ఆరూరి రమేష్
అరూరి రమేష్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం మాజీ శాసన సభ్యుడిగా ఉన్నాడు.[2][3]
అరూరి రమేష్ | |||
మాజీ శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 2014 - 2018, 2018 - 2023 డిసెంబర్ 3 | |||
ముందు | కొండేటి శ్రీధర్ | ||
---|---|---|---|
తరువాత | కే.ఆర్. నాగరాజు | ||
నియోజకవర్గం | వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | 4 ఏప్రిల్ 1967 ఉప్పుగల్, జాఫర్ గడ్, జనగామ జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | గట్టుమల్లు, వెంకటమ్మ | ||
జీవిత భాగస్వామి | కవితా కుమారి | ||
సంతానం | కుమారుడు (విశాల్),కుమార్తె (అక్షిత). | ||
వెబ్సైటు | arooriramesh.com |
జననం
ఆరూరి రమేష్ 1967, ఏప్రిల్ 4న గట్టుమల్లు, వెంకటమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, జాఫర్ గడ్ మండలంలోని, ఉప్పుగల్ గ్రామంలో జన్మించాడు.[4] 1995, ఏప్రిల్ లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో ఎంఏ పూర్తిచేశాడు.[5] ఆ తరువాత ఎల్.ఎల్.బి. కూడా చదివాడు.
వ్యక్తిగత జీవితం
రమేష్ కు కవితా కుమారితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
రాజకీయ విశేషాలు
అరూరి రమేష్ 2009లో ప్రజా రాజ్యం పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ఆ పార్టీ తరపున ఘన్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[6] 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ పై 86,349 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2015, జనవరి 10 నుండి 2018, సెప్టెంబరు 6 వరకు తెలంగాణ లెజిస్లేచర్ కో -ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలలో అక్రమాలపై హౌస్ కమిటీ ఛైర్మన్ గా పనిచేశాడు.[7] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యపై 99,240 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[8][9] ఆరూరి రమేష్ 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[10]
ఆరూరి రమేష్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి వర్ధన్నపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో 19,458 ఓట్ల తేడాతో ఓడిపోయిన అనంతరం ఆయన 2024 మార్చి 16న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు.[11][12] ఆయన 2024 మార్చి 17న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[13][14]