రంజిత్ సింగ్
మహారాజా రంజిత్ సింగ్, (పంజాబీ: ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ), (1780 నవంబరు 13 - 1839 జూన్ 27, [3][4] భారత ఉపఖండపు వాయవ్య భాగంలో 19వ శతాబ్దిలో అధికారాన్ని కైవసం చేసుకున్న సిక్ఖు సామ్రాజ్యపు స్థాపకుడు, పరిపాలకుడు. తనకు పదేళ్ళ వయసు ఉండగా రంజీత్ సింగ్ తన తండ్రితో పాటుగా యుద్ధాల్లో పాల్గొన్నారు. తండ్రి మరణించాక అప్పటికి పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తూన్న ఆఫ్ఘాన్లను వెళ్ళగొట్టేందుకు 20 ఏళ్ళలోపే ఎన్నో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఆ క్రమంలో 21 సంవత్సరాలకే పంజాబ్ మహారాజాగా ప్రకటించుకోగలిగారు.[3][5] అతని నాయకత్వంలో 1839 వరకూ అతని సామ్రాజ్యం పంజాబ్ ప్రాంతంలో విస్తరించింది.[6][7]
మహారాజా రంజీత్ సింగ్ ਮਹਾਰਾਜਾ ਰਣਜੀਤ ਸਿੰਘ شیر پنجاب مهاراجه رانجیت سینگ | |
---|---|
పంజాబ్ మహారాజు లాహోర్ మహారాజా షేర్-ఇ-పంజాబ్ (పంజాబ్ సింహం) ఐదు నదుల ప్రభువు సర్కార్-ఇ-వాలా[1] | |
Reign | 1801 ఏప్రిల్ 12– 1839 జూన్ 27 |
పట్టాభిషేకం | 1801 ఏప్రిల్ 12 |
Successor | ఖరక్ సింగ్ |
జననం | ਬੁਧ ਸਿੰਘ బుద్ధ్ సింగ్ 1780 నవంబరు 13 [2] గుజ్రన్ వాలా, సుకేర్ చకియా మిస్ల్ (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది) |
మరణం | 1839 జూన్ 27 లాహోర్, పంజాబ్, సిక్ఖు సామ్రాజ్యం (ప్రస్తుత పాకిస్తాన్ లో ఉంది) | (వయసు 58)
Burial | దహనం చేసాక అస్థికలు పాకిస్తానీ పంజాబ్ లోని లాహోర్ లో రంజిత్ సింగ్ సమాధిలో ఉంచారు. |
తండ్రి | సర్దార్ మహా సింగ్ |
తల్లి | రాజ్ కౌర్ |
మతం | సిక్కు మతం |
రంజీత్ సింగ్ రాజ్యాన్ని సాధించడానికి ముందు పంజాబ్ అనేక వివాదగ్రస్తతమైన మిస్ల్ (సమాఖ్య) ల చేతిలో ఉండేది. వాటిలో పన్నెండింటిని సిక్ఖు పాలకులు, ఒకదాన్ని ముస్లింలు పరిపాలించేవారు.[5] రంజీత్ సింగ్ విజయవంతంగా సిక్ఖు మిస్ల్ లను తన సామ్రాజ్యంలో కలుపుకుని, ఐక్యం చేసి, ఇతర స్థానిక సామ్రాజ్యాలను గెలుచుకుని సిక్ఖు సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రధానంగానూ, మరికొన్ని ప్రాంతాల నుంచి మళ్ళీమళ్ళీ దండెత్తి వచ్చిన ముస్లిం సైన్యాలను పలుమార్లు విజయవంతంగా ఓడించారు. మరోవైపు బ్రిటీష్ వారితో సఖ్యంగా ఉండేవారు.[8]
రంజీత్ సింగ్ హయాంలో సంస్కరణలు, ఆధునికీకరణ, మౌలిక వనరులపై పెట్టుబడి వంటివి చోటుచేసుకుని సాధారణ సంపన్నత, శ్రేయస్సు జరిగాయి.[9][10] అతను ఖల్సా సైన్యంలోనూ, ప్రభుత్వంలోనూ సిక్ఖులు, హిందువులు, ముస్లింలు, ఐరోపీయులు కూడా స్థానం పొందారు.[11]
ఆయన ఘనత, స్మృతుల్లో సిక్ఖుల సంస్కృతిలోనూ, కళల్లోనూ పునరుజ్జీవనం సాధ్యమైంది, అమృత్ సర్ లో స్వర్ణ మందిరం పునర్నిర్మించడం, బీహార్, మహారాష్ట్ర ప్రాంతాల్లో వారి విరాళాలతో సిక్ఖు దేవాలయాలు నిర్మించడం వంటివి చేశారు.[12][13] పంజాబ్ సింహం అన్న అర్థం వచ్చే షేర్-ఇ-పంజాబ్ అన్న బిరుదుతో రంజీత్ సింగ్ ను వ్యవహరిస్తారు. మహారాజా రంజీత్ సింగ్ అనంతరం ఖరేక్ సింగ్ పరిపాలనకు వచ్చారు.