వికీమీడియా ఫౌండేషన్
వికీమీడియా ఫౌండేషన్ అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. ఇది వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల పురోగతికి కృషిచేస్తుంది. ఇది 2005లో స్థాపించబడింది. విజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తేవటానికి వివిధ దేశాలలో కల వికీపీడియా సంఘాలతో కలసిపనిచేస్తుంది. అంతేకాకుండా ప్రపంచంలోని కొన్ని దక్షిణాది దేశాలలో నేరుగా కార్యాలయాలను నెలకొల్పి ఉద్యోగులద్వారా వికీమీడియా ప్రాజెక్టుల త్వరిత పురోగతికి తోడ్పడుతుంది. భారతదేశంలో 2011 జనవరిలో పని ప్రారంభించింది. తరువాత నేరు పని విరమించి, సి.ఐ.ఎస్.(ప్రభుత్వేతర సంస్థ) ద్వారా కృషి కొనసాగిస్తున్నది.
ఫౌండేషన్ చరిత్ర
వికీమీడియా ఫౌండేషన్ [1] జూన్ 2003లో ప్రారంభించబడింది. వికీపీడియా వ్యవస్థాపకులలో ఒకరైన జిమ్మీ వేల్స్, తన సంస్థ ద్వారా ప్రారంభించిన వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను దీనికి అప్పగించాడు. బహుభాషలలో విజ్ఞాన సర్వస్వాలు, సోదర ప్రణాళికల పెంపు, అభివృద్ధి, వీటిలో సమాచారాన్ని ఉచిత పంపిణీ చేయటం దీని ముఖ్యోద్దేశం. దీని నిర్వహణకు ధర్మకర్తల (ట్రస్టీల) మండలి ఉంది. ఇది మూడు చోట్ల కొన్ని వందల కంప్యూటర్ సర్వర్లు నడుపుతూ, ఈ ప్రాజెక్టులను వీక్షించే దాదాపు నెలసరిగా అరకోటి ప్రజలకు సేవలందిస్తున్నది. దాదాపు 38 స్వతంత్ర స్థానిక వికీమీడియా సంఘాలతో, ఔత్సాహిక స్వచ్ఛంద కార్యకర్తలతో సమన్వయం చేస్తూ ప్రజల నుండి, సంస్థలనుండి ధన, వనరుల సేకరణ, ప్రాజెక్టులలో వాడబడే మీడియావికీ సాఫ్ట్వేర్ నిర్వహణ, అభివృద్ధి చేస్తుంది.అవగాహన పెంచే కార్యక్రమాలు, కొత్త వాడుకరుల సంఖ్యను అభివృద్ధి చేయటం, మొబైల్, జాలసంపర్కంలేని పద్ధతులలో వికీ ప్రాజెక్టుల సమాచారాన్ని అందచేయటం, శిక్షణా వీడియోలు తయారి, ప్రాజెక్టుల గణాంకాలలో మార్పులను విశ్లేషించి కొత్త తరహా ప్రాజెక్టులను చేపట్టటం, దీని ఇతర కార్యక్రమాలు.
వికీమీడియా సంఘాలు
వికీమీడియా సంఘాలు (చాప్టర్లు) ఒక దేశం ప్రాతిపదికగా వికీమీడియా ప్రాజెక్టుల పురోగతికి స్థాపించబడిన లాభాపేక్షరహిత స్వతంత్ర సంస్థలు. ఇవి వికీమీడియా ఫౌండేషన్ తో ఒప్పందం ప్రకారం సహకరించుకుని పనిచేస్తాయి.
వికీమీడియా భారతదేశం
భారతదేశంలో ఈ వికీమీడియా చాప్టర్ [2] సంఘం 2011 జనవరి 3 న బెంగుళూరులో నమోదైంది. డిసెంబరు 2011 నాటికి దాదాపు 170 పైగా సభ్యులు నమోదైయ్యారు. సెప్టెంబరు 24 న సర్వసభ్య సమావేశం జరుపుకొని, కార్యవర్గంలో కొత్త సభ్యులను ఎన్నుకుంది. జూలై 30 న నకలుహక్కులు, స్వేచ్ఛా పంపకషరతులు అనబడేదానిపై సదస్సు ఆ తరువాత సెప్టెంబరు 12 న కర్ణాటక రాష్ట్ర ప్రజా గ్రంథాలయాల శాఖ వారికి వికీ అవగాహన కార్యక్రమము నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాలు [3] ఇంకా దేశంలో పలుచోట్ల స్థానిక సభ్యులు లేకఅనుభవజ్ఞులైన వికీపీడియన్ల సహకారంతో నిర్వహించే పనిలో ఉంది.
ముంబయి సముదాయంతో కలసి వికీ కాన్ఫరెన్స్ ఇండియా [4] అనబడే జాతీయ స్థాయి సమావేశాన్ని నవంబరు 18-20, 2011 లలో నిర్వహించింది.
కార్యక్రమాలను మరింత చురుకుగా చేయటానికి, విస్తరించటానికి, కార్యనిర్వహక జట్టులోని సభ్యుల నేతృత్వంలో నగర, భాషా ప్రత్యేక ఆసక్తి జట్టులు, బహుళ వికీ ప్రాజెక్టులన సమన్వయంచేపట్టటం అలాగే రోజు వారి కార్యకలాపాలను సమర్థవంతంగా చేయటానికి నిర్వహణ, ధనసేకరణ, సమాచార, ప్రజాసంబంధాల జట్టులను ఏర్పాటుచేసింది.
అయితే విదేశీ ద్రవ్యం పొందేందుకు అవసరమైన చట్టపరమైన ఇబ్బందుల వలన, నేరుగా, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ ద్వారా వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలు మరి ఇతరచర్యల వలన వికీమీడియా భారతదేశం బలోపేతం కాలేకపోయింది, ఇతర కారణాలవలన సోదర సంస్థగా కొనసాగుటకు కావలసిన నిబంధనలను పాటించలేకపోయింది. 2019 సెప్టెంబరు 14 నుండి అమలు అయ్యేటట్లు వికీమీడియా భారతదేశం గుర్తింపు వికీమీడియా ఫౌండేషన్ రద్దుచేసింది.[5]
వికీమీడియా ఫౌండేషన్ భారతీయ ప్రణాళికల జట్టు
వికీమీడియా ఫౌండేషన్ తన దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా, భారతీయ వికీ ప్రాజెక్టుల [6] అభివృద్ధి వేగవంతం చేయడానికి, కొద్ది మంది ఉద్యోగస్తులను జనవరి 2011లో నియమించటం ప్రారంభించింది. సంవత్సరాంతానికి ఈ జట్టులో భారతీయ ప్రణాళికల సలహాదారు, ఆయనతో పాటు, భారతీయ భాషల సలహాదారు, విద్యావిషయక సలహాదారు, అవగాహన సదస్సుల సలహాదారు ఉన్నారు. ఇంకా ప్రజాసంబంధాల సలహదారుని నియమించవలసివుంది. పూనెలో భారతీయ విద్యా ప్రణాళికలో భాగంగా వివిధ కళాశాల విద్యార్థులతో వికీ వ్యాసాల ప్రణాళిక చేపట్టింది. కొంతకాలం తరువాత సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ అనే లాభనిరపేక్షసంస్థ ద్వారా కార్యకలాపాలు కొనసాగించింది.