ప్రపంచ ఆర్థిక వేదిక
ప్రపంచ ఆర్థిక వేదిక (ఆంగ్లం: World Economic Forum) అనేది స్విట్జర్లాండ్లోని జెనీవా ఖండంలోని కొలోనీలో ఉన్న అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ. దీనిని 1971 జనవరి 24న జర్మన్ ఇంజనీర్, ఆర్థికవేత్త క్లాస్ స్క్వాబ్ (Klaus Schwab) స్థాపించారు.[1] వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లక్ష్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, దీనికై వ్యాపార, రాజకీయ, విద్యావేత్తలతో పాటు సమాజంలోని ఇతర నాయకులతో ప్రతీయేటా సదస్సులు నిర్వహించి ప్రపంచ, ప్రాంతీయ, పరిశ్రమల ఎజెండాలను రూపొందిస్తారు.
సభ్యత్వం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠ పరచాలనే ఆశయంతో ఏర్పడిన వేదికలో ఆర్థిక వృద్ధి - సంస్కరణలు, అందరికీ సంపద, ఆహార భద్రత, పేదరిక నిర్మూలన, సమ సమాజ స్థాపన అనే లక్ష్యాలను ఏమేర సాధించామో సమీక్షించేందుకు వివిధ దేశాల అధినేతలు, ఆర్థిక వేత్తలు ప్రతీయేటా సమావేశమవుతుంటారు. ఫౌండేషన్ దాని 1,000 సభ్య సంస్థలచే నిధులు సమకూరుస్తుంది. సాధారణంగా ఐదు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ టర్నోవర్ (పరిశ్రమ, ప్రాంతాల వారీగా మారుతుంది) ఉన్న గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వీటికి ఫోరమ్ కార్యకలాపాలలో పాలుపంచుకునే దాన్ని బట్టి సభ్యత్వ రుసుములు వర్గీకరించబడుతాయి.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు - 2022
2022 మే 22 నుంచి 26 వరకు ఐదురోజులపాటు జరగిన్న ఈ సదస్సు స్విట్జర్లాండులోని దావోస్ నగరం వేదిక.
ఆంధ్రప్రదేశ్
ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరయిన ప్రతినిధి బృందానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా నేతృత్వం వహించారు.[2] ఆయనవెంట ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారులు దావోస్ వెళ్ళారు.
దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాష్ట్ర స్థాయి సమావేశాలలో పాల్గొన్నారు. మే 23న వైద్యరంగంపై కీలక సమావేశం, 24న విద్య, నైపుణ్య రంగాలపై అత్యున్నత స్థాయి సమావేశం, 25న డీసెంట్రలైజ్డ్ సమావేశాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఐటి ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. మూడు రోజులపాటు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రముఖులతో సమావేశమై తెలంగాణలో జరిగిన అభివృద్ధి, జీడీపీలో రాష్ట్ర వాటా పెరుగుదల తదితర అంశాల గురించి తెలియజేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు తెలంగాణలో తమ కార్యాలయాలను ఏర్పాటుచేయడం, పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో ఉన్న సానుకూలతల గురించి వివిధ కంపెనీల అధిపతులకు, ఆయా దేశాలకు చెందిన ప్రభుత్వ ప్రముఖులకు కేటీఆర్ వివరించారు. తద్వారా ప్రపంచ ఆర్థిక వేదిక 2022లో తెలంగాణ రాష్ట్రానికి 4,200 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి.[3][4][5]
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు - 2023
2023 జనవరి 16 నుండి 20 వరకు ఈ సదస్సు జరిగింది.
తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్ర ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఐటి ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఆటోమోటివ్ విభాగం డైరెక్టర్ గోపాల్ కృష్ణన్, డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. 4 రోజులలో 52 వ్యాపార సమావేశాలు, 6 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ చర్చలలో పాల్గొన్న తెలంగాణ ఐటిశాఖ బృందం తెలంగాణ రాష్ట్రానికి 21,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూర్చింది.[6][7][8]