువులు ఇంట్లో మతపరమైన ఆచారాలను పాటిస్తారు.[60]

పుట్టినరోజు, పెళ్ళి, మరణం మొదలైనవి మతసంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. ఉదాహరణకు అన్నప్రాసన రోజు బిడ్డకు మొట్టమొదటిసారిగా ఘనాహారం తినిపిస్తారు. ఉపనయనం రోజు జంధ్యాన్ని తొడుగుతారు. ఒక మనిషి చనిపోయిన తరువాత అతని దినం రోజున విందు పెడతారు. పెళ్ళి ఏ రోజున జరగాలనే ముహూర్తాన్ని వధూవరుల జాతక చక్రాన్ని బట్టి తల్లిదండ్రులు జ్యోతిష్కులచే నిర్ణయిస్తారు. సన్యాసులకు, ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు,, హిజ్డాలకు తప్పించి మిగతా వారందరికి సాంప్రదాయకంగా కర్మకాండలు జరుపుతారు. శవాన్ని నేలలో పూడ్చడాన్ని ఖననం అంటారు. కాల్చడాన్ని దహనం అంటారు. ఇవి చేసేముందు శవాన్ని తెల్లటి వస్త్రంతో కప్పి ఉంచుతారు.[61][62]

యాత్రలు, పండుగలు

పుణ్య క్షేత్ర సందర్శన హిందూమతంలో తప్పనిసరి కానప్పటికీ చాలామంది భారతదేశంలోని పుణ్యక్షేత్రాలను భక్తి ప్రపత్తులతో దర్శించి వస్తుంటారు. వీటిలో అలహాబాదు, హరిద్వార్, వారణాసి, బృందావనం ముఖ్యమైనవి. ఇంకా ఒడిషా రాష్ట్రంలో కల పూరీ జగన్నాథుని ఆలయం,రథ యాత్ర, ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల, తిరుపతి (కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర సన్నిధి), జమ్ము కాశ్మీర్ లోని కట్రా దేవాలయం ప్రసిద్ధి గాంచినవి. పూరీ, రామేశ్వరం, ద్వారక, బద్రీనాథ్ లను పుణ్యక్షేత్ర వలయంగా పేర్కొంటారు. ఇంకా నాలుగేళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళాకు భక్తులు విశేష సంఖ్యలో తరలి వస్తుంటారు. ఈ మేళా అలహాబాదు, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని ప్రాంతాల్లో ఒక్కోసారి ఒక్కోచోట జరుగుతుంటుంది. ఇంకా చెప్పుకోదగ్గవి శక్తి పీఠాలు (కాళీఘాట్,, కామాక్షి దేవాలయం). వీటిలో ఆదిశక్తిని ఆరాధిస్తారు.

హిందువులు ఒక సంవత్సరంలో చాలా పండుగలు జరుపుకుంటారు. చాలా పండుగలు హిందూ పురాణాల ప్రకారం ఏదో ఒక చరిత్ర కలిగి ఉంటాయి. కొద్ది మంది మాత్రమే జరుపుకొనే పండుగలు కూడా కొన్ని ఉంటాయి. దసరా, దీపావళి, వినాయక చవితి, మహాశివరాత్రి, శ్రీరామ నవమి, శ్రీకృష్ణాష్టమి, హోలీ మొదలైనవి ప్రధానమైన పండుగలు.

వ్యక్తి, సమాజం

పరమాత్మ స్వరూపం

హిందూ మతంలో భగవంతుని స్వరూపం, సృష్టి గురించి భాగవతంలోని ద్వితీయ స్కందంలో శుకమహర్షి పరీక్షిత్మ్హారాజుకు చెప్పాడు. భగవంతుడిని పరమేశ్వరుడని, విరాట్పురుషుడని ఇంకా అనేక పేర్లతో హిందూమతం వర్ణిస్తుంది. భగవంతుడు శాశ్వతుడు అంత్యకాలంలో సృష్టి ఆయనలో లీనమౌతుంది. తిరిగి భగవంతుని నుండి సృష్టి అనేకరూపాలతో ఆయననుండి ఉద్భవిస్తుంది. హిరణ్యమయమైన భగవంతుని శరీరంనుండి ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అని మూడు విధాలుగా ఈ జగతిని సృష్టించాడు.పరమాత్మ శరీరంలోని ఆకాశంనుండి ప్రవృత్తి సామర్ధ్యమైన ఓజస్సు,వేగ సామర్థ్యం,బలసామర్థ్యం ఉద్భవించాయి. ఆయనలోని సూక్ష్మరూపమైన క్రియాశక్తి వలన ప్రాణం పుట్టింది.ఆ ప్రాణం సమస్త జీవరాశిలో ప్రాణశక్తిగా ఉంది. భగవణ్తుని జఠరాగ్ని నుండి ఆకలి దప్పిక పుట్టాయి. పరమాత్ముని ముఖంనుండి నోరు, నాలుక, దవడలు పుట్టుకొచ్చాయి. నాలుక నుండి రసేంద్రియాలు ఉద్భవించాయి. ఆయన ముఖం నుండి వాగేంద్రియం పుట్టింది.వాగేంద్రియానికి అగ్ని దేవుడు అధిష్టాన దేవత అయ్యాడు. వాగేంద్రియం నుండి సంభాషించే శక్తి పుట్టింది. ఆయనలోని వాయు శక్తి నుండి ఘ్రాణేంద్రియం పుట్టింది. ప్రాణులకు వాసనా శక్తి వచ్చింది.ఘ్రాణేంద్రియానికి వాయువు అధిష్టాన దేవత అయ్యాడు. పరమాత్మ ఆత్మను అవలోకించగానే నేరాలు పుట్టాయి. నేత్రాల నుండి చూసే శక్తి వచ్చింది.నేత్రాలకు సూర్యుడు అధిదేవత అయ్యాడు. దిక్కులు అధిష్టాన దేవతగా కర్ణేంద్రియాలు పుట్టాయి. పరమాత్మ నుండి చర్మం పుట్టింది . దానికి స్పర్శా శక్తి వచ్చింది. చర్మం నుండి వెండ్రుకలు పుట్టాయి. వాటికి వృక్షాలు అధిదేవతలయ్యాయి. ఆ త్ర్వాత వాయువు నుండి చేతులు ఉద్భవించాయి వాటికి ఇంద్రుడు అధి దేవత అయ్యాడు.ఆ తరువాత పాదాలు పుట్టాయి. పాదాలకు విష్ణువు అధిదేవత అయ్యాడు. పరమాత్మఆనందపారవశ్యుడు కాగానే జననేంద్రియాలు పుట్టాయి.జననేంద్రియాల నుండి పునరుత్పత్తి శక్తి ఆవిర్భవించింది.జననేంద్రియాలకు ప్రజాపతి అధిష్టాన దేవత అయ్యాడు. మిత్రుడు అధిష్టాన దేవతగా పాయువు పుట్టింది. దానికి నిస్సార పదార్ధాలను విసర్జించే శక్తి పుట్టింది. జీర్ణమైన శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని స్వీకరించాలన్నప్పుడు మొదటి శరీరాన్ని వదలటానికి సాధనంగా బొడ్డు ఉపయోగపడుతుంది.ప్రాణ ఆపాన వాయువులు శరీరాన్ని వదిలి వేయగానే మృత్యువు సంభవిస్తుంది. క్రింది శరీరాన్ని పై శ్రీరాన్ని వేరు చేస్తూ మధ్య భాగంలో బొడ్డు ఉంటుంది. ఆ హారాన్ని జీర్ణం చేయడానికి ప్రేవులు, రక్తప్రసరణ ఇతర కార్యాలకు నాడీ వ్యవస్థ అవతరించాయి.వాటికి నదీ నదములు అధిష్టాన దేవతలు అయ్యాయి.పరమాత్మ ఒకసారి మాయను ధ్యానించగానే కామానికి, సంకల్పానికి నెలవైన హృదయం జనించింది.హృదయం నుండి సంకల్పం, బుద్ధి,చంద్రుడు, కాముడు జనించాయి. విరాట్పురుషుడి స్థూల శరీరం భూమి తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం, మహత్తత్వం, అవ్యక్తం అనే ఎనిమిది అనే ఎనిమిది ఆవరణలతో ప్రకాశిస్తుంది. ఇలా శుకమహర్షి పరీక్షిత్తు భాగవతంలో భగంతుని గురించి సృష్టి గురించి వివరించాడు.

ఆశ్రమాలు

హిందువుల ఆచారం ప్రకారం హిందువుల జీవనం నాలుగు ఆశ్రమాలుగా విభజించ బడి ఉంది.

మొదటిది బ్రహ్మచర్యాశ్రమం, విద్యార్థిగా, బ్రహ్మచారిగా, నియమబద్ధులై, ప్రశాంతంగా గురువు అదుపాజ్ఞలలో ఉంటూ ఆధ్యాత్మిక సంపత్తి కొరకై మనసును సిద్దం చేసే దశ. రెండోది గృహస్థ్యాశ్రమం. ఇందులో పెళ్ళి ద్వారా, తమ వృత్తుల ద్వారా కామాన్ని సంతృప్తి పరచడం, అర్థాన్ని (డబ్బు) సంపాదించడం ముఖ్యమైనవి. ఇంకా తల్లిదండ్రులను,పిల్లలను, అతిథులను,పెద్దలను ఆదరించడం హిందువుల యొక్క విధులు. మూడోది వానప్రస్థం. నెమ్మదిగా ఈ ప్రపంచంతో బంధాలను తెంచుకోవడం, బాధ్యతలు పిల్లలకు అప్పగించి తీర్థ యాత్రలు చేయడం ప్రధానమైనవి. ఇక చివరిదైన సన్యాసాశ్రమంలో ఈ ప్రపంచంతో బంధాలన్నింటినీ తెంచుకుని మోక్ష సిద్ధి కొరకు దేహ త్యాగం చేయడం.[63]

సన్యాసం

మోక్ష సాధనకు, ఆధ్యాత్మిక పరిపూర్ణతకు కొద్దిమంది సన్యాసాన్ని స్వీకరిస్తారు. సన్యాసాన్ని స్వీకరించిన వారు, నిరాడంబర జీవనం, బ్రహ్మచర్యం, ఐహిక సుఖములపై అనాసక్తి, భగవంతునిపై నిశ్చల భక్తిని తమ జీవన విధానంగా మలుచుకుని ఉంటారు. వీరిని సన్యాసులు, సాధుపుంగవులు, లేదా స్వాములని పిలుస్తారు.[64][65] సన్యాసం స్వీకరించిన మహిళలను సన్యాసినులు అంటారు. ఈ సన్యాసుల పట్ల హిందూసమాజం అత్యంత భక్తి ప్రపత్తులు కలిగి ఉంటుంది. ఎందువల్లనంటే వారు స్వార్థం,, ఇంద్రియ సుఖములందు అనాసక్తులై ఉంటారు. కొద్ది మంది ఆశ్రమాల్లో తమ జీవనం కొనసాగిస్తుంటారు, కొద్ది మంది మాత్రం తమ అవసరాలను ఆ సర్వేశ్వరుడే తీరుస్తాడని దేశ సంచారం చేస్తుంటారు. సన్యాసుల తిండి మొదలైన అవసరాలు తీర్చడం గృహస్తులు గొప్పగా భావిస్తుంటారు. సాధువులు పేద-ధనిక, మంచి-చెడు,తేడా లేకుండా అందరిపై సమదృష్టి కలిగి ఉంటారు. పొగడ్తలకు, నిందలకు, సంతోషాలకు, భాధకు చలించకుండా ఉండాలని ప్రయత్నిస్తుంటారు.[64]

వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ

హిందూ సమాజం సాధారణంగా నాలుగు వర్ణాలుగా విభజింపబడి ఉంది.

ఈ వర్ణ వ్యవస్థ, హిందూమతం అంతర్భాగమా? లేక కాలం చెల్లిన సామాజిక సాంప్రదాయమా? అన్న విషయంపై ఇప్పటికీ పండితుల మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి.[66][67] ఋగ్వేదం (10.90)లో వర్ణ వ్యవస్థ గురించి స్పష్టం చేసి ఉన్నప్పటికీ కుల వ్యవస్థ మతంలో విడదీయరాని భాగంగా ఉండనవసరం లేదని కొన్ని చోట్ల సూచనలు ఉన్నాయి.

వేద కాలపు నాగరికతలో తరువాతి కాలంలాగే శూద్రులు వేదాలను వినకూడదనే కట్టుబాట్లు ఏమీ లేవు.[68] వర్ణ వ్యవస్థలో కొన్ని వెసులుబాట్లు ఉండటం మూలాన కొద్ది మంది సామాజిక శాస్త్రవేత్తలు వాదనలు బలంగా లేవు.[69][70]

మహాత్మా గాంధీ, అంబేద్కర్ లాంటి సంఘ సంస్కర్తలు వర్ణ వ్యవస్థను నిరసించారు..[71] ఆధ్యాత్మిక గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస ఈ విషయంపై ఒక శ్లోకం చెప్పాడు.

"భగవంతుని ప్రేమికులు ఏ కులానికీ చెందరు.... ప్రేమ గుణం లేని బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు కాజాలడు. భక్తి ద్వారా అంటరాని వాడు కూడా పరమ పవిత్రుడు కాగలడు."[72]

అహింస, శాకాహారం

హిందువులు సృష్టి లోని సకల జీవజాతులు జీవించడానికి సమాన హక్కు కలిగివున్నాయని భావించడం వలన అహింసను పరమావధిగా భావిస్తారు.[73] ఈ అహింస అనే పదం ఉపనిషత్తు[74] లలో కనిపిస్తుంది. అంతే కాక మహాభారతం[75] లోను, పతంజలి యోగసూత్రాలలో ఈ పదం గూర్చిన ప్రస్తావన ఉంది.[76]

అహింసను పాటించేవారు శాకాహారులై ఉంటారు. మిగతా వారికి శాకాహారం తప్పనిసరి కానప్పటికీ సాత్వికంగా జీవించాలనుకొనే వారికి ముఖ్యమైనది. ఒకానొక అంచనా ప్రకారం భారతదేశంలో 20% శాతం నుంచి 42% వరకు శాకాహారులున్నారు.[77] 30% శాతం మంది మాంసాహారులు కూడా అప్పుడప్పుడే భుజిస్తుంటారు. ఆహారపు అలవాట్లు జాతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి.[78][79] ఉదాహరణకు కొన్ని కులాలలో ఎక్కువ మంది, కొన్ని కులాలలో తక్కువ మంది మాంసాహారులు ఉండవచ్చు. కొందరు హిందువులు ఉల్లిని, వెల్లుల్లిని రజోగుణము కల పదార్ధాలుగా భావించి తినరు. కొద్ది మంది హిందువులు కొన్ని ప్రత్యేక దినములలో మాంసాహారాన్ని ముట్టరు.

మాంసాహరాన్ని స్వీకరించినా చాలావరకు హిందువులు పశు మాంసాన్ని మాత్రం ముట్టరు. హిందువులు పాల కోసం, దుక్కి దున్నడం కోసం,, ఎరువుల కోసం ఆవులు లేదా ఎద్దుల మీద చాలావరకు ఆధార పడతారు. అందువల్లనే హిందువులు ఆవును మాతృసమానంగా,కల్పవృక్షంగా భావించి పూజిస్తారు. భారతదేశం లోని చాలా రాష్ట్రాలలో గోవధ చట్టరీత్యా నేరం.[80]

మతం మారటం

హిందూ మత పురాణాలు మత మార్పిడిని గూర్చి ఏమీ ప్రస్తావించకపోవడం మూలాన ఒక హిందువు మతం మారవచ్చా లేదా అనే విషయంలో భేదాభిప్రాయాలున్నాయి.[81] కానీ హిందూ మతాన్ని ఒక తత్వంగా, లేదా ఒక జీవన విధానంగా భావించేవారు, హిందూ నమ్మకాలను తమ జీవన విధానంలో ఇముడ్చుకున్నవారు ఎవరైనా హిందువులు కాగలరని చెబుతుంటారు.[81] కొద్ది మంది మాత్రం హిందూ మతాన్ని ఒక జాతిగా పరిగణించడం వలన హిందువులకు జన్మించినవారు, భారతదేశంలో జన్మించిన వారే హిందువులు కాగలరని విశ్వసిస్తారు.[82] కానీ భారతదేశపు ఉత్కృష్ట న్యాయస్థానం మాత్రం, జాతి, వారసత్వాలతో ప్రమేయం లేకుండా, హిందూమత విశ్వసాల్ని అవలంబించే ఎవరినైనా హిందువులుగా పరిగణించవచ్చునని తెలుపుతోంది.[83]చాలా సంప్రదాయాల్లో ఆధ్యాత్మిక జీవనం దీక్ష అనే ప్రక్రియతో ప్రారంభమౌతుంది. కానీ హిందూ మతంలోకి మారడానికి ప్రత్యేక పద్ధతులంటూ ఏమీ లేవు. ఏ మతాన్నైనా నిర్మల భక్తితో అవలంబించడం వలన భగవంతునికి చేరువ కాగలరు అనేది హిందూమతం యొక్క ముఖ్య సూత్రం.[84] అందువల్లనే హిందువులు ఇతర మతాల వారిని తమ మతంలో చేరమని బలవంతం చేయరు. అయినప్పటికీ కొన్ని హిందూ మత సంస్థలైన వేదాంత సమాజం, ఇస్కాన్, ఆర్య సమాజ్ మున్నగునవి విదేశాలలో హిందూమత ప్రాశస్థ్యాన్ని గూర్చి ప్రజలకు వివరించి మార్గ నిర్దేశం చేస్తుంటాయి.

ఇవి కూడా చూడండి

మూలాలు

విషయ సూచికలు

కొన్ని ఉపయోగ పుస్తకాలు

బయటిలింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

ఆడియో