మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన
మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన (ప్రస్తుత అనువాదం;[1] మొదట 1978లో మానవస్వత్వముల సార్వలౌకిక ప్రకటనగా అనువదించబడింది, [2] English: Universal Declaration of Human Rights యూనివర్సల్ ప్రకటన ఆఫ్ హ్యూమన్ రైట్స్ లేదా UNDHR యూన్.డి.ఎచ్.ఆర్) ఐక్యరాజ్యసమితి ఆమోదించిన చారిత్రాత్మక పత్రం. 1948 డిసెంబరు 10 న ఫ్రాన్స్లోని పారిస్లోని పలైస్ డి చైలోట్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం మూడవ సెషన్లో తీర్మానం-217 గా దీన్ని ఆమోదించింది. ఐక్యరాజ్యసమితిలో అప్పటి 58 మంది సభ్యులలో, 48 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఎవరూ వ్యతిరేకించలేదు. ఎనిమిది మంది వోటింగుకు దూరంగా ఉన్నారు. ఇద్దరు ఓటు వేయలేదు. [3]
మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన | |
---|---|
ప్రారంభ తేదీ | 1948 |
ఆమోదించిన తేదీ | 10 డిసెంబర్ 1948 |
ప్రదేశం | పాలై డి చైలోట్, పారిస్ |
రచయిత(లు) | Draft Committee[a] |
కారణం | మానవ హక్కులు |
పోస్టరు | |
---|---|
ఈ ప్రకటనలో, వ్యక్తి హక్కులను ధృవీకరించే 30 అధికరణాలు ఉన్నాయి. వాటికవే చట్టబద్ధమైనవి కాకపోయినా, తదుపరి చేసిన అంతర్జాతీయ ఒప్పందాలు, ఆర్థిక బదిలీలు, ప్రాంతీయ మానవ హక్కుల సాధనాలు, జాతీయ రాజ్యాంగాలు తదితర చట్టాలలో వీటికి చోటుకల్పించారు. 1966 లో పూర్తయిన అంతర్జాతీయ మానవ హక్కుల బిల్లును రూపొందించే ప్రక్రియలో ఈ ప్రకటన మొదటి దశ. తగిన సంఖ్యలో దేశాలు వాటిని ఆమోదించిన తరువాత 1976 లో ఈ బిల్లు అమల్లోకి వచ్చింది.
కొంతమంది న్యాయ విద్వాంసులు 50 ఏళ్ళకు పైగా వివిధ దేశాలు ఈ ప్రకటనను ప్రస్తావిస్తూ ఉన్నాయి కాబట్టి, ఇది ఆచరణాత్మక అంతర్జాతీయ చట్టంలో భాగంగా ఉన్నట్టేనని కొందరు న్యాయకోవిదులు అంటూంటారు. [4] [5] అయితే, సోసా v. అల్వారెజ్-మచైన్ (2004) కేసులో ఇచ్చిన తీర్పులో అమెరికా సుప్రీంకోర్టు, "అంతర్జాతీయ చట్టం పరంగా ఈ ప్రకటనకు బద్ధులై ఉండాల్సిన అవసరం లేదు" అని తేల్చి చెప్పింది. [6] ఇతర దేశాల న్యాయస్థానాలు కూడా ఈ ప్రకటన తమతమ దేశీయ చట్టాల్లో భాగం కాదని తేల్చిచెప్పాయి. [7]
నిర్మాణం, కంటెంటు
సార్వత్రిక ప్రకటన రెండవ ముసాయిదాలో దాని అంతర్లీన నిర్మాణాన్ని వివరించారు. దీన్ని రెనే కాసిన్ తయారు చేశారు. జాన్ పీటర్స్ హంఫ్రీ తయారు చేసిన తొలి ముసాయిదా నుండి కాసిన్ దీన్ని అభివృద్ధి చేశాడు. కోడే నెపోలియన్ చేత ప్రభావితమైన దీని నిర్మాణంలో ఒక అవతారిక, సాధారణ నియమాలూ ఉన్నాయి. కాసిన్ ఈ ప్రకటనను - పునాది, మెట్లు, నాలుగు స్తంభాలు, కిరీటం కలిగి ఉండే గ్రీకు ఆలయపు మంటపంతో పోల్చాడు.
ప్రకటనలో ఒక అవతారిక, ముప్పై అధికరణాలూ ఉన్నాయి:
- ప్రకటన యొక్క అవసరానికి దారితీసిన చారిత్రక, సామాజిక కారణాలను అవతారికలో వివరించారు.
- 1-2 అధికరణాలు గౌరవం, స్వేచ్ఛ, సమానత్వాల ప్రాథమిక భావనలను స్థాపించాయి.
- అధికరణాలు 3–5 జీవించే హక్కు వంటి ఇతర వైయక్తిక హక్కులనూ, బానిసత్వాన్ని, హింసను నిషేధించడాన్నీ ప్రతిపాదించాయి.
- 6-11 అధికరణాలు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినపుడు వారి రక్షణ కోసం చట్టబద్ధమైన నిర్దుష్ట పరిష్కారాలను సూచిస్తాయి.
- అధికరణాలు 12–17 సమాజం పట్ల వ్యక్తి హక్కులను ప్రతిపాదించాయి ( ఉద్యమించే స్వేచ్ఛ వంటి వాటితో సహా).
- 18-21 అధికరణాలు ఆధ్యాత్మిక, బహిరంగ, ఆలోచనా స్వేచ్ఛ, అభిప్రాయ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మనస్సాక్షి స్వేచ్ఛ, మాట, ప్రశాంతజీవనాలతో "రాజ్యాంగ స్వేచ్ఛ" అనే హక్కులను ప్రసాదించింది.
- అధికరణాలు 22–27 ఆరోగ్య సంరక్షణతో సహా వ్యక్తి యొక్క ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులను మంజూరు చేసింది. 25 వ అధికరణం ఇలా చెబుతోంది: "తనకూ, తన కుటుంబానికీ ఆహారం, దుస్తులు, గృహనిర్మాణం, వైద్య సంరక్షణ, అవసరమైన సామాజిక సేవలతో సహా ఆరోగ్యం, శ్రేయస్సు కోసం తగినంత జీవన ప్రమాణాలు కలిగి ఉండే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది." ఇది శారీరక బలహీనత లేదా వైకల్యం ఉన్నవారి భద్రత కోసం అదనపు వసతులను ప్రసాదిస్తుంది. తల్లులకు, పిల్లలకు ఇచ్చే సంరక్షణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.
- ఆర్టికల్ 28-30 ఈ హక్కులను ఉపయోగించుకునే సాధారణ మార్గాలను, ఈ హక్కులను అన్వయించలేని సందర్భాలను వివరించింది.
ఈ వ్యాసాలు సమాజం పట్ల వ్యక్తి విధులతోటి, ఐక్యరాజ్యసమితి సంస్థ ప్రయోజనాలకు విరుద్ధంగా హక్కుల వినియోగాన్ని నిషేధించడం తోటీ సంబంధించినవి.
చరిత్ర
నేపథ్యం
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నాజీ జర్మనీ చేసిన దారుణాలు పూర్తిగా వెల్లడైనప్పుడు, ఐక్యరాజ్యసమితి చార్టర్లో పేర్కొన్న హక్కులను తగినంతగా నిర్వచించలేదని ప్రపంచ సమాజంలో ఏకాభిప్రాయం ఏర్పడింది. [8] మానవ హక్కులపై చార్టర్ యొక్క నిబంధనలను అమలు చేయడానికి వ్యక్తుల హక్కులను పేర్కొన్న సార్వత్రిక ప్రకటన అవసరమైంది.
ముసాయిదా తయారీ
ఐరాస ఆర్థిక, సామాజిక మండలి 1946 జూన్లో మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ జాతీయతలకు, రాజకీయ నేపథ్యాలకూ చెందిన 18 మంది సభ్యులు ఉన్నారు. తొలుత దీన్ని అంతర్జాతీయ హక్కుల బిల్లుగా భావించి, అందులో భాగంగా ఏమేం ఉండ్లో వాటిని తయారుచేసే పనిని చేపట్టడానికి ఈ కమిషన్ను ఏర్పాటు చేసారు.
ప్రకటన లోని అధికరణాలను రాయడానికి కమిషను, ఎలియనోర్ రూజ్వెల్ట్ అధ్యక్షతన ప్రత్యేక యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ రెండేళ్ల కాలంలో రెండు సెషన్లలో సమావేశమైంది.
ఐక్యరాజ్యసమితి సచివాలయంలోని మానవ హక్కుల విభాగం డైరెక్టరు కెనడియన్ జాన్ పీటర్స్ హంఫ్రీని ఈ ప్రాజెక్టుపై పనిచేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ నియమించారు. ప్రధాన ముసాయిదా తయారు చేసినది అతడే. ఆ సమయంలో, హంఫ్రీని ఐక్యరాజ్యసమితి సచివాలయంలోని మానవ హక్కుల విభాగం డైరెక్టర్గా కొత్తగా నియమించారు.
ముసాయిదా కమిటీలోని ఇతర ప్రసిద్ధ సభ్యులలో ఫ్రాన్స్కు చెందిన రెనే కాసిన్, లెబనాన్కు చెందిన చార్లెస్ మాలిక్, చైనా రిపబ్లిక్ యొక్క పిసి చాంగ్ ఉన్నారు. [9] హంఫ్రీ ప్రారంభ ముసాయిదాను అందించాడు. అది కమిషన్ పని చేసే పాఠంగా మారింది.
భారతదేశానికి చెందిన హన్సా మెహతా డిక్లరేషన్లో "సృష్టిలో పురుషులంతా సమానమే" అనే వాక్యాన్ని "సృష్టిలో మానవులంతా సమానమే" గా మార్చాలని సూచించారు.
1948 మే లో కమిటీ తన పనిని పూర్తి చేసిన తర్వాత, ఆ సంవత్సరం డిసెంబరులో ఓటు వేయడానికి ముందు మానవ హక్కుల కమిషను, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీ యొక్క మూడవ కమిటీలు ఈ ముసాయిదాను చర్చించాయి. ఈ చర్చల సందర్భంగా యుఎన్ సభ్య దేశాలు అనేక సవరణలు, ప్రతిపాదనలూ చేశాయి. [10]
ఈ ప్రతిపాదనకు నైతిక బద్ధతే తప్ప చట్ట బద్ధత లేకపోవడం పట్ల బ్రిటిష్ ప్రతినిధులు తీవ్ర నిరాశకు గురయ్యారు. [11] (1976 లో పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక అమల్లోకి వచ్చింది. ఇందులో ప్రకటన లోని చాలా భాగానికి చట్టపరమైన హోదా వచ్చింది.)
స్వీకరణ
మూడవ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం పారిస్లోని పలైస్ డి చైలోట్లో జరిగింది. [12] ఈ సమావేశాల్లో 1948 డిసెంబరు 10 న సర్వప్రతినిధుల సభ ఈ సార్వత్రిక ప్రకటనను తీర్మానం 217 రూపంలో ఆమోదించింది. అప్పటికి ఐక్యరాజ్యసమితిలో ఉన్న 58 మంది సభ్యులలో [13], 48 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఎవరూ వ్యతిరేకించలేదు. ఎనిమిది దేశాలు వోటింగుకు దూరంగా ఉన్నాయి. [14] [15] హోండురాస్, యెమెన్ లు ఓటు వేయలేదు, దూరంగానూ లేరు. [16]
సమావేశ రికార్డు [17] చూస్తే చర్చపై అవగాహన కలుగుతుంది. దక్షిణాఫ్రికా వాదనలో తమ దేశంలోని వర్ణవివక్షను రక్షించుకునే ప్రయత్నం కనబడుతుంది. ప్రకటనలోని అనేక అధికరణాలను వర్ణవివక్ష వ్యవస్థ స్పష్టంగా ఉల్లంఘించింది. [14] ప్రకటనలోని రెండు అధికరణాల - "తన మతాన్ని లేదా విశ్వాసాన్ని మార్చుకునే హక్కు" ఇచ్చిన అధికరణం 18, సమాన వివాహ హక్కులు ఇచ్చిన అధికరణం 16 - కారణంగా సౌదీ అరేబియా ప్రతినిధి బృందం వోటింగులో పాల్గొనలేదు. ఫాసిజాన్ని, నాజీయిజాన్ని ఖండించడంలో ప్రకటన కావాల్సినంతగా ముందుకు రాలేదని అభిప్రాయపడి ఆరు కమ్యూనిస్ట్ దేశాలు వోటింగులో పాల్గొనలేదు. [18] పౌరులకు తమతమ దేశాలను విడిచి వెళ్ళే హక్కును కల్పించిన అధికరణం 13 కారణంగానే సోవియట్ కూటమి దేశాలు వోటింగులో పాల్గొనలేదని ఎలియనోర్ రూజ్వెల్ట్ అభిప్రాయపడింది.
ప్రకటనకు అనుకూలంగా ఓటు వేసిన 48 దేశాలు: [19]
- ఆఫ్ఘనిస్తాన్
- అర్జెంటైనా
- ఆస్ట్రేలియా
- బెల్జియమ్
- బొలీవియా
- బ్రెజిల్
- బర్మా
- కెనడా[a]
- చిలీ
- చైనా
- కొలంబియా
- కోస్టారికా
- క్యూబా
- డెన్మార్క్
- డొమినికన్ రిపబ్లిక్
- ఈక్వడార్
- ఈజిప్ట్
- ఎల్ సాల్వడార్
- ఇథియోపియా
- ఫ్రాన్స్
- గ్రీస్
- గ్వాటెమాలా
- హైటీ
- ఐస్ల్యాండ్
- భారత దేశం
- ఇరాన్
- ఇరాక్
- లెబనాన్
- లైబీరియా
- లక్సెంబర్గ్
- మెక్సికో
- నెదర్లాండ్స్
- న్యూజీల్యాండ్
- నికారాగువా
- నార్వే
- పాకిస్తాన్
- పనామా
- పరాగ్వే
- పెరూ
- ఫిలిప్పీన్స్
- థాయిలాండ్
- స్వీడన్
- సిరియా
- టర్కీ
- యునైటెడ్ కింగ్డమ్
- అమెరికా
- ఉరుగ్వే
- వెనెజువెలా
- a. ^ Despite the central role played by the Canadian John Peters Humphrey, the Canadian Government at first abstained from voting on the Declaration's draft, but later voted in favour of the final draft in the General Assembly.[31]
ఎనిమిది దేశాలు దూరంగా ఉన్నాయి: [19]
- చెకొస్లోవేకియా
- పోలండ్
- సౌదీ అరేబియా
- సోవియట్ యూనియన్
- బైలోరష్యా
- ఉక్రెయిన్
- దక్షిణాఫ్రికా
- యుగొస్లేవియా
రెండు దేశాలు ఓటు వేయలేదు:
- హోండురాస్
- యెమెన్
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
సార్వత్రిక ప్రకటన స్వీకారానికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబరు 10 న మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనిని మానవ హక్కుల దినోత్సవం లేదా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం అని పిలుస్తారు. ఈ దినోత్సవాన్ని వ్యక్తులు, సామాజిక, మత సమూహాలు, మానవ హక్కుల సంస్థలు, పార్లమెంటులు, ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి జరుపుకుంటాయి. ప్రకటన 60 వ వార్షికోత్సవం సందర్భంగా 2008 సంవత్సరంలో "మనందరికీ గౌరవం, న్యాయం" అనే థీమ్ చుట్టూ ఏడాది పొడవునా కార్యకలాపాలు జరిగాయి. [20]