గ్రంథాలయం
అత్యంత ప్రాచీన గ్రంథాలయం
అత్యంత ప్రాచీనమైన గ్రంథాలయాల్లో అసుర్బనిపాల్ గ్రంథాలయం ముఖ్యమైంది. క్రీ.పూ.668-627ల మధ్యకాలంలో అస్సీరియన్ (Assyrian) సామ్రాజ్యాన్ని ఏలిన అసుర్బనిపాల్ ఈ గ్రంథాలయాన్ని నిర్మించారు. అసుర్బనిపాల్ కాలంలో అతని సామ్రాజ్యం గొప్ప వైభవంతో విలసిల్లింది. విజ్ఞాన సముపార్జన, సంరక్షణ కోసం తన సామ్రాజ్యంలోని నినెవ్ అనే ప్రాంతం (నేటి ఉత్తర ఇరాక్) లో గ్రంథాలయం నిర్మించారు. చిత్రలిపిలో రాయబడే మట్టిపలకల రూపంలో గ్రంథాలు ఉండేవి. మతం, రాజ్యపరిపాలన, విజ్ఞానం, కవిత్వం, వైద్యం, పౌరాణికగాథలు వంటివి ఆయా గ్రంథాల్లో రచించారు. అటువంటి వేలాది మట్టిపలకల గ్రంథాలను ఈ గ్రంథాలయంలో భద్రపరిచారు. ఈ గ్రంథాల్లో నాల్గు వేలయేళ్ల పూర్వపుదైన గిల్గమేష్ అనే సుమేరియన్ ఇతిహాస ప్రతి కూడా ఉంది. అసుర్బనిపాల్ రాజ్యానంతరం కొన్ని శతాబ్దాల తరబడి నిలిచిన ఈ గ్రంథాలయం కాలక్రమంలో వేలయేళ్ల తరువాత శిథిలమైపోయింది.
జాతీయ గ్రంథాలయాలు
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జాతీయ గ్రంథాలయం[1] కోల్కతాలో ఉంది. దీనిని 1860 లో స్థాపించారు. 17, 18 వ శతాబ్దాలలో ప్రచురించిన పుస్తకాలు దీనిలో ఉన్నాయి. 24 లక్షలకు పైగా పుస్తకాలు (2010 నాటికి) ఉన్నాయి. వీటిని డిజిటల్ రూపంలోకి మార్చి అందరికి అందుబాటులో వుంచే పని జరుగుతున్నది. అలాగే భారత డిజిటల్ లైబ్రరీ [2] కూడా, వివిధ పుస్తకాలను కంప్యూటర్ లో భద్రపరచి అందరికి అందుబాటులోకి తెస్తుంది. కొన్ని నకలుహక్కుల వివాదం తరువాత ఇది మూతబడింది. అయితే దీనిలోని పుస్తకాలు ఆర్కీవ్.ఆర్గ్ లో చేర్చబడ్డాయి.[3]
ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయాలు
చరిత్ర
ఆధునిక పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటైన తొలి గ్రంథాలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేశారని పరిశోధకులు భావిస్తున్నారు. 1886లో విశాఖపట్నంలో మంతిన సూర్యనారాయణమూర్తి ఈ పౌరగ్రంథాలయాన్ని నెలకొల్పారు. ఆంగ్లభాషా సంస్కృతుల ప్రభావం, ఇతర దేశాల్లోని గ్రంథాలయాల గురించిన సమాచారం ఆంధ్రప్రజలకు లేకపోయినా సొంత ప్రేరణపై ఆయన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఇలా ఆసక్తి, ఉత్సాహంతో ఆంధ్రదేశమంతటా (బళ్ళారితో కలుపుకుని) 1905 నాటికి 20 గ్రంథాలయాలు స్థాపించబడినట్టు లెక్కకువచ్చాయి. పలు ఉద్యమాలు, సాహిత్య సృష్టి వంటి కారణాలతో 1913 నాటికి వీటి సంఖ్య 123కు పెరిగింది. ఆపైన గ్రంథాలయోద్యమం ప్రారంభమై ఇతర ఉద్యమాలకు చేయూతనివ్వడమే కాక పలు రంగాల్లో తెలుగువారి చైతన్యానికి చేయూతనిచ్చింది.[4]
ప్రస్తుత స్థితి
అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ [5] 7 ప్రాంతీయ, 23 జిల్లా కేంద్ర, 1449 మండల, 357 గ్రామ, 1396 పుస్తక జమ కేంద్రం (Book Deposit Centers (BDC) ) గ్రంథాలయాలను నిర్వహిస్తున్నది. భారత డిజిటల్ లైబ్రరీ[6] ప్రాజెక్టులో భాగంగా, రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, నగర కేంద్ర గ్రంథాలయం లోని ఎంపిక చేసిన పుస్తకాలను స్కానింగు చేసి భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా అందజేస్తున్నారు. 2010 ఏప్రిల్ నాటికి 14343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.
తెలంగాణాలో గ్రంథాలయాలు
హైదరాబాదులో తొలి గ్రంథాలయాన్ని 1872లో సోమసుందర మొదలియార్ సికింద్రాబాద్లో ఏర్పాటు చేశారు.[7]
అంతర్జాల గ్రంథాలయం
అంతర్జాల వ్యాప్తి తరువాత, గ్రంథాలయంలోని పుస్తకాలను డిజిటైజ్ చేసి, ఎక్కడినుండైనా చదవాటానికి వీలుగా వెబ్సైట్ల ద్వారా అందచేస్తున్నారు. వీటిలో తెలుగు గ్రంథాలున్న ప్రముఖమైనవి.