రస్కిన్ బాండ్
రస్కిన్ బాండ్ (జ. 1934 మే 19) బ్రిటిష్ మూలాలు కలిగిన భారతీయ రచయిత. అతను తనను దత్తత తీసుకున్న కుటుంబంతో కలిసి భారతదేశంలోని ముస్సూరీలోని లాండౌర్లో నివసిస్తున్నాడు. భారతదేశంలో బాలల సాహిత్యం అభివృద్ధిలో అతని పాత్రను భారత విద్యా మండలి గుర్తించింది. బాల సాహిత్యంలో ఆయన చేసిన కృషికిగాను భారత ప్రభుత్వం ఆయనకు 1992లో సాహిత్య అకాడెమీ పురస్కారంతో సత్కరించింది. అంతే కాకుండా ఆయనకు 1999 లో పద్మశ్రీ, 2014 లో పద్మభూషణ్ పురస్కారం లభించాయి.[1]
రస్కిన్ బాండ్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | కసౌలీ, సోలన్ జిల్లా హిమాచల్ ప్రదేశ్, | 1934 మే 19
వృత్తి | రచయిత |
జాతీయత | భారతీయుడు |
కాలం | 1951–ప్రస్తుతం |
జీవిత విశేషాలు
రస్కిన్ బాండ్ బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ స్టేట్స్ ఏజెన్సీలోని కసౌలిలో ఎడిత్ క్లార్క్, ఆబ్రే అలెగ్జాండర్ బాండ్ దంపతులకు జన్మించాడు.[2][3] అతని తండ్రి జమ్నాగర్ ప్యాలెస్ యువరాణులకు, రస్కిన్, అతని సోదరి ఎల్లెన్ లకు ఆరు సంవత్సరాల వరకు అక్కడే నివసించి ఆంగ్లం బోధించాడు. తరువాత, రస్కిన్ తండ్రి 1939 లో రాయల్ ఎయిర్ ఫోర్స్లో చేరాడు. రస్కిన్ తన తల్లి, సోదరితో కలిసి డెహ్రాడూన్లోని తన తల్లి ఇంటిలో నివసించడానికి వెళ్ళాడు.
కొంతకాలం తర్వాత అతన్ని ముస్సౌరీలోని ఒక బోర్డింగ్ పాఠశాలకు పంపించారు. బాండ్కు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు, అతని తల్లి తండ్రి నుండి విడిపోయి, పంజాబీ హిందువైన హరిని వివాహం చేసుకుంది. అతని తండ్రి ఢిల్లీలో పనిచేస్తున్నందున రస్కిన్ను న్యూఢిల్లీకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేశాడు. అతను తన తండ్రికి చాలా సన్నిహితంగా ఉండేవాడు. అతను తన తండ్రితో గడిపిన ఈ కాలాన్ని తన జీవితంలో సంతోషకరమైన సమయాలలో ఒకటిగా వర్ణించాడు. అతను పది సంవత్సరాల వయస్సులో అతని తండ్రి కలకత్తాలో ఉద్యోగంలో నియమింపబడిన సమయంలో మలేరియాతో మరణించాడు. రస్కిన్ సిమ్లాలోని తన బోర్డింగ్ పాఠశాలలో ఉన్నాడు. అతని గురువు ఈ విషాదం గురించి అతనికి సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటనతో అతను బాధపడ్డాడు. తరువాత డెహ్రాడూన్లో నివసిస్తున్న అతని తల్లి, సవతి తండ్రి అతన్ని పెంచారు.
అతను సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్ నుండి 1950 లో పట్టభద్రుడయ్యాడు. ఇర్విన్ దైవత్వ బహుమతి, హేలీ సాహిత్య బహుమతితో సహా పాఠశాలలో అనేక రచనా పోటీలను గెలుచుకున్నాడు. అతను తన మొదటి చిన్న కథలలో ఒకటైన "అంటరానివాడు" 1951 లో తన పదహారేళ్ళ వయసులో రాశాడు.
ఉన్నత పాఠశాల విద్య తరువాత అతను మంచి అవకాశాల కోసం 1951 లో ఛానల్ ఐలాండ్స్ (యు.కె) లోని తన అత్త ఇంటికి వెళ్ళాడు. రెండు సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. లండన్లో అతను తన మొదటి నవల రస్టీ అనే అనాథ ఆంగ్లో-ఇండియన్ బాలుడి యొక్క జీవిత కథ అంశంగా "ది రూమ్ ఆన్ ది రూఫ్" ను రాసాడు. ఇది 30 ఏళ్లలోపు బ్రిటిష్ కామన్వెల్త్ రచయితకు లభించిన జాన్ లెవెల్లిన్ రైస్ ప్రైజ్ (1957) ను గెలుచుకుంది. అతను లండన్ వెళ్లి ఒక ప్రచురణకర్త కోసం వెతుకుతున్న సమయంలో ఒక ఫోటో స్టూడియోలో పనిచేశాడు. ఇది ప్రచురించడానికి చెల్లించిన అడ్వాన్సు డబ్బును బొంబాయికి సముద్ర మార్గంలో ప్రయాణానికి చెల్లించడానికి, డెహ్రాడూన్లో స్థిరపడటానికి ఉపయోగించాడు.[4]
అతను ఢిల్లీ, డెహ్రాడూన్ నుండి కొన్ని సంవత్సరాలు స్వతంత్రంగా పనిచేశాడు.[5] వార్తాపత్రికలు, పత్రికలకు చిన్న కథలు, కవితలు రాయడం ద్వారా ఆర్థికంగా తనను తాను నిలబెట్టుకున్నాడు. 1963 లో అతను ముస్సూరీలో నివసించడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఈ స్థలాన్ని ఇష్టపడటమే కాకుండా ఇది ఢిల్లీలోని సంపాదకులు, ప్రచురణకర్తలకు దగ్గరగా ఉంది. అతను నాలుగు సంవత్సరాలు ఒక పత్రికను ప్రచురించాడు. 1980 వ దశకంలో, "పెంగ్విన్ బుక్స్" భారతదేశంలో స్థాపించబడింది. ఆ సంస్థ కొన్ని పుస్తకాలు రాయడానికి అతనిని సంప్రదించింది. అతను ది రూమ్ ఆన్ ది రూఫ్ యొక్క కొనసాగింపుగా 1956 లో వాగ్రెంట్స్ ఇన్ ది వ్యాలీ వ్రాసాడు. ఈ రెండు నవలలు 1993 లో పెంగ్విన్ ఇండియా ఒక సంపుటంలో ప్రచురించబడ్డాయి. మరుసటి సంవత్సరం అతని కల్పితేతర రచనల సంకలనం ది బెస్ట్ ఆఫ్ రస్కిన్ బాండ్ పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. అతీంద్రియ కల్పనపై అతనికున్న ఆసక్తి ఘోస్ట్ స్టోరీస్ ఫ్రమ్ ది రాజ్, ఎ సీజన్ ఆఫ్ గోస్ట్స్, ఎ ఫేస్ ఇన్ ది డార్క్, ఇతర హాంటింగ్స్ వంటి రచనలకు వ్రాయడానికి దారితీసింది. అప్పటి నుండి అతను ది బ్లూ అంబ్రెల్లా, ఫన్నీ సైడ్ అప్, ఎ ఫ్లైట్ ఆఫ్ పీజియన్స్, పిల్లల కోసం 50 కి పైగా పుస్తకాలతో సహా ఐదు వందల చిన్న కథలు, వ్యాసాలు, నవలలు రాశాడు. అతను సీన్స్ ఫ్రమ్ ఎ రైటర్స్ లైఫ్ పేరుతో తన ఆత్మకథను ప్రచురించాడు. లోన్ ఫాక్స్ డ్యాన్సింగ్ అనే ఆత్మకథను 2017 లో ప్రచురించాడు. అతని పత్రిక నుండి వచ్చిన వ్యాసాలు, ఎపిసోడ్ల సమాహారం
1963 నుండి అతను ఉత్తరాఖండ్ లోని హిమాలయ పర్వత ప్రాంతంలోని ముస్సూరీలో ఒక ఫ్రీలాన్స్ రచయితగా నివసించాడు. అక్కడ అతను 1980 నుండి తన నివాసంగా ఉన్న లాండౌర్, ముస్సూరీ యొక్క ఐవీ కాటేజ్లో తన పెంపుడు కుటుంబంతో నివసిస్తున్నాడు..[6][7] అతని జీవితంలో ఏది యిష్టమన్న ప్రశ్నకు అతను "నేను ఇంతకాలం వ్రాయగలిగాను, నేను 17 లేదా 18 సంవత్సరాల వయస్సులో ప్రారంభించాను. నేను ఇంకా వ్రాస్తున్నాను. నేను ప్రచురించబడుతున్న ప్రొఫెషనల్ రచయిత కాకపోతే నేను ఇంకా వ్రాస్తాను." అని అన్నాడు.[8]
అతని సోదరి ఎల్లెన్ 2014 లో చనిపోయే వరకు తన సవతి సోదరితో కలిసి లుధియానాలో నివసించాడు. అతనికి కెనడాలో నివసిస్తున్న విలియం అనే సోదరుడు కూడా ఉన్నాడు.
పురస్కారాలు
పురస్కారం | సంవత్సరం |
---|---|
జాన్ లెవెల్లెన్ రేస్ ప్రైజ్ | 1957 |
సాహిత్య అకాడమీ పురస్కారం | 1992 |
పద్మశ్రీ పురస్కారం | 1999 |
పద్మభూషణ్ పురస్కారం | 2014 |
జీవితకాల సాఫల్య పురస్కారం | 2017 |
మూలాలు
బాహ్య లంకెలు
లువా తప్పిదం: bad argument #2 to 'title.new' (unrecognized namespace name 'Portal')