మొహెంజో-దారో

సింధ్, పాకిస్తాన్ ప్రావిన్స్ లో పురావస్తు ప్రదేశం

మొహంజో-దారో (సింధీ:موئن جو دڙو ఉర్దూ: موئن جو دڑو), అనగా చనిపోయినవారి గుట్ట ప్రస్తుత పాకిస్థాన్ లోని సింధ్ ప్రాంతానికి చెందిన చారిత్రకంగా, నాగరికతపరంగా అత్యంత ప్రాముఖ్యత గల ప్రాంతం. క్రీ.పూ 2500 లో నిర్మించబడిన ఈ నగరం సింధు లోయ నాగరికత లో అత్యధిక స్థిరత్వం పొందిన, పురాతన ఈజిప్టు, మెసొపొటేమియా నాగరికత, మినోవా, నార్టే చీకో నాగరికతలకు సమకాలీనమైనది. క్రీ.పూ 19వ శతాబ్దంలో సింధు నాగరికత అంతరించిపోయినపుడు, ఈ నగరం పరిత్యజించబడినది. 1920వ సంవత్సరం వరకూ ఇది గుర్తించబడలేదు. అప్పటి నుండి ఈ ప్రాంతంలో చాలా పరిశోధనాత్మక త్రవ్వకాలు జరుపబడ్డాయి. 1980 లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించారు.[2] ఈ స్థలం రాపిడి ఒరిపిడుల కారణంగాను, సరైన సంరక్షణ లేకపోవడానా శిథిలమౌతూ ఉంది.[3]

మొహెంజో-దారో
Moen-jo-daro
Mohenjo-daro
Mohenjo-daro
Shown within Pakistan
స్థానంLarkana District, Sindh, Pakistan
నిర్దేశాంకాలు27°19′45″N 68°08′20″E / 27.32917°N 68.13889°E / 27.32917; 68.13889
రకంSettlement
వైశాల్యం250 ha (620 acres)[1]
చరిత్ర
స్థాపన తేదీ26–25th century BCE
వదిలేసిన తేదీ19th century BCE
సంస్కృతులుIndus Valley Civilisation
UNESCO World Heritage Site
Official nameArchaeological Ruins at Moenjodaro
CriteriaCultural: ii, iii
సూచనలు138
శాసనం1980 (4th సెషన్ )
ప్రాంతం240 ha

ప్రదేశం

సింధు నదికి పడమర దిశగా సింధ్ కు చెందిన లర్కానా జిల్లా లో మొహంజో-దారో కలదు. ఇది సింధు నదికి, ఘగ్గర్-హక్రా నదికి మధ్యలో ఉన్నది. లర్కానా నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఇది కలదు.[4] నగరం చుట్టూ సింధు నది నుండి వచ్చే వరదనుండి రక్షించటానికి కోటగోడ కట్టబడినది. మొహంజో-దారో నాగరికతను బలహీనపరచిన చివరి వరద ఉధృతి కారణంగా ఈ కోటగోడ దెబ్బ తిన్నది. ఇప్పటికీ సింధు నది దీనికి తూర్పు దిశగా ప్రవహిస్తున్ననూ, పశ్చిమదిశలో ఉన్న ఘగ్గర్-హక్రా నది మాత్రం ఎండిపోయినది.[5]

చారిత్రక నేపథ్యం

మొహంజో-దారో సా.పూ. 26వ శతాబ్దంలో నిర్మించబడింది.[6] క్రీ.పూ. 3000 నుండి అభివృద్ధి చెందుతూ వచ్చిన ప్రాచీన సింధు లోయ నాగరికత (హరప్పా నాగరికత) లో నిర్మించబడిన అతిపెద్ద నగరాలలో ఇది ఒకటి.[7] ఉచ్ఛదశలో ఉన్నపుడు ప్రస్తుత పశ్చిమాన పాకిస్థాన్, ఉత్తర భారతదేశాలలో విస్తరించి ఉండేది. పశ్చిమాన ఇరాన్ సరిహద్దుల వరకు, ఉత్తరాన బాక్ట్రియా, దక్షిణాన గుజరాత్ వరకు విస్తరించి ఉండేది. ఈ నాగరికతకు చెందిన ప్రధానమైన నగరాలు హరప్పా, మొహంజో-దారో, లోథల్, కాలీబంగా, ధోలావీరా, రాఖీగఢీలు. మొహంజో-దారో ఆ కాలంలో అత్యంత అభివృద్ధి చెందిన నగరం. ఇక్కడి నిర్మాణంలో శాస్త్రీయత, ఆవాస ప్రణాళికలు అత్యంత అభివృద్ధి చెందినవి. సా.పూ. 1900 ప్రాంతంలో సింధు లోయ నాగరికత అకస్మాత్తుగా అంతరించినపుడు మొహంజో-దారో నిర్మానుష్యమైపోయింది.

ఆవిష్కరణ, తవ్వకం

ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారి ఆర్.డి. బెనర్జీ 1919–20లో ఈ స్థలాన్ని సందర్శించే వరకు, నగర శిధిలాలు సుమారు 3,700 సంవత్సరాల పాటు ఏ గుర్తింపూ లేకుండా పడి ఉన్నాయి. అక్కడ ఉన్న గుట్టను బౌద్ధ స్తూపంగా భావించి పరిశోధించిన బెనర్జీకి అక్కడ ఒక చెకుముకి రాతిలో (ఫ్లింట్) చేసిన పార వంటి పనిముట్టు కనిపించింది.‌ దాన్ని చాలా పురాతనమైన పనిముట్టుగా తెలుసుకున్న బెనర్జీ ఈ స్థలానికి ఉన్న ప్రాముఖ్యతను పసిగట్టాడు. 1924-25లో కాశీనాథ్ నారాయణ్ దీక్షిత్ నేతృత్వం లోను, 1925-26లో జాన్ మార్షల్ నేతృత్వం లోనూ మొహెంజో-దారోలో పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారు. 1930 వ దశకంలో మార్షల్, డి. కె. దీక్షితార్, ఎర్నెస్ట్ మాకే నాయకత్వంలో ఈ ప్రదేశంలో తవ్వకాలు జరిగాయి. 1945 లో మోర్టిమెర్ వీలర్, అతని శిష్యుడు అహ్మద్ హసన్ డాని మరిన్ని తవ్వకాలు జరిపారు. జార్జ్ ఎఫ్. డేల్స్ 1964 - 1965 లో చేసిన తవ్వకాలు ఇక్కడ జరిగిన చివరి తవ్వకాలు. ప్రకృతి శక్తుల వలన నష్టం జరుగుతున్న కారణంగా 1965 తరువాత అక్కడ తవ్వకాలను నిషేధించారు. అప్పటి నుండి ఈ ప్రదేశంలో అనుమతించబడిన ప్రాజెక్టులు నివృత్తి తవ్వకాలు, ఉపరితల సర్వేలు, పరిరక్షణ ప్రాజెక్టులు మాత్రమే. 1980 లలో, మైఖేల్ జాన్సన్, మౌరిజియో తోసి నేతృత్వంలోని జర్మన్, ఇటాలియన్ సర్వే బృందాలు మోహెంజో-దారో గురించి మరింత సమాచారం సేకరించడానికి గాను ఆర్కిటెక్చరల్ డాక్యుమెంటేషన్, ఉపరితల సర్వేలు, స్థానికీకరించిన ప్రోబింగ్ వంటి పెద్ద చొరబాటు కలిగించని పురావస్తు పద్ధతులను ఉపయోగించాయి. 2015 లో పాకిస్తాన్ ప్రభుత్వపు మొహెంజో దారో పరిరక్షణ ఏజన్సీ చేసిన డ్రై కోర్ పరిశీలనలో, మొహెంజో దారో లో తవ్వకాలు జరిపి వెలికితిసిన దానికంటే తవ్వకాలు జరపని విస్తీర్ణమే ఎక్కువని తేలింది.

ఇవి కూడా చూడండి

మూలాలు