వినోబా భావే

భారతీయ అహింస మరియు మానవ హక్కుల న్యాయవాది

ఆచార్య వినోబా భావేగా పేరొందిన చెందిన వినాయక్ నరహరి భావే (సెప్టెంబర్ 11, 1895 - నవంబర్ 15, 1982) స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది, మహాత్మా గాంధీకి ఆధ్యాత్మిక వారసుడు.

వినోబా భావే
జననం
వినాయక్ నరహరి భావే

(1895-09-11)1895 సెప్టెంబరు 11
గగోదే, మహారాష్ట్ర
మరణం1982 నవంబరు 15(1982-11-15) (వయసు 87)
వృత్తిస్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది

జననం

వినోబా, మహారాష్ట్రలోని గగోదేలో 1895, సెప్టెంబర్ 11న ఒక సాంప్రదాయ చిత్‌పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యములో ఈయన భగవద్గీత చదివి స్ఫూర్తి పొందాడు.

ఈయన మహాత్మా గాంధీతో పాటు భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకముగా చేసిన పోరాటానికి గాను 1932లో జైలు కెళ్ళాడు. జైల్లో సహ ఖైదీలకు, తన మాతృభాషైన మరాఠీలో భగవద్గీతపై కొన్ని ఉపన్యాసాలిచ్చాడు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ ఉపన్యాసాలే ఆ తరువాత టాక్స్ ఆన్ ది గీత అన్న పుస్తకంగా వెలువడ్డాయి. ఈ పుస్తకము దేశవిదేశాల్లో అనేక భాషల్లోకి అనువదించబడింది. వినోభా ఈ ఉపన్యాసాలకు ప్రేరణ మానవాతీతమైనదని, తన ఇతర రచనలు సమసిపోయినా ఈ ఉపన్యాసాల ప్రభావం మాత్రం ఎప్పటికీ ఉండిపోతుందని నమ్మాడు.

సంఘ సంస్కర్తగా

భారతదేశంలోని పల్లెల్లో జీవించే సగటుజీవి అనుభవించే కష్టాలకు సమస్యలను అన్వేషించడంలో చాలా కృషిని సలిపారు. కొన్నింటికి ఆధ్యాత్మిక ధోరణి సమంజసం అని కూడా భావించారు. ఈ ధోరణి క్రమేణా సర్వోదయా ఉద్యమానికి దారితీసింది. వినోబా భావేతో మమేకం చెందిన మరొక మహత్తర కార్యక్రమం భూదానోద్యమం. నూతన తరహాలో నడచిన ఈ భూదానోద్యమ ప్రచారంలో భాగంగా, దేశం నలుమూలలు పాదయాత్ర చేశాడు. ప్రతీ భూకామందుని వ్యక్తిగతంగా, తనను కొడుకుగా భావించి, కొంతైనా భూమిని యివ్వాలని ప్రార్థించాడు. అలా సేకరించిన భూమిని పేదలకు దానం ద్వారా పంచి పెట్టాడు. అహింస, ప్రేమలను మేళవించిన విధానం ఆయన తత్వం. వినోబా అంటే వెంటనే స్ఫురించే అంశం - గోహత్య విధాన నిర్మూలనం.

వినోబా తన జీవిత చరమాంకం, మహారాష్ట్రలోని పౌనాఋలో నిర్మించుకున్న ఆశ్రమ వాతావరణంలో గడిపాడు. ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని సమర్ధించిన వారిలో వినోబా ఒకరు కావడం, ఆ కాలాన్ని అనుశాసన పర్వంగా అభివర్ణించి, క్రమశిక్షణకు సరియైన సమయం అని వ్యాఖ్యానించారు.

విద్వత్తు ఉన్నచోట వివాదం, అసూయలు జనిస్తాయి. తర్కంలేని అతి గాంధీవాదం వినోబాది అని ప్రముఖ సాహితీవేత్త వి. ఎస్. నైపాల్ విమర్శించాడు. కాని, భారతీయ ఆర్థిక, రాజకీయవిధానంతో భాగస్వామ్యం పొందని నైపాల్ నుంచి యిటువంటి విమర్శలు రావడం చాలా విడ్డూరం అని ప్రతి విమర్శలు కూడా వచ్చాయి.

భూదానోద్యమ ప్రారంభం

1951 ఏప్రిల్ 18 న యాదాద్రి భువనగిరి జిల్లాలో వినోబా భావే పోచంపల్లి మండలంలో ప్రవేశించాడు. మొట్టమొదటి సారి భూదానోద్యమం ఇక్కడే నుండే ప్రారంభించబడింది. అందుకే దీనికి భూదాన్ పోచంపల్లి అని పిలుస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లిలోకి మొదటి సారి వినోబా భావే ప్రవేశించినప్పుడు అతన్ని గ్రామస్తులు స్వాగతించారు. కొంత కాలం పోచంపల్లిలో ఉన్నాడు. ఆయన అక్కడ 75% కంటే ఎక్కువ మంది భూమిలేని పేద గ్రామస్తులు ఉన్నారని తెలుసుకున్నారు. గ్రామస్తులు అతన్ని కలవటానికి వచ్చి 80 ఎకరాల (సగం తడి భూములు, ఇంకో సగం పొడి భూములు) భూమి కావాలని అడిగారు. అప్పుడు వినోబా భావే అందరు గ్రామస్తులకు ప్రభుత్వమే ఎందుకు సహాయం చేయాలి. భూస్వాములు తోటి పేదలకు సహాయ పడవచ్చుకదా అని అన్నారు. అప్పుడు వెంటనే వెదిరె రామచంద్రారెడ్డి అనే ఒక భూస్వామి నేను పేదలకు 100 ఎకరాల భూమి ఇస్తాను అన్ని వాగ్దానం చేశాడు. దీనితో, భారతదేశ భూసమస్యను పరిష్కరించే సామర్ధ్యం ఈ ఉద్యమానికి ఉందని వినోబాభావే అనుకున్నాడు. అక్కడ ఆ విధంగా భూదాన్ ఉద్యమం మొదలైయింది.[1][2]

ప్రతిభకు పురస్కారాలు

1958 లో వినోబాకు సామాజిక నాయకత్వంపై రామన్ మెగసెసే పురస్కారం మొట్టమొదటి స్వీకర్త వినోబా కావడం భారతదేశానికి దక్కిన గౌరవం. 1983లో భారతరత్న బిరుదుని వినోబా మరణాంతరం వెంటనే బహూకరించారు.

వినోబా భావాలు

విప్లవాలకు ఆధ్యాత్మికభావాలే మూలం; మానవుల హృదయాలని, మనస్సులని ఏకీకృతం చేయడానికే నా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం జరిగింది. ప్రశాంతత అనేది మానసికం, ఆధ్యాత్మకం. ఈ ధోరణులనుంచే మానవుల వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశిస్తాయి. ప్రపంచగమనం వీటిపైనే ఆధారపడింది. జై జగత్! విశ్వానికి విజయం! బీదప్రజల హృదయాలను సుసంపన్నంగాను, సంపన్నప్రజల హృదయాలను బీదతనంతోను భగవంతుడు సృష్టించడం విడ్డూరం, ఆశ్చర్యకరం. ప్రజాశక్తి, ప్రజాబలం సంకల్పంగా సాధించాలి. హింసాయుత, బలవంతపు అధికారిక రాజ్యపాలనం ఆహ్వానించదగ్గది కాదు. ఏ దేశమైనా, సైన్యం, యుద్ధసామగ్రి బలంతో కాక, నైతినబలంతో సమర్ధించుకోవాలి. పాతపడిన యుద్ధసామగ్రితో కొత్త యుద్ధాలు చేయగలగడం అసాధ్యం. ప్రభుత్వాల తప్పిదాలపై విమర్శించ వలసిన పని నాకు లేదు. మంచి పనులని అనుకున్నవాటిపై నా విమర్శ ఉంటుంది. విప్లవవాదాన్ని ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది అన్న భావం, భావన ఎన్నటికీ రానీయకూడదు. అహింసా విధానాలపై నిదానధోరణిని అవలబించకూడదు. అహింసామార్గం ద్వారా, అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే, కాలయాపన, జాప్యం శతృవులు అనే అనుకోవాలి. పట్టు ఎంతమాత్రం సడలకూడదు. మెతకదనం, పసలేని, ప్రభావంలేని అహింసావిధానాలను అవలంబించినందువల్ల ప్రస్తుత స్తబ్ధత కొనసాగే ప్రమాదంతోపాటు, పెరుగుదల, అభివృద్ధి చతికిలబడతాయి. చివరకు పరాజయం, నిరాశ తప్పవు. సమాజసేవ, అహింసామార్గం, గోరక్షణ, ఆధ్యాత్మకథోరణి, కుష్టివ్యాధిగ్రస్థులకు సహాయసహకారాలు, భూదానోద్యమం, యిలా ఎన్నో సేవలను అందించిన వినోబా భావే వివాదం లేని పరమాచార్యులు. భారతదేశానికి ప్రధానాచార్యులలో ఒకరు అని కచ్చితంగా చెప్పవచ్చు.

మరణం

ఆచార్య వినోబా భావే 1982, నవంబర్ 15 న, చివరి రోజుల్లో ఆహారం, నీరు తీసుకోడానికి నిరాకరించి, సల్లేఖనంగా భావించగా, కీర్తిశేషులైనారు.

మూలాలు

బయటి లింకులు