మౌలానా వహీదుద్దీన్ ఖాన్
మౌలానా వహీదుద్దీన్ ఖాన్ (ఆంగ్లం : Maulana Wahiduddin Khan), సాధారణంగా ఇతను "ప్రపంచానికి ఇస్లామీయ ఆధ్యాత్మిక దౌత్యవేత్త" అని గుర్తింపబడుతాడు.[1] ఇతడు అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామీయ ఆధ్యాత్మిక గురువుగానూ, ఇస్లాం శాంతివచనాల దౌత్యవేత్తగాను, ప్రపంచశాంతిని కోరే శాంతిదూతగానూ పరిగణింపబడుతాడు.[2] ఇతడి ఉపన్యాసాలు ప్రపంచంలో పలుచోట్ల జరుగుతూనేవుంటాయి. ఉపన్యాసకుడిగా, రచయితగా, విశ్లేషకుడిగా అపార అనుభవము గలదు. అనేకసార్లు, భారతప్రభుత్వమూ ఇతడి సలహాలను కోరుతూ వుంటుంది. 2021 లో భారత ప్రభుత్వం దేశ రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అందజేసింది.[3]
మౌలానా వహీదుద్దీన్ ఖాన్ | |
జననం: | 1 జనవరి 1925 |
---|---|
వృత్తి: | ఇస్లామీయ ఆధ్యాత్మిక నాయకుడు, వక్త, రచయిత |
శైలి: | ఇస్లామీయ సాహిత్యం, |
వెబ్సైటు: | http://www.wkhan.net/ |
అల్ రిసాలా ఉద్యమం
ఇతను "అల్ రిసాలా" అనే పత్రికను స్థాపించి, ఇస్లామీయ ఆధ్యాత్మిక విధానాన్ని, ప్రపంచానికి తెలియజెప్పే కార్యక్రమానికి భుజాన వేసుకున్నాడు.[4]
ఇతని మిషన్
ఇతని మిషన్ "పీస్ మిషన్" లేదా "శాంతి ఉద్యమం" అని పిలువబడుతుంది.
ఇతని దృక్కోణం
మౌలానా వహీదుద్దీన్ ఖాన్ శాంతియుత ప్రపంచాన్ని కోరుకునేవారిలో ఒకడు. ప్రపంచపు నలుమూలలా, ప్రతి ఇంటిలోనూ ఆధ్యాత్మిక శాంతి నెలకొల్పాలనే ఆశయం. అందుకే ప్రపంచమంతటా తిరుగుతూ శాంతిని బోధిస్తూ, ఇస్లామీయ ధార్మిక ప్రచారం చేపట్టాడు.
అందరితో శాంతి
ఇస్లాం ఒక సంపూర్ణ శాంతిమార్గము, ఆధ్యాత్మిక మార్గమనీ ప్రచారం చేయడము, అన్ని మతాలపట్ల సమాన గౌరవాభిమానాలను ప్రకటించడము.“ధనాత్మకమైన ప్రకృతిని పొందాలంటే కేవలం శాంతిద్వారా మాత్రమే పొందగలమని, ఇతని ప్రగాఢ విశ్వాసం. ఈ విషయం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అమలు పరచాలని అభిలషిస్తాడు".
“సమస్యలను మరచిపోండి, అవకాశాలను సద్వినియోగపరచుకోండి.”
బాబ్రీ మస్జిద్ వివాద సందర్భంగా ఇతని వకాల్తా
బాబ్రీమస్జిద్ కూల్చివేత జరిగిన సమయంలో 1992లో మౌలానా, ప్రజలకు శాంతి పిలుపునిచ్చాడు. పరస్పర అవగాహనా సదస్సులలో పాల్గొన్నాడు. శాంతిని నెలకొల్పుటకు 15 రోజుల శాంతియాత్రను చేపట్టాడు.
ఖురాన్ తర్జుమాలు
ఖురాన్ యొక్క తర్జుమా, ఉపన్యాసాల ఆవశ్యకతలను దృష్టిలో వుంచుకొని మౌలానా, ఖురాన్, హదీసు సంకలనాలను ఉర్దూ భాషలో రచించాడు. దీనిని 1983లో "తజ్కిరుల్ ఖురాన్" అనే పేరుతో ముద్రించారు. ఇటీవలి కాలంలో హిందీ, అరబ్బీ భాషలలోనూ ముద్రించారు.
రచనలు
మౌలానా వహీదుద్దీన్ ఖాన్ దాదాపు 200 పుస్తకాలు, గ్రంథాలు రచించాడు. వాటిలో కొన్ని;
- ది ఖురాన్ (ఆంగ్లంలో ఖురాన్ తర్జుమా, కామెంటరీతో సహా)
- గాడ్ అరైజెస్
- ఐడియాలజీ ఆఫ్ పీస్
- ముహమ్మద్: ద ప్రాఫెట్ ఫార్ ఆల్ హ్యుమానిటీ
- మోరల్ విజన్
- సింపుల్ విజ్డం
- ఇంట్రడ్యూసింగ్ ఇస్లాం
- ద కాల్ ఆఫ్ ది ఖురాన్
- ట్రూ జిహాద్
- మ్యాన్ నో దైసెల్ఫ్
- ఇస్లాం రిడిస్కవర్డ్
- యాన్ ఇస్లామిక్ ట్రెజరీ ఆఫ్ వర్చ్యూస్
- ఇస్లాం: క్రియేటర్ ఆఫ్ ది మాడర్న్ ఏజ్
- ఇండియన్ ముస్లిమ్స్: నీడ్ ఫార్ అ పాజిటివ్ ఔట్లుక్
- అల్-ఇస్లాం యతహద్ద
- తజ్కిరుల్ ఖురాన్
- పైగంబర్-ఎ-ఇంకిలాబ్
అవార్డులు, పురస్కారాలు
- డెమిర్గస్ శాంతి అంతర్జాతీయ అవార్డు, సోవియట్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ పేట్రొనేజ్ లో.
- పద్మభూషణ్ పురస్కారం
- జాతీయ సమైక్యతా అవార్డు
- కమ్యూనల్ హార్మొనీ అవార్డు
- ద దివాలిబెన్ మోహన్లాల్ మెహతా అవార్డు. రాష్ట్రపతిచే ప్రదానం చేయబడింది.
- నేషనల్ అమిటీ అవార్డు, భారతప్రధానిచే ప్రదానం చేయబడింది.
- ఢిల్లీ గౌరవ్ అవార్డు, ఢిల్లీ ముఖ్యమంత్రిచే ప్రదానం చేయబడింది.
- FIE ఫౌండేషన్ అవార్డు
- ఉర్దూ అకాడెమీ అవార్డు
- అరుణా అసఫ్ అలీ సద్భావనా అవార్డు
- నేషనల్ సిటిజన్స్ అవార్డు (మదర్ థెరెసా చే ప్రదానం చేయబడినది)
- సీరత్ ఇంటర్నేషనల్ అవార్డు
ఇతరములు
అనేక విశ్వవిద్యాలయ విద్యార్థులు ఇతనిపై పరిశోధనలు చేశారు. ఉదాహరణకు, మదనపల్లె పట్టణానికి చెందిన మొహియుద్దీన్ బాషా, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయపు విద్యార్థి, మౌలానా వహీదుద్దీన్ ఖాన్ యొక్క సాహితీసేవలపై పి.హెచ్.డి. చేశాడు.