చెన్నై
చెన్నై (తమిళం: சென்னை, English: Chennai;), తెలుగులో చెన్నపట్నం, చెన్నపట్నము, చెన్నపట్టణము పేరులు కూడా, భారత దేశములోని తమిళనాడు రాష్ట్ర రాజధాని. ఇది భారత దేశములోని నాలుగవ పెద్ద మహానగరం. చెన్నై నగరం బంగాళాఖాతం తీరాన ఉంది. చెన్నై: మద్రాస్ (Madras). 1953 వరకు ఆంధ్రకు కూడా రాజధాని. మద్రాసు రాజధానిగా వుండే ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచాడు. మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం అన్నాడు శ్రీరాములు. ఈ మహానగరం బంగాళాఖాతం కోరమాండల్ దక్షిణ తీరములో ఉంది. 2007 జనాభా గణాంకాల ప్రకారం చెన్నై నగర జనాభా 70.6 లక్షలు[2] ఉండవచ్చునని అంచనా. ఈ ప్రపంచములోనే 34వ మహానగరమైన చెన్నైకి 375 సంవత్సరాల చరిత్ర ఉంది. భారతదేశములో వాణిజ్య, పరిశ్రమల పరంగా చెన్నై నగరం మూడవ స్థానంలో నిలుస్తుంది. అంతే కాదు ఈ నగరంలో ఉన్న దేవాలయాల నిర్మాణశైలి చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. శాస్త్రీయ సంగీతానికి, శాస్త్రీయ నృత్యానికి చెన్నై నగరం కేంద్రబిందువు. భారతదేశములోని వాహన నిర్మాణ (ఆటో మొబైల్) పరిశ్రమలు అన్నీ చెన్నై నగరంలో కేంద్రీకరించబడి ఉన్నాయి. అన్ని వాహననిర్మాణ పరిశ్రమలు ఉండడం వల్ల ఈ నగరాన్ని డెట్రాయిట్ ఆఫ్ ఆగ్నేయా ఆసియా అని కూడా పిలుస్తారు.[3] ఔట్ సోర్సింగ్ కూడా చాలా మటుకు చెన్నై నగరం నుండి జరుగుతోంది. ఈ నగరం బంగాళా ఖాతం తూర్పుతీరం వెంబడి ఉండడం వల్ల ఈ నగరానికి 12 కి.మీ. బీచ్ రోడ్ ఉన్నది దీనినే మెరీనా బీచ్ అని పిలుస్తారు. ఈ నగరంలో క్రీడల పోటీలు కూడా నిర్వహించడానికి ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధికి చెందిన ఏ.టి.పి. టెన్నిస్ పోటీలు, చెన్నై ఓపెన్ టెన్నీస్ పోటీలు నిర్వహించబడతున్నాయి.[4][5] గిండీ జాతీయ వన్యప్రాణి సంరక్షణాలయం ఈ నగర పొలిమేర్లలోనే ఉంది. వన్యప్రాణీ సంరక్షణాలయాలు మహానగరాల పొలిమేర్లలో ఉండటం ప్రపంచములోనే అరుదు. అమెరికాలో కొలరాడో రాష్ట్రములో ఉన్న డెన్వర్ నగరంలో కూడా వన్యప్రాణీ సంరక్షణాలయం నగర పొలిమేర్లలో ఉండడంవళ్ల చెన్నైని డెన్వర్ తో పోలుస్తారు. చెన్నైని డెన్వర్ కి సోదర నగరంగా చెబుతారు. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.
?చెన్నై తమిళనాడు • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 13°05′N 80°16′E / 13.09°N 80.27°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • నగరం • ఎత్తు | 181.06 కి.మీ² (70 sq mi)[1] • 1,180 కి.మీ² (456 చ.మై) • 6 మీ (20 అడుగులు) |
జిల్లా (లు) | చెన్నై • కాంచీపురం • తిరువల్లువార్ జిల్లా |
జనాభా • జనసాంద్రత • Metro | 43,52,932 (2006 నాటికి) • 24,041/కి.మీ² (62,266/చ.మై) • 70,66,778 (4వ) (2007) |
మేయరు | సైదై దురైసామి |
కమీషనరు | జె.కె.త్రిపాటి |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • UN/LOCODE • వాహనం | • 600 xxx • +91 44 • INMAA • TN-01, 02, 04, 05, 07, 09, 10 |
వెబ్సైటు: www.chennaicorporation.com |
నగరపు పేరు వెనుక కథ
ఆంధ్ర పధ్మనాయక ప్రభువైన వేంకటపతి నాయకుని కుమారుడైన దామెర్ల చెన్నప్ప నాయకుడు ఈ పట్టణాన్ని పాలించేవాడని, నగరానికి ఈ పేరు చెన్నప్ప నాయక నుండి వచ్చిందని చెబుతారు.[6] 1639 సంవత్సరంలో బ్రిటీష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో ఇండియాని ఆక్రమించుకొని వలసస్థావరముగా ఏర్పరచుకొన్నప్పుడు మద్రాసపట్నం అని అది కాలక్రమంలో మద్రాసుగా మార్పు చెందింది. మద్రాసపట్నానికి దక్షిణానికి ఉన్న చిన్న పట్టణం చెన్నపట్టణాన్ని రెండిటినీ కలిపి బ్రిటీష్ వారు మద్రాస్ గా పిలవడం ప్రారంభించారు. కానీ నగరవాసులు మాత్రము చెన్నపట్టణం లేదా చెన్నపురి అని పిలవడానికే ఇష్టపడతారు. 1996 ఆగష్టు మాసంలో నగరం పేరు మద్రాసు నుండి చెన్నైగా మార్చబడింది.[7] మద్రాసు పేరు పోర్చుగీసు వారి నుండి వచ్చిందనే మరో వాదన కూడా ఉంది. మద్రాస్ అనేపేరుకు మూలం పోర్చుగీసుకు చెందినది. (భారతదేశపు అనేక నగరాలకు పేర్లు ఇలానే యేర్పడ్డాయి (పేరు మార్పులు.) పోర్చుగీసు భాష పేరైన "మడ్రె డి డ్యూస్" (Madre de Deus) "మద్రాస్" పేరుకు మూలమని భావిస్తారు. ఈనగరంలోని అతి ప్రాచీన చర్చిని 1516లో నిర్మించారు., ఈ చర్చిని "నోస్సా సెన్హోరా డా లూజ్" (Nossa Senhora da Luz ('Our Lady of Light')) కు, ఫ్రాన్సీయుల మిషనరీకి అంకితమివ్వబడింది. కానీ "చెన్నై" అనే పదం తమిళ పదం కాదు, మద్రాస్ అనే పదము తమిళ పదం వుండవచ్చనే భావన కూడావుంది.[ఆధారం చూపాలి] ఇంకో విశ్వాసం ప్రకారం (దీనిని నిర్ధారణ చేయలేదు) "చెన్నపట్టణం" అనే పేరు, చెన్న కేశవ పెరుమాళ్ దేవాలయం పేరున వచ్చింది.[ఆధారం చూపాలి] ఇంకో సిద్దాంతం ప్రకారం ఈ నగరపు భూమి యజమానియైన "చిన్నప్ప నాయకర్" (తరువాత ఈభూమిని ఈస్ట్ ఇండియా కంపెనీకి అమ్మేసాడు) పేరు మీద 'చెన్నై' అనే పేరొచ్చిందని భావిస్తారు.[ఆధారం చూపాలి]
ఏనుగుల వీరాస్వామి గారి తన కాశీ యాత్ర రచనల ప్రకారం మదరాసు అనే పదం డచ్చి భాష నుండి వచ్చింది. డచ్చి భాషలో మదరాసు అనగా కలప నిలవలు అని అర్థం. డచ్చి వారు తమ వ్యాపార విస్తరణకొరకు ఈ ప్రాంతంలో కలప నిలువలతో కూడిన గిడ్డంగులను ఏర్పాటు చేసుకున్నారు. దాంతో ఆ ప్రాంతాన్ని మదరాసుగా పిలిచేవారని చెప్తారు.
నగర నామ వివరణ
చెన్నపట్టణాన్ని గూర్చి, అందలి భాషలను గూర్చి వీరాస్వామి గారిట్లు తెలిపినారు.
200 ఏండ్ల క్రిందట (అనగా 1831 కి 200 ఏండ్ల పూర్వము) చంద్రగిరిలో బీజానగరపు (విజయనగరపు) సమస్థానాధిపతి యయిన శ్రీరంగరాయడు దొరతనము చేయుచుండగా 'డే' అనే దొర యీ సముద్రతీరమందు ఒక రేవు బందరు కట్టించవలెనని యత్నముచేసి శ్రీరంగరాయుణ్ణి అడిగి వుత్తరువు తీసుకొని యీ ప్రాంతాలకు జమీందారుడైన దామర్ల వెంకటాద్రి నాయడిపేర సన్నదు పుచ్చుకొన్నాడు. ఆ వెంకటాద్రినాయడు డే దొరకు కృత పరిచయుడు కనుక శ్రీరంగరాయడు తన పేరు పెట్టి శ్రీరంగరాయ పట్టణం అని రేవుబందరు కట్టి మాన్నా వెంకటాద్రినాయడు తన తండ్రియైన చెన్నపనాయడి పేరట చెన్నపట్టణమని పేరుపెట్టి కట్టడమేకాక తానే సన్నిధానాథిపతి గనుక అదే నామకరణము ఆరంభములో చేసినందున చెన్నపట్టణం పేరు కలిగినది. తత్పూర్వము ఈ రేవును ఇంగ్లీషువారు మదిరాసు అంటూవచ్చినారు." మద్రాసు రేవులో ఇంగ్లీషువారు గుట్టగా కట్టెలకుప్పను తమ కోట నిర్మాణానికి వేసియుండిరి. అప్పుడు ఆ ప్రాంతమందుండిన డచ్చివారు తమ భాషలో కట్టెకుప్పకు మదారై అందురు. కాన దానిని మదారైస్ అనిరి. అదే మద్రాసు అయ్యెను. (369)
చెన్నపట్టణం అనే పేరు చెన్న అనే పూర్వపదం, పట్టణం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో చెన్న అనే పదం పురుషనామాన్ని సూచిస్తోండగా, పట్టణం అనే పదం జనావాస సూచి. పట్టణం అంటే వ్యాపారకేంద్రం, విశాలమైన ముఖ్యజనావాసం (నగరం వంటిది), సముద్రతీర ప్రాంతం అనే అర్థాలు ఉన్నాయి.[8] చెన్నపట్టణానికి ఈ మూడు అర్థాలూ పొసగుతూండడం విశేషం.
నగర చరిత్ర
చెన్నై పట్టణానికి సా.శ. ఒకటో శతాబ్దం నుండి చరిత్ర ఉంది. ఈ నగరం రాజకీయంగాను, వాణిజ్యపరముగాను, సైనికపరముగాను, అధికార నిర్వహణపరముగాను శతాబ్ధాలనుండి ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశ సామ్రాజ్యాలు పరిపాలించాయి. వీరిలో ముఖ్యముగా పల్లవులు, విజయనగర రాజులు,పాండ్యులు, చోళులు ముఖ్యమైనవారు. ఇప్పుడు చెన్నై నగరంలో ఒక ప్రాంతమైన మైలాపూర్ పల్లవులు రాజ్యము చేస్తున్న సమయములో ఒక నౌకాశ్రయము (ఓడ రేవు). 1522 సంవత్సరములో పోర్చుగీసు వారు ఇక్కడకు వచ్చారు. వారు క్రైస్తవ గురువైన సంత థామస్ పేరు మీద మరో ఓడరేవును నిర్మించుకొని దానికి సెయింట్ టోమ్ అని పేరు పెట్టారు. థామస్ ఇక్కడ 1552-70 మధ్య సంవత్సరాలలో మత ప్రచారం చేసాడు. ఆ తరువాత పోర్చుగీసు వారి ప్రాబల్యం తగ్గింది. 1612లో డచ్ వారి ప్రాబల్యం పెరిగింది. డచ్చివారు డచ్ ఇండియా కంపెనీని చెన్నై నగరానికి ఉత్తరంగా పులికాట్లో ఏర్పాటు చేసుకున్నారు. 1639 ఆగష్టు 22వ తారీఖు (దీనినే ఫ్రానిన్స్ డే అంటారు) బ్రిటీష్ వారు అప్పటి విజయనగర రాజైన పెద వేంకటరాయలు అనుమతితో కోరమాండల్ తీరములో చిన్న భాగాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరాన్ని పెట్టుకోవడానికి, వర్తకం జరుపుకోవడానికి తీసుకొన్నారు. ఈ ప్రదేశం అప్పట్లో వండవాసి పాలకుడు దామెర్ల వేంకటపతి నాయకుని ఆధ్వర్యములో ఉండేది. ఒక ఏడాది పోయాక సెయింట్ జార్జి కోటను బ్రిటీష్ వారు నిర్మించుకొన్నారు. తరువాత కొన్ని రోజులలో ఈ ప్రదేశము అంతా వారి వలసకు కేంద్ర స్థావరము అయ్యింది. 1746 సంవత్సరములో సెయింట్ జార్జి కోటను ఫ్రెంచ్ వారు జనరల్ బెర్టండ్ ఫ్రానిన్స్ మహె డి లా బౌర్డన్నాయిస్ (మారిషస్ గవర్నర్) నేతృత్వంలో ఆక్రమించుకొన్నారు. 1749లో మళ్లీ ఆంగ్లేయులు ఈ ప్రదేశం మీద తమ పెత్తనాన్ని ఐక్స్ లా చాఫెల్ సంధితో సంపాదించుకొన్నారు. ఆధిపత్యాన్ని సంపాదించుకొన్నాక ఫ్రెంచ్ వారి ఆక్రమణల నుండి, మైసూర్ సుల్తాన్ హైదర్ అలీ ఆక్రమణల నుండి రక్షించుకోవడానికి తమ బలగాలను ద్విగుణీకృతము చేసి రక్షణను పటిష్ఠం చేసుకొన్నారు. 18వ శతాబ్దం వచ్చేసరికి ఇప్పటి తమిళనాడులోని చాలా భాగం, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోని కొంత భాగాలతో మద్రాసు ప్రెసిడెన్సీని మద్రాసు (చెన్నై) రాజధానిగా ఏర్పాటు చేసుకొన్నారు. బ్రిటీష్ వారి పరిపాలనలో నగరం వృద్ధి చెందింది, యుద్ధ నౌకాస్థావరముగా కూడా మారింది. బ్రిటిష్ హయామ్ లో, ఈ నగరం పెద్ద నగరప్రాంత కేంద్రంగానూ, ఓడరేవుల మూలంగానూ మారినది. భారతదేశంలో రైల్వేలు ప్రవేశపెట్టబడిన తరువాత, ఇది ముంబై, కోల్కతా నగరాలతో అనుసంధానం చేయబడింది. ఈ అనుసంధాన వలన, మార్గాలు, కమ్యూనికేషన్లు స్థిరపడ్డాయి. ఈ నగరం మద్రాసు స్టేట్ యొక్క రాజధానిగా యేర్పడినది. మద్రాసు రాష్ట్రం పేరును 1969లో తమిళనాడుగా మార్చారు.
నగర రవాణా వ్యవస్థ
చెన్నైని దక్షిణ భారతదేశానికి ముఖ ద్వారంగా పిలుస్తారు. చెన్నై నగరం దేశ నలుమూలలతోనూ, అంతర్జాతీయ స్థానాలకు కలపబడుతోంది. చెన్నై నుండి ఐదు జాతీయ రహదారులు కలకత్తా, బెంగుళూరు, తిరుచిరాపల్లి, తిరువళ్ళూరు, పుదుచ్చేరి.[9] కి బయలు దేరుతాయి. కోయంబేడు లోని చెన్నై మఫిసిల్ బస్ టర్మినస్ (సి.యం.బి.టి.) నుండి తమిళనాడు బస్సు సర్వీసులు, అంతరాష్ట్ర బస్సు సర్వీసులు బయలు దేరుతాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏడు రవాణా సంస్థలు నగరంతో పాటూ, తమిళనాడు రాష్ట్రంలోనూ, అంతర్-రాష్ట్ర బస్సు సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఈ ఏడు సంస్థలు కాకుండా అనేక ప్రైవేటు రవాణా సంస్థలు కూడా ఉన్నాయి.ఈ నగరంలో విస్తారమైన లోకల్ రైలు వ్యవస్థ ఉంది. ఉత్తరాన ఆంధ్రలోని సూళ్ళూరుపేట మొదలు దక్షిణాన చెంగల్పట్టు వఱకును తూరుపున చెన్నై బీచ్ మొదలు పశ్చిమాన అరక్కోణం వఱకు ఈ వ్యవస్థ విస్తరించియున్నది. ముఖ్యముగా చెన్నై బీచ్- తాంబరం నడుమ రైలు సేవల సాంద్రత అత్యధికము. రద్దీ వేళల్లో 4-5 నిముషాలకు ఒక రైలు నడచును. ఈ మార్గములో లోకల్ ఎలెక్ట్రిక్ రైళ్ళు ఆంగ్లేయుల కాలములో ప్రారంభింపబడెను. ప్రస్తుతము కొన్ని సర్వీసులు చెంగల్పట్టు వఱకును కంచి వఱకును నడుపుతున్నాయి.ఈ నగరం లోని మీనంబాకములో విమానాశ్రయము ఉంది. కామరాజర్ దేశీయ టర్మినల్ మఱియు అణ్ణా అంతర్జాతీయ టర్మినల్ అను రెండు టర్మినళ్ళు గలవు. ఊరి మధ్యలోనే విమానాశ్రయము ఉండుట నగరవాసులకును సందర్శకులకును ఎంతో వెసులుబాటుగానుండును.దక్షిణాదిన ఆంగ్లేయులు కాలు మోపిన ఓడరేవు ఇచటనే గలదు.
చెన్నైలో తెలుగు ప్రముఖులు
- ఆరోజుల్లో మదరాసులో అన్ని రంగాలలో ప్రాముఖ్యత వహించిన వారు తెలుగు వారే. వారిలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన వారు ముగ్గురు తెలుగువారే. వారు సింగరాజు సుబ్బారాయుడు, కావలి వేంకట పతి, జయంతి కామేశం . 1925-29 మద్య కాలంలో శ్రీకాళహస్తి జమీందారు పానగల్ రాజా సర్ పానగంటి రామారాయనం, జస్టిస్ పార్టీ అధ్యక్షులుగాను తరువాత మద్రాసు ముఖ్య మంత్రి గాను ఉన్నారు. వారి హయాంలోనే త్యాగరాయనగర్ రూపు దిద్దుకున్నది. అక్కడ మామిడితోటలు విస్తారంగా వుండేవి. అందుకే త్యాగరాయనగర్కు మాంబళం అని పేరు. మాంబళం అనగా మామిడి పండు అని అర్థం. రాజావారు త్యాగరాయ నగర్లో ఒక పార్కుకు స్థలాన్నిచ్చారు. ఆ పార్కు పేరు పానగల్ పార్క్. ఈ పార్కులో రాజా వారి విగ్రహం ఈనాటికి ఉంది. 1932-36 మధ్యకాలంలో బొబ్బిలి రాజా వారు శ్రీ రాజారావు రామకృష్ణ రంగారావు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా ఉన్నారు. ఆతర్వాత రావు బహద్దర్ కూర్మా వెంకట రెడ్డి మద్రాసు గవర్నర్ గా వుండే వారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే ముందు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వుండేవారు.
- గురజాడ కృష్ణదాసు వెంకటేష్
- 1830 దశకంలో తన కాశీయాత్రపై తొలి తెలుగు ట్రావెలాగ్ కాశీయాత్ర చరిత్ర రచించిన ఏనుగుల వీరాస్వామయ్య చెన్నపట్టణంలో ఆనాడు ఈస్టిండియా సుప్రీంకోర్టులో ఉన్నతోద్యోగిగా పనిచేసేవాడు. వందమంది పరిజనంతో 14 నెలల పాటు చేసిన ఈ యాత్ర వివరాలను రాసిన గ్రంథం ఆనాటి సామాజిక చరిత్రకు గొప్ప సాక్ష్యం.[10]
- సుమలత
- మీనా
- మానవల్లి రామకృష్ణ కవి
- సుశీల దీదీ
విద్యాసంస్థలు
ప్రాథమిక, మాధ్యమిక విద్య
చెన్నై నగరంలో తమిళనాడు ప్రభుత్వంచే నడపబడే పాఠశాలు, ప్రైవేటు పాఠశాలలు, ఉమ్మడిగా (ప్రభుత్వ ప్రైవేటు రంగం ఉమ్మడి నిధులతో) నడిచే పాఠశాలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలో బోధనా మాధ్యమం ఆంగ్లము, ప్రభుత్వ రంగ పాఠశాలలో బోధనా మాధ్యమము ఆంగ్లము కానీ, తమిళం గానీ ఉండవచ్చు.ఇచట తెలుగు మాధ్యమ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఉన్నత విద్యలకు అవకాశం ఉన్నందున తమిళనాడు ప్రజలు ఆంగ్ల మాధ్యమాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. ప్రైవేటు రంగ పాఠశాలలు తమిళనాడు సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుతో అనుసంధానమై ఉంటాయి. కొన్ని పాఠశాలలో సి.బి.యస్.సి. లేదా ఐ.సి.యస్.సి. లేదా ఆంగ్లో-ఇండియన్ బోర్డు (మాంటిస్సెరీ పద్ధతి) కి అనుసంధానంగా పాఠ్యాంశాల బోధన ఉంటుంది. కొన్ని విద్యాలయాలు అంతర్జాతీయ బాక్యులరేటు లేదా అమెరికన్ విద్యా పద్ధతులను కూడా అనుసరిస్తున్నాయి. పాఠశాల విద్య 3వ ఏట కిండర్ గార్టెన్తో ప్రారంభం అవుతుంది. రెండు ఏళ్ళ తరువాత ఒకటి నుండి పన్నెండు తరగతుల వరకు పాఠశాలలో విద్య నడుస్తుంది. పన్నెండో తరగతి పూర్తి చేసిన తరువాత ఉన్నత విద్య కోసం వృత్తి విద్యల వైపు కానీ అకాడెమిక్ రంగాల వైపు గాని ఎన్నుకోవచ్చు.
ఉన్నత విద్య
1857 సంవత్సరములో ఏర్పాటు చేయబడిన మద్రాసు విశ్వవిద్యాలయానికి మూడు క్యాంపసులు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయములో అనేక విభాగాలలో (విజ్ఞాన శాస్త్రము, వాణిజ్య శాస్త్రము, వివిధ కళలు, వైద్య శాస్త్రం, న్యాయ శాస్త్రం మొదలైనవి) ఉన్నత విద్యలు అభ్యసించే అవకాశము ఉంది. నగరంలో ఉన్న అనేక కళాశాలలు ఈ విశ్వవిద్యాలయముతో అనుసంధానము చేయబడి ఉన్నాయి. మద్రాసు విశ్వవిద్యాలయము కంటే పురాతనమైన విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. 1835లో స్థాపించబడిన మద్రాసు మెడికల్ కాలేజి, 1837లో స్థాపించబడిన మద్రాసు క్రిస్టియన్ కళాశల, 1840లో స్థాపించబడిన ప్రెసిడెన్సీ కళాశాల, 1842 స్థాపించబడిన పచ్చయప్ప కళాశాల మెదలైనవి కొన్ని ఉదాహరణలు. 1938లో స్థాపించబడిన స్టాన్లీ మెడికల్ కాలేజి, 1946లో ప్రారంభించబడిన వివేకానంద కాలేజి 1951లో మెదలు పెట్టిన న్యూ కాలేజి, చెన్నై, శకుంతల అమ్మాళ్ కళాశాల మరికొన్ని విద్యాసంస్థలకు ఉదాహరణలు. ఈ విద్యాసంస్థలు మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుసంధానించబడి పనిచేస్తాయి. ఇవి కాకుండా స్వతంత్ర ప్రతిపత్తిని కలిగిన విద్యాసంస్థలలో ముఖ్యమైనవిక్వీన్ మేరి కాలేజి (1914), ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజి (1915), లయోలా కాలేజి (చెన్నై) (1925), స్టెల్లా మేరీస్ కాలేజి, (1947) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజి (1995), ఏషియన్ కాలేజి ఆఫ్ జర్నలిజం (2000), మద్రాసు స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ (1952). భారతదేశములో సాంకేతిక విద్యకు ప్రసిద్ధి చెందిన ఐ.ఐ.టి. మద్రాసు నగరానికి దక్షిణ భాగంలో అంతర్జాతీయా ఖ్యాతి గాంచిన ఈ ఐ.ఐ.టి. 1959లో స్థాపించబడింది. ఈ ఐ.ఐ.టి. ప్రక్కగా అన్నా విశ్వవిద్యాలయం (1978) ప్రధాన ప్రాసాదం ఉంది. గుండి కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్ (1794), మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి (1949) అలగప్ప కాలేజి అఫ్ టెక్నాలజి (1944) స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ (1957) విలీనం చేయగా ఏర్పడింది అన్న విశ్వవిద్యాలయం. తమిళనాడులోని ఇంజనీరింగ్ కళాశాలలన్నీ అన్నా విశ్వవిద్యాలయానికి అనుసంధించబడి ఉంటాయి. మిగిలిన ఇంజనీరింగ్ కళాశాలల పట్టాలు స్వతంత్ర ప్రతిపత్తి కలవై ఉంటాయి.1891 సంవత్సరములో స్థాపించబడిన డా. అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాల చెన్నైలోని ప్రాచీన న్యాయశాస్త్ర కళాశాల. 1835వ సంవత్సరంలో స్థాపించిన మద్రాసు కళాశాల భారత ఉపఖండంలోనే పురాతన కాళాశాల.[11] నగరంలో ఉన్న మరికొన్ని వైద్యకళాశాలల్లో స్టాన్లీ వైద్య కళాశాల, కిల్పాక్ వైద్యకళాశాల, శ్రీ రామచంద్రా వైద్యకళాశాల మెడికల్ కాలేజిలు. 1903లో స్థాపించిన మద్రాసు వెటరినరీ కాలేజి దేశంలోనే మొదటి పశువైద్యకళాశాల.1890 సంవత్సరములో స్థాపించిన కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ భారతదేశంలోని నాలుగు జాతీయ సంగ్రహలయ కేంద్రము (నేషనల్ డిపాజిటరి సెంటర్ల)లలో ఒకటి. ఈ సంగ్రహలాయములో దేశంలో వెలువడే పత్రికలు, ప్రచురితమైన పుస్తకల ప్రతులు ఉంటాయి. యునెస్కో ఈ సంగ్రహాలయానికి ఒక స్థాయ గుర్తింపుని ఇచ్చింది. నగరంలో ఉన్న మరో ముఖ్య గ్రంథాలయం సెయింట్ జార్జి ఫోర్టులోని భారత పురావస్తు శాఖ వారి గ్రంథాలయం, రామకృష్ణ మఠంలోని గ్రంథాలయం, జిడ్డు కృష్ణమూర్తి పౌండేషన్ లైబ్రరీ. అడయార్లోని థియోలాజికల్ లైబ్రరీ.
క్రీడలు
క్రికెట్టు
భారతదేశంలో క్రికెట్టు చెన్నై నగరంలో కూడా చాలా ప్రసిద్ధ క్రీడ. భారతదేశం లోనే అత్యంత ప్రాచీనమైన క్రికెట్టు స్టేడియాలలో మద్రాసు చేపాక్ స్టేడియం ఒకటి. ఈ క్రీడ ప్రాంగణాన్ని 1916 సంవత్సరంలో మద్రాసు క్రికెట్టు గ్రౌండు లేదా చేపాక్ క్రీడాప్రాంగణం అనే పేరుతో నిర్మించారు. చేపాక్ స్టేడియం పేరు ఇప్పుడు ఎమ్. ఎ. చిదంబరం స్టేడియంగా మార్చబడింది. ఇది తమిళనాడు రాష్ట్ర క్రికెట్టు అసోసియేషన్కు పుట్టినిల్లు. ఈ స్టేడియంలో 50,000 మంది ప్రేక్షకులు ఆటను వీక్షించే అవకాశం ఉంది. ఈ క్రీడాప్రాంగణంలో 1951-52 భారతదేశ మెదటి టెస్టు మ్యాచ్ విజయం (ఇంగ్లాండు తో), 1986 ఇండియా ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ టై (ప్రపంచ రికార్డులలో రెండే టెస్టు టై మ్యాచ్ లు నమోదయ్యాయి) తో సహా, అనేక రికార్డులు ఈ క్రీడాప్రాంగణంలో నెలకొల్ప బడ్డాయి. చేపాక్ క్రీడాప్రాంగణములోని ప్రేక్షకుల క్రీడా స్ఫూర్తి అనిర్వచనీయము. దానికి ఒక ఉదాహరణగా 1997లో భారదేశానికి పాకిస్తానుకి మధ్య జరిగిన ఇండిపెండెన్స్ కప్పులో సయీద్ అన్వర్ 194 పరుగులు కొట్టగా ప్రేక్షకులు అందరూ నిలబడి చప్పట్లు చరిచిన సంఘటన చెప్పవచ్చు. ఐ.ఐ.టి. మద్రాసు క్యాంపసులో ఉన్న చెంప్లాస్ట్ క్రికెట్టు స్టేడియం నగరంలో ఉన్న ఇంకో ముఖ్య క్రీడాప్రాంగణం.
టెన్నీస్
చెన్నై నగరంలో క్రికెట్టు తరువాత క్రీడ టెన్నిస్. నుంగంబాకంలో ఉన్న యస్.డి.ఏ.టి స్టేడియంలో 6000 మంది ప్రేక్షకులు టెన్నీస్ వీక్షించడానికి అవకాశం ఉంది. ఈ స్టేడియంలో కృత్రిమ నేలపై నిర్మించబడ్డ ఐదు టెన్నీస్ కోర్టులు ఉన్నాయి. ఈ క్రీడాప్రాంగణంలో ఏ.టి.పి టెన్నీస్ పోటీలు, చెన్నై ఓపెన్ పోటీలకు ఈ స్టేడియం ఒక వేదిక. ఈ క్రీడాప్రాంగణానికి ఉత్తమ నూతన ఏ టి పి టెన్నీస్ పోటికి వేదికగా నిలిచింది. భారతీయ టెన్నీస్ క్రీడాకారులలో ప్రముఖులైన విజయ అమృతరాజ్, రామనాథన్ కృష్ణన్, రమేష్ కృష్ణన్, మహేష్ భూపతి చెన్నై అందించిన క్రీడాకారులు. టెన్నీస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ విద్యాభ్యాసం, టెన్నీస్ తర్ఫీదు చెన్నై నగరంలోనే పొందాడు.
హాకీ
నాలుగు వేల ప్రేక్షకులు వీక్షించే సామర్ధ్యమున్న మేయర్ రాధాకృష్ణన్ క్రీడాప్రాంగణం హాకీ క్రీడకు ముఖ్య వేదిక. చెన్నై వీరన్స్ అనే జట్టు ప్రీమియర్ హాకీ ఆట జట్టు. ఈ క్రీడాప్రాంగణం ఛాంపియన్స్ ట్రోఫీ (ప్రపంచములో 6 ఉత్తమ జట్లు ఆడే పోటి)కి వేదికగా రెండు సార్లు నిలిచింది. చివరిసారిగా 2005లో జరిగింది.
సాకర్, మిగతా క్రీడలు
నలభై వేలమంది ప్రేక్షకులు వీక్షించగల సామర్ధ్యమున్న జవహర్ లాల్ నెహ్రూ క్రీడాప్రాంగణం సాకర్ (ఫుట్ బాల్ ఆటకు) అథ్లెటిక్స్ పోటీలకుకు ముఖ్య వేదిక. ఈ క్రీడాప్రాంగణంలోనే 8000 వేల మంది ఆటలు చూడడానికి వీలుగా ఇండోర్ స్టేడియం ఉంది. ఈ జవహర్ లాల్ నెహ్రూ క్రీడాప్రాంగణం ఉన్న సముదాయంలోని ఇండోర్ స్టేడియం వాలీ బాల్, బాస్కెట్ బాల్ టేబుల్ టెన్నీస్ వంటి వివిధ పోటీలు నిర్వహించడానికి వేదిక. నాలుగు వేలమంది వీక్షీంచడానికి వీలుగా ఉన్న 'వేలచ్చేరి జల క్రీడల సముదాయము అనేక జలక్రీడలకు వేదిక. మద్రాసు నగరం 1995లో దక్షిణ ఆసియా ఫెడరేషన్ పోటీలకు వేదికగా నిలిచింది.
1777లో గుఱ్ఱపు పందాలు జరగడానికి వీలుగా గుండిలో గుండి రేస్ కోర్స్ని నిర్మించాడు. శ్రీపెరంబూరులో మోటారు రేసింగ్ పోటీలు నిర్వహించడుతున్నాయి. కారు రేసింగ్, ద్విచక్ర వాహన రేసింగ్ కి వీలుగా షోళావరంలో ఉంది. 1867 సంవత్సరములో మద్రాసు బోట్ క్లబ్ బేసిన్ బ్రిడ్జిలో ప్రారంభమైంది. ఈ బోటు ఆటలపోటీలకు వేదిక. నగరంలో 18 గుంటలతో కూడిన గోల్ఫ్ క్లబ్బులు కూడా ఉన్నాయి. ఒకటి కాస్మోపాలిటన్ క్లబ్, మరొకటి జింఖానా క్లబ్. ఈ రెండు కూడా 19వ శతాబ్దం చివరి భాగములో నిర్మించబడ్డాయి. 2005 సంవత్సరములో కామన్ వెల్త్ ఫెన్సింగ్ పోటీలు కూడా ఈ నగరంలో జరిగాయి.
పాఠశాలలు
- పద్మాశేషాద్రి, బెయిన్స్, కోలా సరస్వతి, మహర్షి విద్యా మందిర్, భారత్ విద్యా మందిర్.
- అణ్ణమలై చెట్టియార్ విద్యా సంస్థ వారి చేత నడపబడుతున్న ఎ స్కూల్స్, వళ్ళియమ్మాళ్ స్కూల్స్,
- ఆర్ బి సి తెలుగు మాద్యమంలో పాఠాలు బోధించబడే పాఠశాల. ఇది పెరంబూర్ లోకో వర్క్స్ లో ఉన్న పాఠశాల.
కళాశాలలు-విశ్వవిద్యాలయాలు
- ఐఐటి
- మద్రాస్ యూనివర్శిటీ
- ఎస్ఆరెమ్
- అణ్ణాయూనివర్శిటీ
- కాగితేమిల్లత్
- ప్రెసిడెన్సీ (పురుషులు)
- పచ్చిపాస్ కాలేజ్
- త్యాగరాజ్ కాలేజ్
- లయోలా కాలేజ్
- ఎతిరాజ్ కాలేజ్ (స్త్రీలు)
- క్వీన్మేరీస్ (స్త్రీలు)
- స్టాన్లీ వైద్య కళాశాల
- ఎమ్జీఆర్ వైద్య కళాశాల
- హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్
చూడవలసిన ప్రదేశాలు
- మెరీనా బీచ్
- గాంధీ బీచ్
- బేసంట్ నగర్ బీచ్
- వళ్ళువర్ కోట్టమ్
- అణ్ణాసమాధి
- ఎమ్జీఆర్ సమాధి
- రాజాజీ నినైవు ఇల్లమ్
- గాంధి నినైవు ఇల్లమ్
- ప్లానిటోరియమ్ (అడయార్)
- వండలూర్ జంతు ప్రదర్శనశాల
ప్రసిద్ధ ఆలయాలు
- మైలాపూర్ కపాలీశ్వర ఆలయం
- వడపళని సుబహ్మణ్యేశ్వరాలయం
- తిరువళ్ళికేణి పార్ధసారథి ఆలయం
- కన్యకా పరమేశ్వరీ ఆలయం
- అష్టలక్ష్మి దేవాలయం
- శ్రీ వెంకటేశ్వర ఆలయం
- మందవేలి ఆలయం
- నంగనల్లూర్ ఆంజనేయస్వామి దేవాలయం.
- తిరువాన్మియూరు ఔషధీశ్వరాలయం (మరుందీశ్వరాలయం)
విహార కేంద్రాలు
- ఎమ్జిఎమ్
- విజిపి
- మాయాజాల్
- క్వీన్ లాండ్
- మహాబలిపురం
- వండలూర్ జూ
సూపర్ మార్కెట్లు
- సిటీసెంటర్ (రాధాకృష్ణన్ శాలై)
- అంపా స్కైవాక్ (ఆమింజికరై)
- బిగ్ బజర్ (పాండీ బజార్), (వడ పళని)
- అభిరామి మాల్ (పురసైవాక్కమ్)
చైన్ షాపులు
- స్పెన్సర్
- మోర్
- బిగ్ బజార్
- మెట్రో
- రిలయన్స్ ఫ్రెష్
- హెరిటేజ్
- పళముదిర్ చోలై
- నీలగిరీస్
చైన్ హోటళ్ళు
- శరవణ భవన్.
- వసంత భవన్.
- ఆరాం బుహారీస్
- మేరీ బ్రౌన్
- మెక్ దొనాల్డ్
- మిల్కీ వే
- మెక్ డీనాల్డ్
- పీజా హట్
- పీజా కార్నర్
- డామినోస్
- రెయిన్ ట్రీ హోటల్, అన్నాసాలై
- వెస్టిన్ చెన్నై
చైన్ మిఠాయి దుకాణాలు
- నందినీ స్వీట్స్
- ఆనందభవన్ స్వీట్స్
- అర్చనా స్వీస్
- శ్రీకృష్ణా స్వీట్స్
ఇవికూడా చూడండి
మూలాలు
వెలుపలిలంకెలు
- ఈనాడు. ఆదివారం. 17.8.2014
- కె. ఎన్. కేసరి. " ఆనాటి చెన్నపట్నం". చిన్ననాటి ముచ్చట్లు. వికీసోర్స్.