నులిపురుగులు
నులి పురుగులనేవి పేగుల నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవులు. ఈ వ్యాధి కారకాన్ని అస్కారియాసిస్ (ascariasis) అంటారు , ఇవి పేగుల్లో నుంచి పోషకాలను గ్రహించి అభివృద్ధి చెందే పరాన్న జీవుల ఇవి నెలల్లో గుడ్లు, లార్వాలుగా వృద్ది చెందుతాయి.[1] వీటి ద్వారా శరీరంలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, కడుపునొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. నులిపురుగుల నిర్మూలనతో రక్తహీనత నియంత్రణ, పోషకాల గ్రాహ్యత ను మెరుగుపర్చే ప్రయోజనాలు కలుగజేస్తుంది. ప్రధానంగా అపరిశుభ్రత వల్ల నులి పురుగులు వ్యాపిస్తాయి.[2]ప్రపంచవ్యాప్తంగా, సుమారు 0.8 నుండి 1.2 బిలియన్ ప్రజలు అస్కారియాసిస్తో బాధపడుతున్నారు
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
2015 నుండి ప్రతి సంవత్సరం జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం (ఎన్డిడి) నిర్వహిస్తున్నారు. దీనిని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అమలు చేస్తోంది. సంవత్సరంలో రెండుసార్లు ఫిబ్రవరి 10, ఆగస్టు 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని[3] పాఠశాలలు,అంగన్వాడీలలో ఒక రోజుకార్యక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ఆల్బెండజోల్ టాబ్లెట్ను నులిపురుగుల నివారణకు పిల్లలు,కౌమారదశలోని వారికి సామూహిక మందుల పంపిణీ కార్యక్రమం కింద అందజేయడం జరుగుతుంది. అంతర్జాతీయంగా ఈకార్యక్రమం చేపట్టడం జరుగుతోంది[4].కోవిడ్ మహమ్మారి కారణంగా, ఈ కార్యక్రమాన్ని కొనసాగించడంలో భాగంగా ఈ మార్పులు తీసుకువచ్చి, నులిపురుగుల నివారణ కృషిని కొనసాగించడం జరుగుతోంది.
రకాలు
ఇవి సాధారణంగా మూడు రకాలు: ఏలిక పాములు, నులిపురుగులు, కొంకి పురుగులు. వీటి గుడ్లు మట్టిలో 10 సంవత్సరాలకు పైగా ఉంటాయి. ఇవి 55 అడుగుల వరకు పెరుగుతాయి.[5]
నివారణ
అస్కారిస్ గుడ్లతో కలుషితమైన ఆహారాలు లేదా పానీయాలను తీసుకోవడం వల్ల సంక్రమణ సంభవిస్తుంది ,వీటిని నిర్మూలించేందుకు అల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి. 1 నుంచి 2 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలు 400ఎంజీలో సగం 200 ఎంజీ మాత్రను వేసుకోవాలి. మిగతా వారు 400 ఎంజీ మాత్రను వేసుకోవాలి. మాత్రను బాగా నమలాలి. భోజనం తర్వాత వేసుకోవచ్చు. మాత్రలు వేసుకున్న ఒకో రోజు లేదా రెండు రోజుల్లో నులిపురుగులు ఉన్నట్లయితే మల విసర్జన ద్వారా పురుగులు బయటకు వెళ్తాయి. ఐదు, ఆరు, ఏడు నెలల గర్బిణీలకు సైతం ఈ డీవార్మింగ్ టాబ్లెట్లు వేసుకోవచ్చు. ఐదేళ్ల లోపు చిన్నారులకు సిరప్, ఐదేళ్ళు దాటిన వారికి మాత్రలు అందచేస్తారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారు వేసుకోకూడదు. నులిపురుగులు ఉన్నవారు మాత్రలు వేసుకుంటే వికారం, వాంతులయ్యే అవకాశం ఉంది. స్వల్పంగా జ్వరం వచ్చే అవకాశముంది.
అపరిశుభ్రతతో, ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే నులిపురుగులు వ్యాపిస్తాయి. కలుషిత ఆహారము ,ఈగలు వాలిన తినుబండారాలు దుమ్ము , ధూళి పడిన పదార్థాలు తినడం వల్ల, బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన ద్వారా, కాళ్ళకు చెప్పులు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లడం ద్వారా, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వంట సరుకులు, శుభ్రమైన నీటితో కడగకపోవడం వలన వ్యాప్తి చెందుతాయి. ఇసుకలో చెప్పులు లేకుండా నడవడం, మురికి నీరుకి దగ్గర్లో ఉండటం, ఇన్ఫెక్షన్ ఉన్న ఆహారం తినడం, అపరిశుభ్ర పానీయాలు తాగడం వంటి వాటి వలన కూడా ఇవి సోకుతాయి. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా వుండుట వల్ల పిల్లలు అందులో ఆడుకొనుట వల్ల అందులోని నులిపురుగులు వాటి లార్వాలు జీర్ణకోశంలోనికి ప్రవేశించడం వలన వ్యాప్తి చెందుతాయి. కావున చేతిగోర్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోర్లు పెరిగినప్పుడు వాటిని కత్తిరించుకోవాలి బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయడం వల్ల నులిపురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. భోజనం చేసేటప్పుడు శుభ్రంగా చేతులు కడుకోవాలి. కూరగాయాలను శుభ్రమైన నీటితో కడగాలి. ఆహార పదార్థాలపై ఎల్లప్పుడు మూతలు కప్పి ఉంచాలి.