ఈఫిల్ టవర్

ఐఫిల్ టవర్ (ఫ్రెంచి: Tour Eiffel, /tuʀ ɛfɛl/) ప్యారిస్లో సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్ పై నిర్మించిన ఎత్తైన ఇనుప గోపురం. ఇది ఫ్రాన్సుకు మాత్రమే గర్వకారణమైన కాకుండా ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణం. ఈ టవర్ అగ్రభాగాన కొత్తగా 2022లో డిజిటల్ రేడియో యాంటెన్నాను ఏర్పాటు చేశారు. దీంతో ఆ టవర్ ఎత్తు మరో ఆరు మీటర్లు పెరిగి పూర్తి ఎత్తు 330 మీటర్లకు చేరింది.[1]

ఐఫిల్ టవర్
ఐఫిల్ టవర్

పరిచయం

2015లో ఈఫిల్ టవర్

దీనిని రూపొందించిన ఇంజనీరు గుస్టావ్ ఈఫిల్ పేరు మీదుగా దీనికి "ఈఫిల్ టవర్" అని పేరు వచ్చింది. ఇది ప్యారిస్ లోనే ఎత్తైన భవనమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలలో ఒకటి.[2] 1889లో దీనిని స్థాపించినప్పటి నుంచీ 200,000,000 (ఇరవై కోట్లు) మందికి పైగా దీన్ని సందర్శించారు.[3] వీరిలో 67,19,200 (అరవై ఏడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందలు) మంది 2006లో సందర్శించారు.[4] దీనివల్ల ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి గాంచింది.

ఈ టవర్ లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు. భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సమదృష్టి కోసం మూడు రకాలైన రంగులను ఉపయోగిస్తారు, బాగా ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పైభాగం లోనూ వేస్తారు.

చరిత్ర

నిర్మాణంలో ఈఫిల్ టవర్

ఈ నిర్మాణం 1887, 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈఫిల్ 1888వ సంవత్సరంలో బార్సిలోనాలో ఈ టవర్ ను నిర్మించాలనుకున్నాడు. కానీ బార్సిలోనా లోని దీనికి సంబంధించిన అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ నగరం యొక్క డిజైన్ లో సరిపడదని చెప్పారు. తరువాత ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్ లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. తరువాత అక్కడే 1889 లో దీన్ని నిర్మించడం జరిగింది.

మొదట్లో ఈఫిల్ టవర్ ను 20 సంవత్సరాల వరకే ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది. (టవర్ ను రూపొందించే పోటీలో భాగంగా దాన్ని కూలగొట్టడం కూడా సులువుగా ఉండాలి అని ఒక నియమం కూడా ఉండేది.) దీన్ని ప్రకారం 1909లో కూల్చివేయాలి. కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు,, మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తరువాత కూడా విజయ చిహ్నంగా అలాగే ఉంచేయడం జరిగింది.

ఆకారం

నిర్మాణంలో ఉపయోగించిన పదార్థాలు

ఈఫిల్ టవర్ మొత్తం బరువు 10,000 టన్నులు కాగా, అందులో లోహపు బరువు 7,300 టన్నులు.

Opఈఫిల్ టవర్ ను నిర్మించేటపుడు చాలా మంది దాని అకారాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈఫిల్, ఇంజనీరింగ్ తో సంబంధం లేకుండా చూసే వీక్షకుడి మెప్పుకోసం దీనిని రూపొందించాడని కొద్దిమంది విమర్శలు కూడా చేశారు. కానీ వంతెనల నిర్మాణంలో నిష్ణాతులైన ఈఫిల్, అతని బృందానికి మాత్రం తాము ప్రపంచంలోనే అతి ఎత్తైన నిర్మణాన్ని రూపొందిస్తున్నామని స్పష్టంగా తెలుసు. అందుకే బలమైన గాలులకు అది తట్టుకొనేటట్లుగా రూపొందించారు.

విశేషాలు

దీనిని నిర్మించేటపుడు ఈఫిల్ 72మంది ఫ్రెంచి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర ప్రముఖుల పేర్లు రాయించాడు. వీటిని మళ్ళీ 20వ శతాబ్దపు మొదట్లో తుడిచి వేశారు కానీ టవర్ కు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకునే సంస్థ చొరవతో 1986-87లో పునర్ముద్రించడం జరిగింది.

ముఖ్య సంఘటనలు

  • సెప్టెంబరు 10, 1889లో థామస్ అల్వా ఎడిసన్ దీనిని సందర్శించి ఈఫిల్ కు తన ప్రపంచంలో అతి పెద్దదైన ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించినందుకుగాను తన అభినందనలు తెలియజేస్తూ అక్కడి గెస్ట్ బుక్ లో సంతకం చేశాడు.
  • 1902లో మెరుపుల ప్రభావంతో టవరు 100మీటర్ల పైభాగం మొత్తం దెబ్బతిన్నది. టవరును కాంతితో నింపే కొన్ని విద్యుద్దీపాలను మార్చవలసి వచ్చింది.[5]
  • 1910లో థియోడర్ ఉల్ఫ్ దీనిని సందర్శించి టవర్ ఆడుగున విడుదలయ్యే ఉష్ణ శక్తిని, టవర్ పైభాగాన విడుదలయ్యే ఉష్ణశక్తిని అంచనా వేశాడు. ఈ అంచనాల మూలంగానే ఆయన కాస్మిక్ కిరణాలను కనుగొన్నాడు.[6]
  • 1930లో న్యూయార్క్ నగరంలో క్రిజ్లర్ భవంతిని నిర్మించడంతో ప్రపంచంలో ఎత్తైన నిర్మాణాలలో మొదటి స్థానాన్ని కోల్పోయింది.
  • జనవరి 3, 1956లో జరిగిన ఒక అగ్నిప్రమాదం వలన టవర్ పైభాగం కొంత దెబ్బతిన్నది.
  • 1957లో టవర్ పైభాగాన ప్రస్తుతం ఉన్న రేడియో యాంటెన్నాను అమర్చారు.

నమూనాలు

ప్రపంచవ్యాప్తంగా ఈఫిల్ టవర్ నమూనాలు చాలాచోట్ల నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో కూడా ఒక నమూనా నిర్మాణంలో ఉంది [7]

మూలాలు